English | Telugu

తెలుగు సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాను : అనిల్‌కపూర్‌

తెలుగు సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాను : అనిల్‌కపూర్‌

చలన చిత్ర పరిశ్రమలోని కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొందరు నటీనటులు వారి ప్రస్థానం ఎలా మొదలైంది అనేది తెలుసుకుంటే విచిత్రంగానూ అనిపిస్తుంది. బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా కొన్ని సంవత్సరాల పాటు కుర్రకారు కలల రాణిగా పేరు తెచ్చుకున్న హేమమాలిని సౌత్‌ సినిమాతోనే తెరంగేట్రం చేసింది అంటే నమ్మగలరా? ఇది నిజం. 1963లో వచ్చిన ‘ఇదు సతియం’ అనే తమిళ చిత్రంలో చిన్న క్యారెక్టర్‌ ద్వారా చిత్ర సీమకు పరిచయమైంది హేమమాలిని. ఆ తర్వాత 1965 తెలుగులో వచ్చిన ‘పాండవ వనవాసం’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. చిన్న పాత్రయినా ఎక్కువ గుర్తింపు వచ్చింది ఈ సినిమాలోనే. ఇప్పటికీ హేమమాలిని తొలి సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే చిత్రం ‘పాండవవనవాసం’.

ఇప్పుడు చెప్పుకోవాల్సిన మరో నటుడు అనిల్‌కపూర్‌. 66 ఏళ్ళ అనిల్‌కపూర్‌ చేసిన తాజా చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్‌ కపూర్‌ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ కోసం యూనిట్‌తో కలిసి అనిల్‌కపూర్‌ హైదరాబాద్‌ వచ్చారు. 

ఈ సందర్భ:గా అనిల్‌కపూర్‌ మాట్లాడుతూ ‘నన్ను హీరోని చేసింది తెలుగువారే. లెజండరీ డైరెక్టర్‌ బాపుగారు దర్శకత్వంలో వచ్చిన ‘వంశవృక్షం’ చిత్రం ద్వారా నన్ను హీరోగా పరిచయం చేశారు. ఆయన వల్లే నేడు నటుడిగా మీ ముందుకు ఇలా రాగలిగాను. నన్ను హీరోని చేసిన బాపుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా మొదటి సినిమాతో ఇక్కడి ఆడియన్స్‌కి పరిచయమైన నేను మళ్ళీ 43 ఏళ్ళ తర్వాత ‘యానిమల్‌’ సినిమాతో మీ ముందుకు వచ్చాను’’ అన్నారు.