Read more!

English | Telugu

ఆచార్య.. మెగా గాయానికి రెండేళ్లు!

అసలే తండ్రీకొడుకులు చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమా, పైగా అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ రూపొందించిన సినిమా, దానికి తోడు 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా. ఇన్ని పాజిటివ్ లు ఉంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆచార్య'(Acharya) విషయంలో అదే జరిగింది. కానీ ఆ చిత్రం ఆ అంచనాలకు అందుకోవడంలో పూర్తిగా విఫలమై, బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీతో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో 2022 ఏప్రిల్ 29న విడుదలైంది. మొదటి షోకే నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. చిరంజీవి, చరణ్, కొరటాల కెరీర్లలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించారు, కలిసి చిందేశారు అనే ఆనందం తప్ప.. ఈ సినిమా మెగా అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ చిత్రం విడుదలై నేటితో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'ఆచార్య' విడుదలకు ముందు ఏర్పడిన అంచనాలను, విడుదల తర్వాత తగిలిన గాయాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.