Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 30


    
    అతను చాలా ఇబ్బందిగా ఆమెవైపు చూశాడు.
    
    "చెప్పండి" అంటూన్నట్లు మళ్ళీ అతనివైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

    "మీ గురించే."
    
    "నా గురించా?"
    
    "అవును నేను రాత్రుళ్ళు పాడటంవలన మీకు నిద్రాభంగం కలుగుతోందని అమ్మాజీ చెప్పింది. అందుకని ఆపేశాను."
    
    చిన్మయికి ఏమనాలో తోచలేదు.
    
    తానామాట అనలేదు అనటం అబద్దమవుతుంది.
    
    "ఊరికినే తమాషాకు అన్నాను మీరు పాడుకోండి" అన్నది చివరకు.
    
    "నిజమా!" అన్నాడు. అతని కళ్ళల్లో చాలా సంతోషం కనిపించింది.
    
    "అవును. సంగీతమంటే నాకూ ఇష్టమే."
    
    "నిజమా!" అన్నాడు మళ్ళీ "మీరుకూడా పాడతారా?"
    
    "ఏదో కొంచెం."
    
    "పాటలు పాడేవాళ్ళంటే నాకు చాలా యిష్టమండీ" అన్నాడు చప్పున. అతని మొహంలోకి చూసింది. తనకో తోడు దొరికారన్న సంతోషం తప్ప మరే యితర భావమూ కనబడలేదు.
    
    "మీరు సంగీతమెక్కడ నేర్చుకున్నారు?" అనడిగింది.
    
    "ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. నాకు గురువంటూ ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచీ వున్న ఇంటరెస్ట్వల్ల బాగా పాడేవాళ్ళ దగ్గర వినీ, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి రికార్డులూ, క్యాసెట్లూ వేసుకుని అలా అలా నేర్చుకున్నాను."
    
    "మీరు చాలా బాగా పాడతారు" అంది.
    
    "మీరు శాస్త్రీయ సంగీతం ఎంత మధురంగా పాడతారో, లలిత సంగీతం అంత హాయిగా పాడతారు" అంది మళ్ళీ.
    
    అతనికి సిగ్గుగా వుంది. సంతోషంగా వుంది. గర్వంగా వుంది. అతనింట్లో ఎప్పుడు పాడినా పెద్దవాళ్ళు విసుక్కునేవారు. చుట్టాలు ఎగతాళి చేసేవారు. స్నేహితులు ఏడిపించేవారు. "ఆపరా బాబూ! నీ సంగీతం నువ్వూనూ! వినలేక చస్తున్నాం" అనేవాళ్ళు. దాంతో ఒకరకమైన ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఎవరూ లేనప్పుడు రాత్రివేళల పాడుకునేవాడు.
    
    "మీకు త్రిమూర్తులలో ఎవరంటే ఇష్టం?" అనడిగింది.
    
    త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి- ఈ ముగ్గుర్ని సంగీత త్రిమూర్తులంటారు.
    
    "కర్ణాటక సంగీతానికి ప్రాణంపోసిన యీ ముగ్గురిలో ఎవరు గొప్ప అంటే చెప్పటం చాలా కష్టం. త్యాగరాజు కీర్తనలు జనాంతికంగా వుంటాయి. వాటిలో భక్తిభావం, సరళత్వం ఎక్కువగా వుండి. యితరులు అనుసరించటానికి, పాడుకోవటానికి వీలుగా వుంటాయి. ఒకరకంగా ఆయన జనంలోకి చొచ్చుకు వెళ్ళాడనీ చెప్పవచ్చు. మిగతా యిద్దరికంటే త్యాగరాజుకి శిష్యులెక్కువగా వుండటంచేత వాళ్ళు ఎక్కువగా సంచారం చేస్తూ ఆయన కీర్తనలను పాడుతూ వుండటంచేత వాటికి ఎక్కువగా ప్రాచుర్యం లభించింది. ముత్తుస్వామి దీక్షితులు ఎక్కువగా పాండిత్యబలం, సంస్కృతజ్ఞానం వున్నవాడు. ఆయనకు శిష్యులు ఎక్కువ లేకపోయినా ఆయన తమ్ముళ్ళు అద్భుతంగా పాడి, వాటిలోని గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇహ శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితులుకి యీయనే మొదట ఉపదేశం ఇచ్చారని కొందరు చెబుతారు. త్యాగరాజు కాలంలోనే యీయన జీవించారు. తిరువాయూర్ లోని త్యాగరాజింటికీ ఈయన వెళ్లినప్పుడు యిద్దరూ కలిసి సంగీత చర్చ మొదలు పెడితే శిష్యులు, వీళ్ళిద్దరూ చర్చ మొదలుపెట్టారు ఇహ మన భోజనాలయినట్టే, అనుకునేవారు. ఈయన కీర్తనలు త్యాగరాజు కృతులంత సరళమూ కాదు, ముత్తుస్వామి దీక్షితుల కృతుల్లా శ్రమపడితే సాధ్యమయేవీ కావు. దేవీ భక్తి అంతర్వాహినిగా వుంటుంది. శ్యామశాస్త్రికి ఆనందభైరవి రాగమంటే యిష్టం. నాకెందుకో ఆయన కీర్తనలెక్కువగా పాడుకోవాలనిపిస్తుంది."
    
    చిన్మయి ముగ్ధురాలయి వింటోంది.
    
    "నాకూ శ్యామశాస్త్రి కృతులంటే చాలా ఇష్టం" అన్నది అప్రయత్నంగా.
    
    "నిజమా? ఒకసారి పాడరూ?" అనడిగాడు.
    
    "నేనా?" అంది చిన్మయి బిత్తరపోయినట్లుగా.
    
    "ప్లీజ్ ! పాడండి" అన్నాడు ఆనందమోహన్ చిన్నపిల్లాడిలా.
    
    తమ యిద్దరి మధ్యా యీ సన్నివేశం ఆమెకు చాలా చిత్రంగా వుంది. తానెవరితో యింత చనువుగా...
    
    ఎందుకిలా జరుగుతోంది?
    
    చిన్మయి ఇందాకట్నుంచీ నిలబడే వుంది. ఇప్పుడు సోఫాచుట్టూ తిరిగివచ్చి అతనికి మరీ ఎదురుగా కాకుండా ఏటవాలుగా వుండేటట్లు కూర్చుంది.
    
    "పాడండి" అన్నాడు ఆనందమోహన్ మళ్ళీ.
    
    చిన్మయి అతనివైపు చూడకుండా చూపులు వాల్చుకొని పాడింది.
    
    శంకరాభరణం రాగంలో...
    
    సరోజదళ నేత్రి హిమగిరి పుత్రి, నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మ శుభమిమ్మ శ్రీ మీనాక్షమ్మ.
    
    ఆనందమోహన్ విస్మయుడైపోయి ముగ్ధబాలుడిలా వింటున్నాడు.
    
    పరాకు చేయకు వరదాయని నీవలె దైవము లోకంలో గలదా? శ్రీ రాణి శుకవాణి మధుకరవేణి సదా శివునికి రాణి.
    
    ఎక్కడ్నించో జీవన విహంగం ఎగిరి వస్తూన్నట్లు, అడవిలో వంటరిగా శోకతప్తురాలైన స్త్రీ నేలరాలిన ఎండుటాకులమీద ఎత్తుగా పెరిగిన వటవృక్షాల మధ్య తిరుగాడుతూ ఎలుగెత్తి ప్రకృతి గానం చేస్తున్నట్లు...
    
    వింత వింత అనుభూతులు.
    
    "మార్వలెస్" ఆనందోద్రేకం ఆపుకోలేక దగ్గరకి వచ్చిన అతని చెయ్యి ఆమె భుజాన్ని స్పృశించినప్పుడు ఈ లోకంలోకి వచ్చింది చిన్మయి.
    
                                                                     * * *
    
    ఆ రాత్రి...

    పదయింది. పదిన్నరయింది. పదకొండయింది.    

    చిన్మయికి నిద్రపట్టటంలేదు. ప్రక్కింట్లోంచి మనోహరమైన గానం మొదలయింది.

 Previous Page Next Page