Read more!

English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'ఆదిపురుష్' వస్తున్నాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి సిరీస్ బ్యానర్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకుడు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023, జూన్ 16న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. అయితే కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో వీఎఫ్ఎక్స్ కి మరింత సమయం పడుతుందని, సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశముందని న్యూస్ వినిపించింది. ఆ ప్రచారానికి తాజాగా మేకర్స్ చెక్ పెట్టారు.

'ఆదిపురుష్' విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మేకర్స్.. జూన్ 16న 'ఆదిపురుష్' విడుదలవుతుందని స్పష్టం చేశారు. దీంతో 'ఆదిపురుష్' మరోసారి వాయిదా అనే వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.

అలాగే 'ఆదిపురుష్' నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ రాబోతుందని తెలుస్తోంది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న కొత్త టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఆ రోజు నుంచి వరుస అప్డేట్స్ తో ప్రమోషన్స్ లో దూకుడు పెంచనున్నారట. గతేడాది అక్టోబర్ లో విడుదలైన టీజర్ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా బడ్జెట్ కి తగ్గస్థాయిలో వీఎఫ్ఎక్స్ లేదనే కామెంట్స్ వినిపించాయి. ఆ కారణంగానే అప్పుడు సినిమా వాయిదా పడింది. మరి ఇప్పుడు ఈ కొత్త టీజర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.