Read more!

English | Telugu

బ్లాక్ బస్టర్ కాంబోలో నాలుగో సినిమా!

ఈ ఏడాది 'వీరసింహారెడ్డి'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో విజయ్ తో చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ మాత్రం తెలుగు దర్శకుడి కంటే, తమిళ దర్శకుడి వైపే మొగ్గు చూపాడు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. దీంతో మలినేని నెక్స్ట్ మూవీ ఎవరితో అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆయన తనకు అచ్చొచ్చిన హీరో మాస్ మహారాజా రవితేజతో నాలుగోసారి చేతులు కలబోతున్నట్లు తెలుస్తోంది.

రవితేజ హీరోగా నటించిన 'డాన్ శీను'తో దర్శకుడిగా పరిచయమైన మలినేని మొదటి సినిమాతోనే మెప్పించాడు. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన 'బలుపు', 'క్రాక్' కూడా ఘన విజయాలు సాధించాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ క్రేజీ కాంబోలో ఇప్పుడు నాలుగో సినిమా రానుందని సమాచారం. వీరి కలయికలో రానున్న నాలుగో సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్' సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు వినికిడి.