వంటింట్లో వంట మనిషికి పురమాయిస్తున్న ఆవిడ ఓసారి బయటికి వచ్చి 'వచ్చావా, వెళ్ళు, వాసంతి గదిలో వుంది' అంది.
గదిలోకి వెళ్ళేసరికి వాసంతి తలంటుకుని పట్టుచీర కట్టుకుని పిల్లాడికి కొత్తబట్టలు తొడుగుతుంది. గదిలో బావగారు పట్టుపంచెలు కట్టుకుని పీటలమీద కూర్చోడానికి రెడీగా వున్నారు.
'మరదలు పిల్లగారు వచ్చారా, ధన్యులం రావేమో అనుకున్నాను' అన్నారు నవ్వుతూ జయంతి సిగ్గుపడింది.
'ఎందుకు రాదు. పినతల్లి తల్లితో సమానం. పిల్లాడికోసమన్నా రాదా కూర్చోవే ఏమిటలా పరాయిదానిలా మొహమాటపడ్తున్నావు' అంది వాసంతి.
'ఎవరెవరు వచ్చారక్కయ్యా మీ అత్తగారు వాళ్ళంతా వచ్చారా' మాట కలిపింది.
'అత్తయ్యగారు, మామయ్యగారు వచ్చారు. మా ఆడపడుచు ఇంట్లో వున్నారు. వస్తారిప్పుడు. పది గంటలకి ముహూర్తం కదా, టిఫిను తిన్నావా వంటింట్లో అమ్మ వుంది. వెళ్ళి తిను' అంది వాసంతి. జయంతి ఏదో అనేలోపలే పద్మావతి ప్లేటులో ఉప్మాపెట్టుకుని వచ్చి 'టిఫిను తిను మళ్ళీ అంతా వచ్చేస్తారు' అంది జయంతికి ప్లేటు అందిస్తూ, 'తిన్నాను' అని చెప్పాలనుకుని మళ్ళీ విరమించుకుని ప్లేటు తీసుకుని 'నే వచ్చేదాన్నిగా నీవెందుకు తేవడం' అంది. 'ఏమో తల్లీ గెస్టులా వచ్చావు గదా, టిఫిను కాఫీ ఇవ్వద్దా, మర్యాద చెయ్యద్దా' అంది నవ్వుతూ ఆవిడ. జయంతి మొహం కాస్త ముడుచుకుంది. 'ఏంటమ్మా అదసలే మొహమాటపడ్తుంది' వాసంతి తల్లితో అంది.
'మొహమాటం ఎందుకే పుట్టి పెరిగిన ఇల్లు. ఇంకా పెళ్ళికాకుండానే ఈ ఇల్లు దానికి పరాయిదైపోయిందా చుట్టుపు చూపులా రావడానికి. కన్న వాళ్ళకి మాకెలా ఉంటుంది. ఊర్లో వేరే వుండి పరాయిదానిలా పేరంటానికి వచ్చినట్టు వస్తే, నలుగురూ జయంతి ఏది అని అడుగుతుంటే మేం జవాబివ్వడానికి ఎంత సతమతమవుతున్నామో దానికేం తెలుస్తుంది. ఏదో పోనీ కోపంతో ఏదో చేసింది నాల్గు రోజులలో సర్దు కుంటుందనుకున్నాం గాని దానికింత పంతం ఉండచ్చేం'ని ష్టూరంగా అంది-వాసంతి వారిస్తూ 'అమ్మా అదంతా ఇప్పుడెందుకు ఇంకోసారి మాట్లాడు దాంతో'-అంది సమాధానపరుస్తూ.
'అత్తయ్యగారూ, మీరూరుకోండి. నే వెళ్ళి లోపల జయంతి నింటికి తీసుకొచ్చేపూచి నాది. మీరు వెళ్ళి పనిచూసుకోండి' జయంతి ఉక్రోషంగా పెదవి కొరుక్కుంది.
'అందుకే రానన్నాను. వస్తే ఏదో ఇలాగే అంటారు' మనసు నష్టపెట్టుకొంటూ అంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగింది. 'హలో అన్నయ్యగారూ' అంటూ గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు. జయంతి చప్పున మొహం తిప్పుకుని టిఫిను ప్లేటు పట్టుకొని వంటింటివైపు వెళ్ళింది. హాలులో పూజ ఏర్పాట్లు చేస్తున్న దమయంతిని చూసి 'ఏదన్నా చెయ్యలా పని చెప్పు వుంటే' అంది. ఆ జంబుకానా, ఆ చాపలు అటు పరు' అంది దమయంతి. ఈలోగా బయట కారాగి వాసంతి అత్తగారు వాళ్ళు వచ్చారు.
బారసాల, సత్యనారాయణ వ్రతం అయ్యేసరికి ఒంటిగంట దాటింది. మిగతా వాళ్ళంతా వీధి వరండాలో కుర్చీల్లో కూర్చుంటే, లోపల హాలులో విస్తర్లు వేసి పని చూస్తున్నారు ఆడవాళ్ళు. 'రా, రా దివాకర్. నీకోసమే చూస్తున్నాను' అన్న గోపాలకృష్ణ మాటలు విని మంచినీళ్ళ గ్లాసులు పెడ్తున్న జయంతి ఒక్క క్షణం తెల్లబోయి చూసింది అటు. కారు దిగి లోపలికి వస్తున్న దివాకర్ ని ఎదురెళ్ళి ఆహ్వానించి చేయి కలిపి తీసుకొస్తున్నాడు గోపాలకృష్ణ. ఇతనెందుకు వచ్చాడు. ఎవరు పిలిచారు. గోపాలకృష్ణ పిలిచాడా, ఏం పెద్ద పరిచయం ఉందని ఇంటి ఫంక్షన్ కి పిలిచాడు. ఆమె మొహంలో మారిన రంగులు చూసి దమయంతి 'మా ఆయన దివాకర్ ని పిలిచారు. బాచిలర్ గదా మంచి భోజనం తిందువుగాని, జయంతి ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానురా అన్నారు. వచ్చాడు పాపం కాదనకుండా' అంది. బయట అతన్ని తన తండ్రికి, బావగారికి అందరికి పరిచయం చేస్తున్నాడు గోపాలకృష్ణ. 'జయంతి మీ బాస్ వచ్చారు' అంటూ ఓ కేకపెట్టి జయంతిని పిలిచాడు చనువుగా. జయంతి తప్పక బయటికి వెళ్ళి దివాకర్ ని చూసి నమస్కారం పెట్టింది. 'మీరు పిలవలేదు. మా ఫ్రెండు పిలిచాడని వచ్చాను' అన్నాడు నవ్వి. 'ఎవరు పిలిస్తే ఏం లెండి. మీరు మా ఇంటికి వచ్చారు. అంతే చాలు' అన్నాడు వెంకటేశ్వరరావు జయంతి ఓ క్షణం అలా నిలబడి లోపలికి వెళ్ళిపోయింది.
మగవాళ్ళంతా ఓ పంక్తిలో కూర్చున్నారు. దమయంతి, జయంతి, పద్మావతి వడ్డనలు చేశారు. దివాకర్ వచ్చిం దగ్గిర నుంచి జయంతికి చాలా అనీజీగా ఉంది. అసలా ఇంట్లో తనే మునుపటిలా వుండలేకపోతూంది. ఇతనొకడు పెద్ద పరిచయం ఉన్నవాడిలా రావడం భోజనాల దగ్గిర దివాకర్, గోపాలకృష్ణ, తన బావగారు కలిసి ఒకటే మాటలు- నవ్వులు ఎన్నాళ్ళుగానో పరిచయం అన్నట్టు వాళ్ళతో మాటలు కలుపుతూ దమయంతి- జయంతి బూరెలు వడ్డిస్తూంటే గోపాలకృష్ణ చనువుగా మరో రెండు వెయ్యండి వదినగారూ వాడికిష్టం బూరెలంటే' అని వేయించాడు. 'అయ్య బాబోయ్....ఏమిటలా వేసేస్తున్నారు నేనేం బకాసురుడి ననుకుంటున్నారు' అన్నాడు. భోజనాలయ్యాక లేస్తూ 'థాంక్స్ కృష్ణా చాలా రోజుల తర్వాత మంచి భోజనం-విందు భోజనం తెలుగుభోజనం తినిపించావు...వంటలు చాలా బాగా ఉన్నాయండి' అంటూ పద్మావతితో అన్నాడు.
"భోజనానికేం వుంది బాబూ, ఇంటి భోజనం ఎప్పుడు తినాలనిపిస్తే అపుడు మా ఇంటికి వచ్చేస్తుండండి' అంది పద్మావతి అభిమానంగా. 'థాంక్స్ అమ్మా, అంత మాటన్నారు అదే చాలు' అన్నాడు దివాకర్ మర్యాదగా. 'ఆ మాత్రం అభయం ఇస్తే చాలు మావాడికి, అల్లుకుపోతాడు' సరదాగా అన్నాడు గోపాలకృష్ణ. ఆ ఉన్న ఒక గంటలో అందరితో పాతవాడిలా కబుర్లాడుతూ కలసిపోయాడు. వెడుతూ పేరు పేరున అందరికి వీడ్కోలు చెప్పాడు. జయంతిని చూస్తూ 'థాంక్స్ జయంతిగారూ, మీ ఫేమిలీతో పరిచయం అవడం సంతోషంగా ఉంది. థాంక్స్ కృష్ణా' అంటూ వెళ్ళాడు. మూడు గంటలకి కాఫీలు తాగి సాయంత్రం మళ్ళీ వస్తామంటూ వాసంతి అత్తగారు వెళ్ళారు. అందరూ సావకాశంగా హాలులో కూర్చున్నారు. 'జయంతి వెడతానని లేస్తుంటే.....వెళ్ళడం ఏమిటి? సాయంత్రం ఉయ్యాల పేరంటం ఉంది' అంది పద్మావతి. 'పేరంటానికెందుకు లెద్దూ... నే వెళ్ళి కాసేపు పడుకుంటాను. ఏయ్ జయా వెళ్ళడానికి వీలు లేదు. పడుకోవాలంటే కాసేపు ఆ గదిలో పడుకో... పద నేనూ ఓ అరగంట పడుకొని వస్తాను' అంటూ వాసంతి లేచింది. తన గదిలో వెళ్ళిపడుకుంది జయంతి. 'అబ్బాయి బాగున్నాడు- సరదా అయిన వాడులా కనిపిస్తున్నాడు. అతనొప్పుకుంటే బాగుండు' 'వాడ్ని నేను ఒప్పిస్తాను మాట్లాడి' గోపాలకృష్ణ అన్నాడు.