![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబు పలు రీమేక్స్ లో అలరించారు. వాటిలో 1972 నాటి `వంశోద్ధారకుడు` ఒకటి. సంపత్ లాల్ పురోహిత్ రచించిన `దో కదమ్ ఆగే` పుస్తకం ఆధారంగా రూపొందిన 1969 నాటి హిందీ చిత్రం `ఏక్ ఫూల్ దో మాలి` (సంజయ్ ఖాన్, సాధనా శివదాసని, బల్ రాజ్ సహ్ని) స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు పి. సాంబశివరావు. ఇందులో శోభన్ బాబుకి జంటగా కాంచన నటించగా మహానటుడు ఎస్వీ రంగారావు ఓ ప్రధాన పాత్ర పోషించారు. రావు గోపాల రావు, రావి కొండల రావు, మాలతి, ఛాయాదేవి, బేబి డాలీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. అంజలీ దేవి, కె.ఎస్. ప్రకాశరావు, ప్రభాకర రెడ్డి అతిథి పాత్రల్లో మెరిశారు.
ఘంటసాల మాస్టర్ సంగీతమందించిన ఈ చిత్రానికి ఆత్రేయ, దాశరథి, సి. నారాయణరెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. ``నువ్వు నవ్వు జతగా``, ``నానీ నా పేరుని నిలపాలి.. నానీ మన వంశం పెరగాలి..``, ``రెండు కళ్ళు వెతుకుతున్నవి``, ``మురళీలోలుడు ఎవడమ్మా``.. అంటూ సాగే ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. మాధవీ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ సినిమాని నిర్మించారు. 1972 ఏప్రిల్ 21న విడుదలైన `వంశోద్ధారకుడు`.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది. కాగా, దాదాపు 28 ఏళ్ళ తరువాత ఇదే టైటిల్ తో నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా ఓ సినిమా చేయడం విశేషం.
![]() |
![]() |