English | Telugu
సరైన టైంలో వచ్చిందంటున్న బాలకృష్ణ..ఎన్టీఆర్ ని గుర్తు చేసాడు
Updated : Apr 29, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)ఐదు దశాబ్దాల నుంచి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, ఫిక్షన్, ఫ్యాక్షన్ ఇలా అన్ని రకాల జోనర్స్ కి సంబంధించిన చిత్రాల్లో నటిస్తు అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి కళామతల్లికి చేస్తున్న ఈ సేవలకి గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్(Padmabhushan) ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu)చేతుల మీదుగా పద్మభూషణ్ ని అందుకున్నాడు.
ఈ విషయంపై బాలకృష్ణ మాట్లాడుతు నా అభిమానులకి కృతజ్ఞతలు. నాకు 'పద్మభూషణ్' ఎప్పుడో రావాల్సి ఉందని కొంత మంది అభిమానులు అంటున్నారు. కానీ సరైన సమయంలోనే వచ్చింది. నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్ గా నిలిచాయి. కాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభమయ్యి యాభై సంవత్సరాలు. అందుకే సరైన సమయంలో వచ్చి ఈ ఏడాది నాకు స్పెషల్ గా నిలిచిందని చెప్పుకొచ్చాడు.
ఇక బాలకృష పద్మభూషణ్ అందుకోవడానికి తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రధాని మోడీ, అమిత్ షా తో పాటు చాలా మందిని బాలయ్య ఆహార్యం ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా అందరు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు(Ntr)ని గుర్తు చేసుకున్నారు. పంచకట్టుతోనే ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలకి తెలుగు పౌరుషాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అభిమానులు, తెలుగు ప్రజలు కూడా బాలయ్య పంచెకట్టు తో పద్మభూషణ్ అందుకోవడం పట్ల గర్వంతో ఉన్నారు.
