Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 40

    విస్మయంగా చూసింది.    
    "పత్రికలకి, అక్కడ నుంచి చౌదరికి మనం ప్రత్యర్దులమే అన్న విషయం తెలియచేయాలి కృషీ....ఎందుకంటే మనమధ్య సయోధ్య కుదిరినట్టు తెలిస్తే చౌదరి మీద నేను సంధించబోయే అస్త్రం గురితప్పే అవకాశముంది."    
    వివరంగా చెప్పాడు ఏం చెయ్యాలీ అన్నది.
    "థేంక్స్" అంది చివరిగా.    
    "దేనికి"    
    "ఆమె తల వంచుకుంది "నేను కోరుకుంటున్న మనిషి నేను కోరినట్టుగా ఆలోచిస్తున్నందుకు...    
    ఆ తర్వాత కృషి అక్కడ నిలబడలేదు. ఆ ద్వారంలో నుంచి బయటికి వస్తూనే ఆగింది ఎవరో పట్టి ఆపేసినట్టుగా.    
    అది సంశయం కాదు....భయం. ఫలానా అని చెప్పలేని ఆందోళన ఎందుకని....శరీరం కంపించి పోతూందేం....ఏ కాంక్షా తెలీని కళ్ళతో ఏకాంత జీవితపు సరిహద్దుల్ని కొలుస్తూ బ్రతికేసిన తనకు ఇప్పుడీ మనిషి గురించి ఇంత అలజడిగా వుందేం....చెక్కిళ్ళపై ఇప్పుడిప్పుడే కదలాడే కలల నీడలు రేపి నిజంకావేమో అన్న భయమా....లేక ఉవ్వెత్తున లేస్తున్న ఈ ఉద్రిక్త చైతన్యం ఏ ప్రమాదంలో చిక్కుకుంటూందో అన్నది దిగులా...    
    "ఏమైంది" అడిగాడు నెమ్మదిగా.    
    "జాగ్రత్త" కృషి గొంతు వణికిందెందుకో.    
    చెప్పలేదు విస్సూ....నిజానికి అతడికీ కంగారుగానే వుంది. అందులోనూ తను ఎదుర్కోబోతున్న వ్యక్తి సామాన్యుడు కాడు.    
    "ఒడ్డున కెరటం విసిరి కొడుతున్నా సముద్రంలోకి దూసుకుపోవడం జాలరి మనస్తత్వం కృషి....వాడికి అది బ్రతుకుతెరువైనా ఆ విషయం తెలిసి సముద్రం ఒక్కోసారి ఆ జాలరినీ బలి తీసుకుంటుంది."   
    "ఎందుకిలా మాట్లాడుతున్నావు"    
    "మళ్ళీ మాట్లాడే అవకాశం రాదేమో అన్న భయం కృషి"    
    "అంత ప్రమాదమనిపించినప్పుడు ఈ పోరాటం దేనికి?"        
    "కృషి" నిర్వేదంగా నవ్వేశాడు. "తెలిసో తెలియకో చాలా రోజుల క్రితమే నేను పులి మీద స్వారీ మెదలు పెట్టాను. నేను క్రిందికి దిగితే పులి మూలంగానే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా ఎందుకంటున్నాను అంటే మీ గ్రాండ్ పాని నేను సాధించాలనుకున్నాను. అలా అనుకుని చౌదరిలాంటి పులితో స్నేహం చేశాను. దురదృష్టవశాత్తూ మీ గ్రాండ్ పా కన్నా చౌదరే నా మూలంగా ఎక్కువ సమస్య కొనితెచ్చుకున్నాడు కాబట్టి నన్ను అంత సులభంగా వదిలి పెట్టడు"    
    కనిపించని ఏ దేవుడి గురించో కృషి ఆలోచించిన తొలి క్షణమది.    
                                   *    *    *    *    
    సాయంకాలం ఐదు గంటల సమయం....నెత్తురు పొత్తిళ్ళలో నిర్నిద్రంగా తలెత్తి చూస్తున్న బిడ్డలా సూర్యుడు అస్తమిస్తున్న వేళ....    
    ఓ అణువులాంటి క్షణం విస్పోటనం చెందబోతున్నట్టు పోలీస్ కంట్రోల్ రూం ఆవరణ టెన్షన్ తో నిండి వుంది.    
    కృషి లోపలనుంచి నెమ్మదిగా బయటకు నడుచుకువస్తూంటే పత్రికా విలేకర్లు చుట్టుముట్టారు.    
    అప్పటికే ఆమె విస్సు చెప్పిన పథకంలోని అంశాల్ని అమలుచేసింది.    
    మధ్యాహ్నానికల్లా చౌదరికి చెందిన ఆరుగురు నేరస్తుల్ని మాధుర్ ఓ అజ్ఞాత ప్రదేశంలో దాటేసాడు కమీషనర్ ఆదేశంపై. అలా కమీషనర్ ఆదేశించింది ఉపాధ్యాయ అభ్యర్ధన మీదనే....అజ్ఞాతంలో వుంచమన్నది కేవలం రెండు రోజులే కాబట్టి అదో పెద్ద అభ్యంతర మనిపించలేదు.    
    చౌదరి పంపిన లాయర్లు బెయిలు కోసం ప్రయత్నిస్తుండగానే తెలిసింది పోలీసులు వారిని విడిచిపెట్టినట్టు ముందు షాక్ తిన్నది చౌదరే. పోలీసు డిపార్టుమెంటులో తనకున్న పరపతితో వాళ్ళని వదిలిపెట్టారని అనుకున్నాడు తప్ప జరిగిందేమిటో ఆలోచించలేకపోయాడు....    
    అంతకుమించి తన దగ్గరకు తిరిగిరాని ఆ వ్యక్తులు విస్సూ అధీనంలో వున్నారేమో అని పొరపాటు పడ్డాడు కూడా.    
    "మేడమ్" ఓ విలేఖరి అడిగాడు "చౌదరిగారి మనుష్యుల్ని విడిచిపెట్టామంటున్న పోలీసుల గురించి మీ అభిప్రాయం ఏమిటి"    
    "నాకూ ఇప్పుడే తెలిసిందా విషయం....అయినా అది వాళ్ళ చట్టానికి సంబంధించిన విషయం నేనేం కామెంట్ చెయ్యగలను."    
    "ఉపాధ్యాయగారు చౌదరిగార్ల మధ్య సాగిన కార్పొరేట్ వార్ లో మీరు కీలకమైన పాత్ర వహించారని అందరూ అనుకుంటున్నారు మీ కామెంట్"    
    మృదువుగా నవ్వింది. "దీనిలో ప్రత్యేకించి నా పాత్ర ఏమీ లేదు. మీది అనుకున్న మీ వస్తువుపై ఎవరయినా దాడి చెయ్యటానికి ప్రయత్నించినప్పుడు మీరెలా రియాక్టవుతారో నేనూ అలాగే రియాక్టయ్యాను అంతే".        
    "ఇప్పుడు చౌదరిగారి పరిస్థితి విషమించిందని మా అభిప్రాయం.... మీరేమంటారు."    
    "సక్రమమైన మార్గంలో కాక అక్రమమైన పద్దతిలో ఎదగాలనుకునే ప్రతి వ్యక్తి ఏదో ఓ రోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. పైగా కోట్ల సంఖ్యలో పసిపిల్లల ప్రాణాలకు హాని తలపెట్టే చాక్ లెట్స్ ఉత్పత్తి చేసే వ్యక్తిని విడిచిపెడితే యీ ప్రభుత్వాన్ని ప్రజలు సైతం క్షమించదు పార్లమెంటులో యీ విషయం చర్చించబడింది పైగా సాక్షాత్తు దేశ ప్రధాని అర్జెంటుగా ఓ నివేదికని అందించమని శాస్త్రజ్ఞుల్ని ఆదేశించారూ అంటే ఇది సామాన్యమైన యిష్యూ కాదుగా."    
    "విస్సూ అనబడే ఓ వ్యక్తిమీద దాడి చేయటానికి చౌదరిగారు తన మనుషుల్ని పంపేడని అతడు స్టేట్ మెంటిచ్చాడు."    
    "దాని గురించి నన్నెందుకడుగుతున్నారు."    
    "ఆ రాత్రి మీరూ అక్కడ అతనితో బాటు వున్నారని తెలిసింది." ఈ ప్రశ్న అడిగింది చౌదరికి చాలా ఆత్మీయుడైన విలేకరి.    
    ఇది ఆమె వూహించని ప్రశ్న అయినా తొణక్కుండా జవాబు చెప్పింది. "ఎస్....అక్కడ వున్నాను. ఎందుకంటే కార్పోరేట్ చర్చలో సంధి చేసుకోవడమూ ఓ ముఖ్య సూత్రమే కాబట్టి."
     "సంధి అవసరమైతే మీరు వెళ్ళాల్సింది చౌదరి దగ్గరికి."    
    "నిజమే కాని ఈ విస్సూ అనబడే వ్యక్తి యిప్పుడు చౌదరి ఎంపైర్ ని నేలమట్టం చేయటానికి సాహసించినా తొలి నుంచి చౌదరి మనిషే...చౌదరి డబ్బు గూండాయిజం తప్ప మేధస్సుతో పోరాడే శక్తి లేనివాడు కాబట్టి విస్సూ అనబడే ఓ ఎడ్యుకేటెడ్ రోగ్ ని...." ఇబ్బందిగా ఉచ్చరించింది. "రోగ్ అనే పదాన్ని హైర్ చేసుకుని మాయ పోరాటానికి దింపాడు. కొన్నాళ్ళు చౌదరి గెలుపుకి కారణమైన ఆ తర్వాత యిద్దరికీ బెడిసి కొట్టడంతో భస్మాసురుడిలా చౌదరి నెత్తిమీదనే చేయిపెట్టాడు."    
    "మరి" నెమ్మదిగా అడిగాడు ఓ విలేకరి. "ఆ రాత్రి మీకూ, విస్సూకి సంధి కుదిరిందా"    
    "లేదు" టక్కున జవాబు చెప్పింది. "ఎందుకంటే ఒకనాడు తన తండ్రి మోహన్ గాంధీ హత్యకి కారణం మా గ్రాండ్ పా అని ఇంకా అతడు నమ్ముతూండబట్టి కాని నిజానికి అది జరిగింది ఎవరి మూలంగానో నేను నిరూపిస్తానని ఛాలెంజ్ చేసాను...."    
    "యూనియన్ లీడర్ మోహన్ గాంధీ మరణం ఆత్మహత్యగా..."    
    కారుని చేరుకున్న కృషి అంతకుమించి వివరాలు చెప్పడం ఇష్టం లేనట్టుగా అంది చేతులు జోడించి "ప్లీజ్ యింతకు మించి నేను మరేమీ చెప్పలేను. చౌదరి మూలంగా జరిగిన అనర్ధాలెన్నో ఏమిటో మీరు అతి త్వరలో తెలుసుకోబోతున్నారు అంతవరకూ వెయిట్ చెయ్యండి..."    
    కృషి వెళ్ళిపోయింది...నిజానికి ఆ సమావేశాన్ని తెలివిగా ఏర్పాటు చేయించింది కృషి అని చాలామందికి తెలియదు.....తెలిసింది ఓ ప్రముఖ దిన పత్రిక్కి చెందిన విలేకరికి. ఉపాధ్యాయకి ఆత్మీయుడైన వ్యక్తి అతను...        
    సరిగ్గా మరో అరగంటకి చౌదరికి యిక్కడి కృషి మాట్లాడిన విషయాలన్నీ తెలిసిపోయాయి.    
    బుల్లెట్ తో దెబ్బతిన్న పులిలా గాండ్రించాడు....నచ్చ చెప్పబోయిన లాయర్ రంగధాం ఎమ్మెల్యే రాజారావుల్ని కసురుకున్నాడు.    
    ఏమిటి తన గురించి కృషి తెలియజేయబోతున్నది.    
    పిల్లకాకిలా ఈ దేశంలో అడుగుపెట్టి రాబందులా మీద విరుచుకుపడ్డాక ఏ పథకాన్నీ అడ్డుకోలేక పోయిన చౌదరి యిప్పుడు ఎంత ఆందోళన పడ్డా అణువంత ఉపశమనంలా ఆనందించింది ఒక్క విషయంలోనే...    
    విస్సూ కృషికింకా ప్రత్యర్ధిగానే నిలబడి వున్నాడు.    
    తన తండ్రిని హత్య చేయించింది ఉపాధ్యాయ అని ఇంకా నమ్ముతున్నాడు....    
    కాదు ఆ హత్య చేయించింది చౌదరి అని కృషి చెప్పి వుండొచ్చు. నమ్మించాలని ప్రయత్నించినా ఎప్పుడో ముగిసిన కథకి యిప్పుడు సాక్ష్యాధారాలెక్కడివని...    
    చౌదరి యిక్కడ యిలా ఆలోచిస్తున్న సమయానికి దేవి ఇంటిలో ఫోన్ రింగయింది.    
    భక్తులతో ఆధ్యాత్మిక చింతనలో మునిగి వున్న దేవి అలాంటివేళ ఫోన్ కాల్ కి రెస్పాండ్ చేయదు... కాని ఫోన్ వచ్చింది ముఖ్యమంత్రి సెక్రటేరియట్ నుంచి అని ఆమె శిష్యురాలు రహస్యంగా చెప్పగానే అణువంత ఉద్విగ్నతకి లోనయ్యింది.    
    భక్తులతో కొలువు ముగించి బెడ్ రూంలోకి నడిచింది.    
    "దేవి మాట్లాడుతున్నది."    
    "నేను ముఖ్యమంత్రిగారి పియ్యేని...."    
    "ముఖ్యమంత్రిగారు ఢిల్లీలో వున్నారుగా" దేవి భ్రుకుటి ముడిచి అడిగింది.    
    "ఉన్నారు మేడమ్ కాని నాకు ఫోన్ చేసి మీకు అర్జంటుగా ఓ విషయం చెప్పమన్నారు."    
    ఎంతో అవసరం ఉంటే తప్ప ఇలా జరగదన్నట్టుగా కొద్దిగా కంపించింది దేవి.    
    "ఏమిటది?"    
    "చౌదరిగారి చాక్ లెట్ కంపెనీ గొడవ మీకు తెలుసుగా"    
    "విన్నాం"    
    "ఇప్పుడు చౌదరి పూర్వం చేయించిన మోహన్ గాంధీ హత్య అతని కొడుకు జీవితని హత్య చేసిన ఉదంతాల్లో మీ పాత్రల గురించి ఉపాధ్యాయ మనుమరాలు కృషి రహస్యంగా పరిశోధిస్తోందట. అప్పుడే కొంత సేకరించిందట.... మిమ్మల్ని జాగ్రత్తగా వుండమని చెప్పమన్నారు."    
    క్లిక్ మన్న చప్పుడు వినిపించింది.... సుఖంగా సాగిపోతున్న బంగారు నవలాటి జీవనయానం తుఫానులో చిక్కుకున్నట్టు కలవరపడిపోయింది దేవి...    
    తన పథకంలో రెండో మెట్టుని పూర్తి చేసిన విస్సు ఫోన్ క్రెడిల్ చేసిన రెండు నిముషాల వరకూ అలాగే నిలబడిపోయాడు.    
    అప్పుడు సమయం రాత్రి ఎనిమిదిగంటలు కావస్తూంది.    
    విస్సు అంచనా తప్పు కాలేదు...    
    దేవి వెంటనే చౌదరికి ఫోన్ చేసింది.    
    మరో అరగంట కల్లా దేవి బంగళాకి వచ్చాడు చౌదరి.    
    విస్సు ప్రణాళికలోని ఆఖరి ప్రమాదకరమైన ఘట్టం ప్రారంభమయ్యేది యిక్కడే....    
                                *    *    *    *    
    కదులుతున్న సుప్తభుజంగంలాంటి నిశిరాత్రి...    
    ప్రచండ ఝంఝా ప్రభంజనానికి ముందు దశలా వీస్తున్న గాలి దేవి సువిశాలమైన భవంతిలో స్మశాన స్థబ్దతని నింపుతూంది.    
    ఇన్నేళ్ళ పరిచయంలో దేవిలో కంగారు చూడటం తొలిసారి కావడంతో చౌదరి కూడా సన్నగా కంపిస్తున్నాడు.    
    ఎన్నో అతి ముఖ్యమైన నిర్ణయాలు కోట్ల ఖరీదు చేసే వ్యాపార లావాదేవీల్ని దేవి ఏ గదిలో చక్కబెట్టగలిగిందో యిప్పుడు అదే గదిలో ఆమె దిక్కు తోచనట్టు దిక్కులు చూస్తూంటే అసహనంగా అడిగాడు చౌదరి "నువ్వు చెప్పింది నిజమేనా"   
    "మా మనసు కూడా కీడు శంకిస్తుంది."    
    ఏదన్నా చేయగలదు, ఎవరినన్నా శాసించగలదనుకునే దేవి అలా మాట్లాడ్డం చౌదరికి అస్సలు నచ్చలేదు. అయినా ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ ఆమెను చూశాడు. అది క్షణంపాటే. ఆ తర్వాత వాతావరణాన్ని కాస్త తేలికపర్చితే తప్ప తన అంతర్మధనమూ చల్లారదనిపించి ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు.    
    ప్రతిసారీ గదిలోకి వచ్చిన రెండు నిముషాలకే నగ్నంగా మారి 'ముందు ఐక్యమౌదాం' అని చెప్పే దేవి ఇప్పుడు చౌదరి తనే చనువు తీసుకుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నాడని ఆలోచించటం లేదు. ఓ మామూలు ఆడదానిలా "మా మనసు మనసులో లేదు" అంది ఆమెను నగ్నంగా మార్చే అతడి ప్రయత్నాన్ని వారించబోతూ.    
    అతడు వినలేదు. ఎవరిమీద కోపమో అతడ్ని ఉద్వేగ పరుస్తూంటే మానభంగానికైనా తనిప్పుడు సిద్దమే అన్నట్టు ఆమె కాషాయ వస్త్రాల్ని లాగేసాడు...    
    ముందు సహకరించలేదు కాని రెండు నిముషాల వ్యవధిలో దేవి రగులుతున్న మొగలి పొదలా మారిపోయింది. కొండచిలువలా అతడ్ని చుట్టేసింది.    
    నిజానికి అది అనుభవం కాదు. ఆందోళనతో దహించుకుపోతున్న రెండు మనసుల్ని జోకొట్టే రాక్షస రతి.    
    గడ్డ కట్టుకుపోతున్న గుండె నిబ్బరానికి కోరి రక్తనాళాల స్పందనని అందించటానికి శస్త్రకారుడిలా చౌదరి శ్రమిస్తున్నాడు.

 Previous Page Next Page