English | Telugu
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్ స్పీచ్.. దేశవ్యాప్తంగా సంచలనమేనా..?
Updated : Jun 3, 2025
జూన్ 12న 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. పైగా, పవన్ నటించిన తొలి చారిత్రాత్మక చిత్రమిది. దీంతో వీరమల్లుపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా.. లాక్ డౌన్ రావడం, పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం.. వంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
'హరి హర వీరమల్లు' సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 8న తిరుపతిలో ఘనంగా నిర్వహించడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పేలా వీరమల్లు సినిమా ఉండనుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. పవిత్ర నగరం తిరుపతిని ఎంచుకున్నారు. మరోవైపు నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ విమర్శించగా.. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో తిరుపతి ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి.. ఆయన ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా అది రాజకీయ కార్యక్రమాన్నే తలపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అలాంటిది ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. అందునా ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా. అంతేకాకుండా సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా. ఇన్ని ప్రత్యేకలు ఉండటంతో.. తిరుపతి ఈవెంట్ లో పవన్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నారు? అనేది జూన్ 8న తేలిపోనుంది.
