"వీళ్ళ పెళ్ళి జరుగదు" అని వనజ కూడా అక్కన్నించి వెళ్ళిపోయింది.
"ఇంత హఠాత్తుగా ఆ సుభద్రమ్మకేం వచ్చింది? నిన్నటిదాకా పిడుగులావుంది కదయ్యా?" అంటూ రాయుడు వాపోయాడు.
"ఈరోజు కూడా పిడుగులానే ఉందండి" అన్నాడు రచయిత, "నిజం చెబితే ఇంకా ఆ సుహాసిని ఎప్పటికీ అతడి ముఖం చూడదని భయం వేసింది."
"ఇప్పుడేం చేయాలంటావ్?"
"మనమింక దీన్ని సినిమా కథగా మార్చక తప్పదు."
"అంటే?"
రచయిత వివరించాడు. సుభద్రమ్మను దొంగలెత్తుకుపోతారు. పదివేలిచ్చి విడిపించుకోమంటారు. బామ్మగార్ని దొంగలెత్తుకుపోతారు. సుబ్బారావు దగ్గరున్న రహస్య పత్రాలేవో సంపాదించి ఇస్తే తప్ప ఆవిణ్ణి విడిపించుకోలేరంటారు. ఈ విధంగా సుహాసిని, సుబ్బారావు- దగ్గరకు వస్తారు. ఈసారి వాళ్ళ పెళ్ళిని ఆ బ్రహ్మ కూడా ఆపలేడు.
"కానీ__వ్యవహారంలోకి పోలీసులు వస్తే?" అన్నాడు రాయుడు.
"విషయం పోలీసులదాకా వెడితే__మనుషులు వస్తారని బెదిరిద్దాం."
"కానీ- ఇందుకు సుహాసిని తండ్రి ఊరుకుంటాడా అని!"
"అయ్యో__అసలిది పెద్దవాళ్ళ దాకా వెళ్ళదు" అన్నాడు రచయిత.
అతను తన మొత్తం పధకాన్ని రాయుడికి వివరించాడు. ఆ ప్రకారం సుభద్రమ్మ దగ్గర బంధువులెవరో ప్రమాద పరిస్థితుల్లో ఉన్నట్లు టెలిగ్రాం వస్తుంది. ఆవిడ బయల్దేరి వెడుతుంది. అప్పుడావిన్ని దొంగలు పట్టుకుపోయి సుబ్బారావుకుత్తరం రాస్తారు. అలాగే సుహాసిని బామ్మకూ జరుగుతుంది. బామ్మ ఊరికి వెళ్ళాక ఓ మనిషి ప్రత్యేకంగా సుహాసిని కలుసుకుంటాడు. బామ్మను తన ముఠా కిడ్నాప్ చేసిందనీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని__సుబ్బారావు దగ్గరుండే రహస్య పత్రాలు తను చెప్పిన చోటకు పట్టుకుని వస్తే బామ్మను గుట్టుచప్పుడు కాకుండా వదిలిపెట్టేస్తామని చెబుతాడు. ఆ ముఠాకు సుబ్బారావు, సుహాసినిల మధ్య ఉండే అనుబంధం తెలుసు. దాన్ని వాళ్ళు స్వప్రయోజనాల కుపయోగించుకున్నారు.
రచయిత చెబుతూంటే రాయుడంతా ఊహించుకుంటున్నాడు. రాయుడు తలచుకుంటే ఇలాంటి ఏర్పాట్లకు కొదవేముంది? దీనికోసం ఆయన ఊరిచివర బంగళా ఒకటి అద్దెకు తీసుకున్నాడు. నిజం రౌడీలను నియమించాడీ కార్యానికి.
15
బామ్మ, సుభద్రమ్మ ఓ హాల్లో ఉన్నారు. ఇద్దరూ ఒకరి నొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ దుస్థితికి ఓసారి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
"మా అబ్బాయి నాకోసం ఏమైనా చేస్తాడు. కానీ పదివేలెక్కన్నించి తేగలడు? పెళ్ళయితే కట్నంకింద వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు డబ్బెక్కన్నుంచి వస్తుంది!" అని సుభద్రమ్మ వాపోతే__
"నా మనుమరాలు నా కోసం ఏమైనా చేస్తుంది. కానీ సుబ్బారావు ఆ రహస్య పత్రాలు ఇస్తాడో, ఇవ్వడో ఇవ్వకపోతే నా పని సరి!" అని బామ్మ వాపోయింది.
"మా యింట్లో రహస్య పత్రాలేమిటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది" అంది సుభద్రమ్మ "అంత విలువైన రహస్య పత్రాలు మాకు తెలియకుండా ఉంటాయా?"
"ఏమో-ఇక్కడ కూడా నువ్వలాగే అంటున్నావు. నువ్వె అలాగంటే మీ అబ్బాయి మాత్రం ఆపత్రాలిస్తాడా? ఇదంతా నా చావుకే వచ్చింది."
"సైలెన్స్!" అని అరిచాడో రౌడీ. వాడి వేషాన్ని చూసి భయపడి ఇద్దరూ మాట్లాడ్డం మానేశారు. వాడు వెళ్ళిపోగానే బామ్మ" ఇంతవరకూ ఒకళ్ళని మాట్లాడకుండా చెయ్యడమే కానీ నన్ను మాట్లాడొద్దనడం ఎరగను" అంది.
"అదేంటోనండి వాడు సైలెన్సనగానే ఠక్కున నోరు దానంతటదే మూతి పడిపోయింది. ఇలా ఎప్పుడూ జరుగలేదు" అంది సుభద్రమ్మ.
"రోజులు మనవి కావు. అంతే అనుకోవాలి?" అంది బామ్మ.
సరిగ్గా అప్పుడే అక్కడికి సుహాసిని, సుబ్బారావు వచ్చారు. వాళ్ళ వెనుక మొత్తం సరిగ్గా ఆరుగురు రౌడీలున్నారు.
"మాబాస్ వచ్చేదాకా మీరంతా అలా కూర్చోండి ఎవ్వరూ మాట్లాడకూడదు" అన్నాడో రౌడీ వేషగాడు. సుహాసిని మాత్రం ఆగకుండా వెంటనే బామ్మ దగ్గరకు పరుగుణ వెళ్ళింది.
ఇద్దరూ ఒకరి నొకరు కౌగలించుకున్నారు.
"రహస్య పత్రాలు తెచ్చావా తల్లీ!" అంది బామ్మ దిగులుగా.
"తెచ్చాను__"అంది సుహాసిని.
"మా యింట్లో నాకు తెలియని రహస్య పత్రాలెక్కడివి?" అంది సుభద్రమ్మ.
"సైలెన్స్!" అన్నాడు రౌడీ.
మళ్ళీ అక్కడ కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కాసేపటికి బద్దలయింది.
"బాస్ - వస్తున్నాడు" అన్నాడో రౌడీ ఉత్సాహంగా.
కొద్ది క్షణాల్లో బాస్ వచ్చాడు. ఎత్తయిన విగ్రహం, ఒత్తయిన కనుబొమలు, క్రూరమైన చూపులు, ఖరీదైన బట్టలు నోట్లో పైపు.
"నువ్వేనా సుహాసినివి!" అన్నాడు బాస్. అతడిది కంచుకంఠం.
"అవును నేనే!"
"తెచ్చావా రహస్యపత్రాలు..."
"తెచ్చాను."
"అయితే వాటినిలా ఇచ్చి, మీ బామ్మను పట్టుకుపో"
సుహాసిని బాస్ ను సమీపించి ఓ కవరు అందించింది. బాస్ కవరు చింపాడు. అందులోంచి కాగితాలు బైటకు తీశాడు.
సుహాసిని బెదురుగా చూస్తోంది. తను ఆ పత్రాల కోసం సుబ్బారావు ఇంటికి వెళ్ళింది. ఆ సమయానికి ఇంట్లో సుబ్బారావు ఒక్కడూ దిగులుగా ఉన్నాడు. తను వచ్చిన పని చెప్పింది. సుబ్బారావు ఆశ్చర్యపడి- "నేనూ ఆ చోటకే వెళ్ళాలి. నాకు పదివేలు కావాలి!" అన్నాడు.
సుబ్బారావు దగ్గర పదివేలు లేవు. సుహాసినికి కావలసిన రహస్య పత్రాలూ లేవు. ఇద్దరూ కాసేపు తర్జన భర్జన చేశారు. ఆఖరికి సుహాసినీ ఉపాయం చెప్పింది. ఏవో నాలుగు పిచ్చిగీతలుగీసి ఆ కాగితాలనో కవర్లోపెట్టి అవే రహస్యపత్రాలని చెప్పి ఇద్దాం. ముందుగా ఆ చోటకు వెళితే ఏదో ఉపాయం దొరక్కపోదు. అక్కడకు వెళ్ళాక, అసలు రహస్య పత్రాల గురించి, పదివేల గురించీ ఆ ముఠావాళ్ళనే ఉపాయం చెప్పమందాం."
సుబ్బారావు, సుహాసిని ఆ ప్రకారం బయల్దేరారు. అక్కడికి చేరారు. ఆ పత్రాలు చూసి బాస్ ఏమంటాడు? ఎలా రియాక్టవుతాడు?
బాస్ ఆ కాగితాలు పరిశీలనగా చూసి- "వండ్రఫుల్! ఆఖరికి సాధించాను" అంటూ పెద్దగా కేకపెట్టి వికటాట్ట హాసం చేశాడు.