Read more!

English | Telugu

ట్విస్ట్ అదిరింది.. పవన్ కళ్యాణ్ స్థానంలో రామ్ చరణ్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలు ఆలస్యమవుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ'.. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీకి 'ఓజీ' విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, రాబోయే ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారనే అంచనాలున్నాయి. అదే జరిగితే ఆయన సినిమా షూటింగ్ లకు తక్కువ సమయం కేటాయిస్తారు. దాంతో 'ఓజీ' సహా చేతిలో ఉన్న మిగతా సినిమాలన్నీ మరింత ఆలస్యమవుతాయి. అయితే ఒకవేళ 'ఓజీ' వాయిదా పడినా మెగా అభిమానులు మాత్రం నిరాశ చెందాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, ఆ తేదీకి పవన్ కళ్యాణ్ స్థానంలో రామ్ చరణ్ (Ram Charan) రాబోతున్నాడట.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న 'ఓజీ' విడుదల కావడం కష్టమేనని తెలియడంతో.. 'గేమ్ ఛేంజర్' టీం ఆ డేట్ పై కర్చీఫ్ వేసిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.