Previous Page Next Page 
జనపదం పేజి 33

 

    నిర్విన్నుడై చూచాడు శేషయ్య. లాంతరు వెలుగులో కూడా కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రామయ్య కళ్ళు.
    "నేనేమన్ననుండి?" నా మీద గరమైతరు" అన్నాడు అక్కడ్నుంఛి కదల్లేదు.
    "ఆ ముండను మెచ్చుకుంటావు. సర్లే కూచో. అడ ఏమైందో చెప్పు."
    "ఎందుకు లేరి. మీరు గరమైతరు' అని కూర్చున్నాడు శేషయ్య.
    "అట్లకాదు. ముండమోసింది కడుపు చేసుకొనే. పోరన్ని  కనే. దాన్నేమో వీరభద్రం చేసుకున్న నంటాండే . దాన్నేమో నువ్వు మెచ్చు కుంటుంటివి. ఎట్లుంటదంటావ్" అడగనైతే అడిగాడు కాని గుండె కెలికింది రామయ్యకు.
    'ఏమో నాకెందుకు లేరి. సభ శానబాగా జరిగిందుండి. ఊరంతా ఆడనే ఉన్నదనుకోరి - నువ్వు తప్ప. అబ్బ జగ్గయ్యను, చచ్చినోళ్ళను ఏం పొగిడిన్రుండి లీడర్లు. ఎరుకలేక అడుగుత వీరభద్రం ఖానూన్లు చేస్తడట కాదుండి"
    "చేస్తడు పిడకలు. సర్కారుకు మన దొరలంటేనే నమ్మిక. ఎన్నికిండు గదా అనని ఊరుకుంటాండు. మల్ల గెలుస్తడేమో చూస్త. సర్లేగని ఆటకేవడన్న వచ్చిండా ఇయ్యాల!"
    "ఆటకేవడోస్తడుండి? ఊరంతా ఆడనే ఉండే'
    'కల్లు సార దుకాణాలు బందేనండి. ఒక్కడు రాలేదంటే తాగటానికి ' యాదగిరి చెప్పాడు.
    రామయ్య ఆలోచనలో పడిపోయాడు. యాదగిరి , శేషయ్య గ్లాసులు ఖాళీ చేస్తున్నారు.
    నిశ్శబ్దంగా గడిచింది కొంతకాలం.
    రామయ్య లేచి నుంచున్నాడు. 'యాదగిరి రేపు జగ్గయ్య పేరు మీద ఊరందరికీ సార పోయి. రేపు కల్లు సారా దుకాణాల్లో అమ్మకం బంద్. తాగినంత తాగ నియ్ గాడ్ది కొడుకులు' అని ఆజ్ఞాపించి చరచరా లోనికి వెళ్ళిపోయాడు రామయ్య.
    వెళ్ళిపోతున్న రామన్నను చూస్తూ వుండిపోయారు. యాదగిరి, శేషయ్య. తరవాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సీసా ఖాళీ చేసి మెట్లు దిగారు. 'జగ్గయ్య వంటి వీరుడు జగాన లేడయా' అని పాడుకుంటూ ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకొని తూలుతూ సాగిపోయారు.
    అప్పటికి అర్ధరాత్రి దాటింది. ఊరు నిర్మానుష్యంగా ఉంది. కుక్కలు అక్కడక్కడ మొరుగుతున్నాయి. చింత చెట్టు మీద పెద్దపిట్ట అరుస్తుంది. ఊరి బయటి నుంచి నక్కల ఊళలు వినిపిస్తున్నాయి.
     రామయ్య గదిలో అడుగు పెట్టాడు. సుమతి నిద్రపోతుంది. రామయ్య సుమతిని చూశాడు. మనసు కలుక్కుమంది. ఏదో అనుమానం భూతంలా మనసులో చేరింది. సుమతి కడుపుతో ఉంది. అందుకు కారకులెవరు? తానేనా? ఏమో? ఎందుకు అనుమానం? ఆ రాత్రి అవిడేందుకు వాంతి చేసుకుంది? అప్పటికే కడుపుతో ఉందా సుమతి? ఏమో! ఎనరికి తెలుసు? ఎన్ని సార్లు అడుగుదామనుకున్నాడు తాను? ఏమిటా పిచ్చి? అడిగితే చెప్పుతుందా ఆడది? ఇంకెంత కాలం? రహస్యం దాగుతుందా? ప్రసవిస్తే తెలియదా? ఓపిక పట్టడం మంచిది. అవును ఓపిక పట్టడం మంచిది.
    ఆ నిర్ణయం కొంత శాంతి నిచ్చిన మాట వాస్తవం. కాని వెంటనే మంగమ్మ అనర్గళంగా మాట్లాడిందనే మాటలు స్పురణకు వచ్చాయి. మంగమ్మ! మంగమ్మకు కొడుకు కలిగాడు! వాడు వాస్తవంగా తన కొడుకు. ఆ ధ్యాస వచ్చేవరకు అతనిలో ఏదో వేదన మొదలైంది. వాడు తన బిడ్డ! తనకు దూరంగా ఉన్నాడు. తన బిడ్డడు అని కనీసం చెప్పుకోలేకుండా ఉన్నాడు.
    ఆ అలోచనతో పాటే మంగమ్మ గుర్తుకు వచ్చింది. మంగమ్మ తనమీద పగ తీర్చుకోవడానికే చూస్తుంది. ఊరు వదిలి పోయింది పోకుండా మళ్ళీ వచ్చింది సిగ్గు లేకుండా . వీరభద్రాన్ని వెంట పెట్టుకొని వచ్చింది, పగ తీర్చుకోడానికి గుడిసెల డబ్బు విషయం కెలుకుతుంది. అసలు వాళ్ళు వచ్చిందే ఇందుకు. పేరు మాత్రం జగ్గయ్య దినం. తాను చేసిన మోసం బయటపడదు కదా! అంగుష్టాలు తమని కావంటారేమో ఊరివాళ్ళు. వీరభద్రానికి పెద్ద పెద్దవాళ్ళు తెలుసు. తానేమైపోతాడు! ఏం చేయాలి?  వీరభద్రాన్ని అంతమొందిస్తే! అమ్మో! వీరభద్రన్నా!
    రామయ్య గుండె దడదడ లాడింది. వాస్తవంగా వీరభద్రాన్ని తాను చంపినట్లు వణికిపోయాడు. నోరు అర్చుకొని పోయింది. సుమతిని లేపాడు. మంచినీళ్ళిమ్మన్నాడు . ఆమె ఇచ్చింది.
    "ఏదన్నా ముచ్చట చెప్పు' అడిగాడు రామయ్య.
    'ఇప్పుడెం ముచ్చట?'
    'చెప్పరాదు'
    'ఏం చెప్పమంటారు?'
    'ఏదన్న'
    'సభ బాగా జరిగిందంట కధ'
    'ఊ'
    'మంగమ్మ బాగ మా....'
    "సరే ఇగ పండుకో. నీకు గూడ ఆ ముచ్చటే వచ్చినదీ?"
    సుమతి వెర్రిగా చూచింది . రామయ్య దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. తాను పడుకుంది. కళ్ళు మూసుకుంది - కాని నిద్ర రాలేదు.
    ఇద్దరూ నిద్రపోలేదు.
    అయినా తెల్లవారింది.
    సారాయి సంతర్పణ వార్త అగ్గిలా పాకింది. ఎండ ఎక్కడంలో ఆ వార్తకు వేడి వచ్చింది. 'జగ్గయ్య పేర సారా పోస్తుందట రామయ్య ' ఊళ్ళో అదే ముచ్చట అయింది. తాగకముందే మత్తెక్కింది ఊరికి. జనం ఉదయం నుంచే గుంపులు గుంపులుగా చేరసాగారు దుకాణానికి. ఊరు సాంతం దుకాణం ముందు చేరింది. తొక్కిడిసాగింది. తోసుకోవడం సాగింది.  తిట్టుకోవడం సాగింది. తన్నుకోవడం సాగింది. జగ్గయ్యను అంతా మరచారు. అంతా సారాయిని భజించసాగారు.
    వీరభద్రం మీద ఈ వార్త పిడుగులా పడింది. కార్యక్రమం ప్రకారం ప్రజలంతా రమ్య ఇంటికి వెళ్ళి గుడిసెల డబ్బును గురించి అడగాల్సి ఉండే. కాని జనానికి సారాయి మత్తు కల్పించాడు రామయ్య. మస్తాన్, మల్లయ్య పరిగెత్తుకొని వచ్చి చెప్పారు.
    'మంది బాద్మషులున్నరుండి. వాడు సార పోయిస్తనంటే ఆటే ఉరుకుతాన్రు. ఒక్కడు వస్తలేడు'.'
    'నరకాల్నుండి గాడ్ది కొడుకును. ఎంత పెద్ద ఎత్తేసిండు" అన్నాడు మస్తాన్.
    "వాణ్నంటే ఏం లాభముండి మందికి బుద్ది లేకపాయే. మంది మీద పడి దోచుక తినేటోడు ఇన్ని సారానీలు పోస్తననంగానే ఉరికిరి" అన్నాడు మస్తాన్.
    "ఎంత ఘోరం! ఈ అన్యాయాన్ని ఎదిరించాలే. నేను వెళ్ళి ఊరందరికీ చెప్పుత" మంగమ్మ పులై లేచింది. నడుం కట్టి సిద్దం అయింది.
    వీరభద్రానికి ఏమీ తోచలేదు. వెర్రిగా చూడసాగాడు. ఏదో ఆలోచనలో పడిపోయాడు.
    'నడవండి' అన్న మంగమ్మ మాటలు అతన్నీ లోకంలోకి తెచ్చాయి.
    "లాభం లేదు. ప్రజలు మైకం లో ఉన్నారు. వాళ్ళు మనం చెప్పుతే వినరు. మత్తు దిగిం తర్వాత గాని వారికి అర్ధం కాదు. మరొక దెబ్బ తగిలినప్పుడు గాని వారు కోలుకోరు. ఇప్పుడు వారికి చెప్పడం వృధా - బాధపడుతూ ఒక్కడే కూర్చోవడం మేలు" అన్నాడు వీరభద్రం. అతని ధ్వనిలో ఏదో నిరాశ ఉంది. ఓటమి ఉంది.
    "అయితే గాజులు తొడిగించుకోవాలే. మంగమ్మ ఉద్రేకంగా అన్నాది. వీరభద్రం ఆమెను చూచాడు. కళ్ళు రక్తం కక్కుతున్నాయి. ప్రజలు అమాయకులు, అశాపరులు. తెలియచెప్పటం మన విధి. మీరు ఇంట్లో ఉండండి మేం వెళ్ళి వస్తాం. అని బయలుదేరింది. మస్తాన్, మల్లయ్య ఆవిడ వెంట సాగారు .
    వీరభద్రం వాళ్ళను చూస్తూ గుమ్మంలో నుంచున్నాడు.
    ముగ్గురూ సాగిపోయారు.
    వీరభద్రం నిట్టూర్చి వెనక్కు వెళ్ళి మంచంలో కూలబడ్డాడు.


                                                       *    *    *

    యాదగిరి, శేషయ్య వీరుల్లా వచ్చారు సారాయి దుకాణానికి. వారిని చూచి జనం తప్పుకున్నారు. తాళాలు తీశాడు యాదగిరి. జనంలో కల్లోలం మొదలైంది. దుకాణంలోకి చొరబడ్డారు జనం. విరుచుకుపడ్డారు జనం. ఆ వత్తిడిలో సారాయి జాడి బద్దలైంది. సారాయి ప్రవహించింది. జనం దాని మీద పడ్డారు. నేలమీద పడ్డ దాన్ని కతుకసాగారు. ఊరి జనమంతా గదిలో పట్టలేదు. బయటవారు లోనివారిని లాగుతున్నారు. తిడుతున్నారు. కొడ్తున్నారు. సారాయి వరద గుమ్మం దాటి బయటికి వచ్చింది. దానిమీద పడి నాకసాగారు జనం. అది దొరక్క ఆరాటపడుతున్నారు కొందరు. దొరికినవారికి దొరకనివారికీ యుద్ధం సాగింది. వీధి రణరంగంగా మారింది.
     ఈ దశలో వచ్చాడు రామయ్య. "అరె! ఎందుకురా కొట్టుకుంటారు. ఎందుకురా చస్తరు. జగ్గయ్య పేర సారా పోయిస్తున్న, సభ చేస్తలేను! ఎంతన్న తాగుండి పోస్త. అందరు వరసలుగ కూచోండి .' అని యాదగిరికి, శేషయ్యకు అజ్ఞాపించాడు రామయ్య. యాదగిరిని చాటుగా పిలిచి సర్కారు సారాయి కాదు కాపు సారాయి పోయ్యమన్నాడు.
    జనమంతా వీధిలో వరుసలుగా కూర్చున్నారు. కుండలతో సారాయి తెచ్చి వడ్డిస్తున్నారు. తాగుతున్న జనం రామయ్యను కీర్తిస్తున్నారు.
    ఆ దశలో వచ్చింది మంగమ్మ అక్కడికి. జనాన్ని చూచింది. వాళ్ళ తాగుడు చూచింది. వారి కీర్తనలు విన్నది. దూరంగా రామ్మయ్యను చూసింది. ఆమె రక్తం సలసల కాగింది. కేకలు వేసినట్లు మాట్లాడింది.
    "నిన్న జగ్గయ్య దినం జరుపుకున్నం. రమ్య బండారం బయటపెట్టాం. మీ పొట్టలు కొట్టి పెద్దోడైనాడు సార పొయిస్తూన్నడు. సార మైకంలో అతడు చేసినవన్నీ మరిచి పోతున్నరు. అందుకే అతడు సార పోయిస్తున్నది. ఆ విషయం మీరు గ్రహించలేకున్నారు. సార వదిలెయ్యండి. అంతా కదలండి. రామయ్య బండారం బయటపడాలి.'

 Previous Page Next Page