Read more!

English | Telugu

గోపీచంద్ మరో సాహసం.. 'రాధేశ్యామ్' దర్శకుడితో సినిమా!

ఘోర పరాజయం ఎదురైతే.. పేరున్న దర్శకులకు కూడా మరో అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది తీసిందే రెండు సినిమాలు. అందులో ఒకటి యావరేజ్, రెండోది డిజాస్టర్. అలాంటి దర్శకుడికి మూడో అవకాశం ఇచ్చే సాహసం ఎవరైనా చేస్తారా?. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మాత్రం.. తమ బ్యానర్ కి భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో ముచ్చటగా మూడో సినిమా చేయడానికి సిద్ధమవుతోంది.

గోపీచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన 'జిల్' చిత్రంతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2015లో వచ్చిన చిత్రం ఓ మోస్తరుగానే ఆడినప్పటికీ.. స్టైలిష్ డైరెక్టర్ గా రాధాకృష్ణకి మంచి పేరే వచ్చింది. అందుకేనేమో రెండో సినిమాకే ఏకంగా ప్రభాస్ తో 'రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని చేసే అవకాశాన్నిచ్చింది యూవీ. కానీ ఆ అవకాశాన్ని రాధాకృష్ణ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'రాధేశ్యామ్' మూవీ.. 2022 మార్చిలో విడుదలై ఘోర పరాజయం పాలైంది. 

మొదటి సినిమా యావరేజ్, రెండోది డిజాస్టర్ అయినప్పటికీ రాధాకృష్ణపై యూవీకి నమ్మకం పోలేదు. అతని దర్శకత్వ ప్రతిభను నమ్మి మూడో అవకాశం ఇచ్చినట్లు వినికిడి. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. 'జిల్' కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

కాగా గోపీచంద్ సరైన హిట్ కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఆయన గత చిత్రాలు 'పక్కా కమర్షియల్', 'రామబాణం', 'భీమా' నిరాశపరిచాయి. ప్రస్తుతం ఫామ్ లో లేని శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ నచ్చడం, 'జిల్'లో తనను స్టైలిష్ గా చూపించడం వంటి కారణాలతో.. గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.