![]() |
![]() |
.jpg)
మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్ ముఖం చూసి చాన్నాళ్ళే అయింది. అప్పుడెప్పుడో 'లౌక్యం' (2014)తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు గోపీ. అయితే, ఆ తరువాత మాత్రం గోపీచంద్ నటించిన ఏ చిత్రం కూడా విజయతీరాల వైపు వెళ్ళలేకపోయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'సీటీమార్' విడుదలకు సిద్ధమవగా.. మారుతి డైరెక్ట్ చేస్తున్న 'పక్కా కమర్షియల్' దాదాపు 50 శాతం పూర్తయింది. ఈ లోపే.. తన లక్కీ కెప్టెన్ శ్రీవాస్ కాంబినేషన్ లో 'లక్ష్యం', 'లౌక్యం' తరువాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపీచంద్. త్వరలోనే ఈ హ్యాట్రిక్ ఎటెంప్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ స్టార్ రాజశేఖర్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. 'లక్ష్యం' చిత్రంలో జగపతిబాబు పోషించిన పాత్ర తరహాలో ఈ క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. త్వరలోనే గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్ మూవీలో రాజశేఖర్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రాజశేఖర్ తన కెరీర్ ఆరంభంలో గోపీచంద్ తండ్రి, ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ రూపొందించిన 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' వంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు రాజశేఖర్ కి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. మరి.. గోపీచంద్, రాజశేఖర్ ఫస్ట్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా కూడా.. రాజశేఖర్ కి సరికొత్త ఇమేజ్ ని తీసుకువస్తుందేమో చూడాలి.
![]() |
![]() |