Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 23

    "విస్సు గెలుపు కోసం అయిదు లక్షలు పెట్టుబడి పెట్టిన మీరు మళ్ళీ అతడు ఓడిపోవడానికి వాళ్ళమ్మని ఎందుకు కిడ్నాప్ చేయించారో నాకు తోచడం లేదు చౌదరిగారూ" ఆశ్చర్యంగా అడిగాడు రంగధాం స్థిమితంగా మందుకొడుతున్న చౌదరిని చూస్తూ.    
    భావరహితంగా చూశాడు ఆయన. దోషి నుంచి నిజం రాబట్టడానికి చాలా శ్రమించి చివరికి తన తప్పుని దోషి ఒప్పుకున్నాక నువ్వు దోషివే కాదు అని తేల్చి చెప్పిన దొంగ పోలీసాఫీసరులా నవ్వాడు.    
    అబద్దపు సాక్ష్యాలతో ఆఖరిదాకా పోరాడి, అనుకూలంగా జడ్జిమెంటు వచ్చే సమయంలో 'నేను కోర్టులో యింతకలం ప్రజెంట్ చేసింది దొంగ సాక్ష్యాలే' అని జడ్జిముందు ఒప్పుకున్న లాయరుగా మొహాన్ని సీరియస్ గా పెట్టాడు చౌదరి. "ఒకవేళ విస్సు గెలిస్తే నాకొరిగేదేమిటి"    
    వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రంగధాం.    
    "ఫలానా లాభముందీ అని ఉత్సాహంగా చెప్పలేకపోయారూ అంటే విస్సు గెలుపులో ఖచ్చితంగా మనకి లాభం లేదనేగా మహా ఐతే ఓ రాత్రంతా కృషిని అనుభవిస్తాడు విస్సు. అంతేగా...దాని వలన మనకి ఒరిగేదేమిటి? మనకి ఏదీ జరగదు సరికదా ఒకవేళ వాడితో అనుభవం దానికి నచ్చినా, దానితో అనుభవం విస్సుకి సంతృప్తి నిచ్చినా, అపార్ధాలు చెరిపేసుకొని హాయిగా కాపరానికి సిద్దపడే ప్రమాదం వుంది. కాని అలా జరక్కూడదు. శీలం  పోగొట్టుకోటానికి ఇష్టపడని కృషి మరో మారు ఇలాంటి ఘాతుకానికి సిద్దపడిందని కృషిని విస్సు ద్వేషిస్తూ వుండాలి. అందుకే విస్సు తల్లిని నేనే కిడ్నాప్ చేయించాను."    
    "కాని మీరు అయిదు లక్షలు కోల్పోయారుగా."    
    "కృషి మూలంగా కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టపోయినవాడ్ని రంగధాం- ఈ నష్టమెంతని! కాని ఇప్పుడో.... ఐదు లక్షల్ని అడ్డం పెట్టుకుని విస్సుని దాని మీదికి ఆయుధంలా ప్రయోగించబోతున్నాను. రెచ్చిపోయి వున్న విస్సు ఆధారంతో కృషి మీద శాశ్వతంగా గెలవబోతున్నాను..."    
    ఎలాగో చెప్పలేదు. ఇంతలో తెలిసింది విస్సు వచ్చాడని....లోనికి రప్పించాడు.    
    విస్సుని చూస్తూనే "మీ మీద చాలా నమ్మకంతో పెట్టుబడిపెట్టాను" అంటూ తన బాధని వ్యక్తం చెయ్యబోయాడు కాని దానికి ముందే ఏ స్థితిలో తను ఓడాల్సి వచ్చిందీ చెప్పేశాడు విస్సు....అంతే కాదు - పోయిన ఐదు లక్షల విషయంలో తన బాధని ప్రకటించాడు.    
    "ఇక్కడ నేను ఆలోచిస్తున్నది పోయిన డబ్బు గురించి కాదు విస్సు - ఓ ఆడపిల్ల తెగువ గురించి....ఏం చూసుకుని దానికంతపొగరు - డబ్బునా ... అది నా దగ్గరా వుందే...ఎస్ డి యెకి లైసెన్సు కోసం అప్లయ్ చేసిన నా కంపెనీకి ఇక నేడో రేపో లైసెన్సు వస్తుందనగా తిరుగుబాటు చేసి నన్నో సంఘ విద్రోహక శక్తినంది..... నేను సరే.... మరి నీ తెలివీ ఎందుకూ కాకుండా పోయిందే" గాయపడి వున్న ఓ మనిషి అహాన్ని ఎంత చాతుర్యంగా దెబ్బ తీయొచ్చో తెలిసిన చౌదరి అద్భుతంగా అవకాశాన్ని వినియోగించుకున్నాడు.    
    మరింత సునిశితంగా మెదడు పొరల్లోకి చొచ్చుకుపోయేట్లు మాట్లాడేడు. "హత్య రాజకీయాలతో పబ్బం గడుపుకునే ఉపాధ్యాయ ఒకనాడు నీ తండ్రిని హత్య చేయించాడు...అతడికి వారసురాలైన కృషి తన మాట నెగ్గాలని ఈ రోజు నీ తల్లినీ హత్య చేస్తానని సవాల్ చేసింది. ఒక్క ఉపాధ్యాయే అనుకుంటే యిప్పుడు ఆజ్యంలా అతడికి కృషి కూడా తోడైంది విస్సు..."    
    "ఇక నాకు విడిచి పెట్టండి" సాలోచనగా అన్నాడు విస్సు. ఆ క్షణంలో విస్సు మానసిక స్థితి చౌదరి వూహించి వుండడు...ఉపాధ్యాయని దెబ్బ తీయడానికి కృషి పరిచయాన్ని కోరుతున్న విస్సుకి యిప్పుడు కృషి కూడా ప్రమాదకరమైందే అని స్పష్టంగా బోధపడడంతో ఆఖరి అధ్యాయపు పుటల్ని రాయబోతున్నట్టుగా అన్నాడు.    
    "కృషికి వున్నది ఉపాధ్యాయ అండే అయితే అతడి అండని కృషి త్వరలోనే కోల్పోతుంది. ఉపాధ్యాయకి అండ కృషే అయితే కృషి ఆసరాని ఉపాధ్యాయ త్వరలోనే కోల్పోతాడు."   
    "ఎలా" ఉత్కంఠగా చూశాడు చౌదరి.    
    చెప్పలేదు వివరంగా - ఇక చెప్పడం తన అభిమతంకాదు. చేసి చూపించాలనే తిరుగులేని సంకల్పాన్ని ప్రకటిస్తూ రెండు నిముషాల నిశ్శబ్దం తర్వాత చెప్పాడు విస్సు - "మూడు నెలల గడువులో కృషి ఈ దేశం విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళడం యిష్టం లేకపోతే అవమాన భారంతో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటుంది"    
    ఏ ఆలోచనల ఒరిపిడిలో విస్సు అలా మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. కాని విస్సు కళ్ళలో ఎరుపు జీరలు, అతడి గొంతులు పలికిన ఆత్మ విశ్వాసం చౌదర్ని అద్భుతంగా కదిలించాయి. యుద్దంలో అడుగుపెట్టే వరకే ప్రేరణ అందించాల్సింది. ఆ తర్వాత యుద్దమే ప్రేరణ అందిస్తుంది. అసలు విస్సు గెలిచినా గెలవకపోయినా కనీసం కృషిని అందోళన పర్చగలడు - ఏకాగ్రత లోపించే స్థితికి ఆమెను నెట్టితే చాలు మిగతాది తాను చూసుకుంటాడు.    
    పద్మవ్యూహంలో అడుగు పెట్టిన అభిమన్యుడు గెలవకపోతేనేం - కౌరవుల్ని చాల కంగారు పెట్టేశాడు.    
    కృషి మూలంగా కోట్ల నష్టానికి గురైనా ఇప్పుడు అయిదు లక్షల పెట్టుబడితో ఓ ఆయుధంలా ముందుకు దూసుకుపోతానంటున్న విస్సుని చౌదరి చూస్తుండగానే వెళ్ళిపోయాడు విస్సు.   
    చాలా బలమైన పావుని కదిలించాడు మరి-    
                                           *    *    *    *    
    "మన కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలు ప్రకటించి ఏడాది కాక ముందే సుమారు బిలియను డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు నుంచి హామీ లభించింది. ఇదిలా వుండగా మన దేశంలోని అమెరికన్ ఎలక్ట్రానిక్ కంపెనీ "మీటరులా" ఇక్కడ నుంచి తన పరిశ్రమల్ని చైనాకి తరలించటానికి సిద్దపడుతూంది."    
    క్షణం ఆగాడు వేదికపై మాట్లాడుతున్న విస్సు-    
    నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్ ఆర్గనైజ్ చేస్తున్న సెమినార్ అది - ఆ సెమినార్ కి చాలా మంది పారిశ్రామిక వేత్తలతో బాటు ఉపాధ్యాయ కూడా వచ్చారు. ప్రస్తుతం ఆయన వేదికపై అధ్యక్ష స్థానంలో కూర్చుని వున్నారు. పాతికేళ్ళు నిండని ఓ అబ్బాయి అద్భుతమైన అనాలిసిస్ తో విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా ముందుకు వంగి టేబుల్ పై చేతులానించి వింటున్నారాయన.    
    "ఇలా మన దేశంలో పెట్టుబడి పెడతామన్న విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మరో దేశానికి తమ పరిశ్రమల్ని తరలించుకోవడానికి కారణం మన ప్రభుత్వ యంత్రాంగాల్లో పనుల నిర్వహణలో జరుగుతున్న జాప్యం - ఆలోచనలు కాగితాలకే పరిమితం కావడం. 1990 లో థాయ్ లాండ్ కి 47 బిలియన్ డాలర్ల ప్రతిపాదనలు వస్తే మన దేశానికి కేవలం ఒక బిలియన్ డాలర్ల ప్రతిపాదనలతో ముగిసిపోవడం బాధాకరమైన విషయం"    
    ఓ నివేదికను తయారు చేసి అందులో సారాంశాన్ని ఉపన్యాసంలా చదువుతున్న విస్సు కౌన్సిల్ తో సంబంధం లేని వ్యక్తి అయినా ఇప్పుడా అవకాశాన్ని దక్కించుకున్నది ప్రోడక్టివిటీ కౌన్సిల్ లో అతడికి తెలిసిన ఓ స్నేహితుడి మూలంగా-    
    కేవలం ఉపాధ్యాయగారి సమక్షంలో తన మేధస్సుని ప్రదర్శించే ప్రయత్నంలో అవకాశమివ్వమని విస్సు అడగలేదు. ప్రభుత్వంలో బ్యూరోక్రసీ వైఫల్యాల గురించి ఉపాధ్యాయ వంటి వ్యక్తుల దృష్టికి తీసుకు వెళ్ళడం తన అభిమతమన్నాడు. వేదికలోని స్టేటస్టిక్స్ విస్సు స్నేహితుడ్ని కూడా ఆకట్టుకోవడంతో పైగా అప్పుడెప్పుడో బాంబే యూనివర్శిటీలో విస్సుతో వున్న పరిచయంతో సరే అని అంగీకరించి పది నిమిషాల సమయాన్ని కేటాయించాడు.   
    "ఎవరీ అబ్బాయి" అడిగాడు ఉపాధ్యాయ అతని పక్కనే కూర్చున్న కౌన్సిల్ సెక్రటరీని.   
    "పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో రీసెర్చి స్కాలర్ - ప్రస్తుతం నిరుద్యోగి. త్వరలో ఉద్యోగం కోసం స్టేట్స్ కి వెళ్తున్నవాడు. పేరు విశ్వనాథ్" చెప్పాడు నెమ్మదిగా ఇదేమీ గమనించడం లేదు విస్సు.    
    "భారతదేశంలో వున్న విస్త్రతమైన మార్కెట్ గురించే గాక నైపుణ్యతగల కార్మికులకేలోటూ లేదన్న విషయం అంతర్జాతీయ యిన్వెస్టర్లకి తెలుసు. అయితే ఇక్కడ సరైన ప్రాధమిక సౌకర్యాలు లేకపోవడం, ప్రాజెక్టుల అనుమతిలో అవరోధాలు వారికి తల నొప్పిగా తయారయ్యాయి. అదే తూర్పు ఐరోపా దేశాలలో టాక్స్ హాలిడేస్ మాత్రమే కాక ప్రాజక్టులకు అనుమతి సైతం తేలిగ్గా లభిస్తుంది"    
    విస్సు అంచనా తప్పు కాలేదు... తను అనుకున్న దానికన్నా ఉపాధ్యాయ గార్ని అమితంగా ఆకట్టుకోగలిగాడనటానికి ఉదాహరణ ఆయన కనబరుస్తున్న ఆసక్తి....వయసుకి మించిన పరిజ్ఞానంతో భారత దేశ పారిశ్రామిక ప్రగతికి సంబందించిన కీలకమైన విషయాల్ని చాలా సునాయాసంగా చర్చిస్తున్నాడు. డబ్బు పెట్టుబడి పెట్టడంలో ఎదురయ్యే సమస్యల గురించి సరైన అవగాహన లేకుండా సంఘర్షణకి లోనవడమే తప్ప ఎంతమంది పారిశ్రామిక వేత్తలకి తెలుసు యిలాంటి లోపాల గురించి?    
    "మన దేశంలో శ్రమ శక్తి తక్కువ రేటుకే లభిస్తుంది. అయితే ఉత్పాదకతను పెంచే కార్మిక చట్టాలు లేవు....కార్మిక సంఘాలకి ఉద్యోగ భద్రతలపై ఆసక్తి తప్ప ఉద్యోగుల బాధ్యత గురించి నచ్చచెప్పే ఆసక్తి లేదు."    
    పరిశ్రమలు నష్టాలలో కోరుకోవటానికి ముఖ్యమైన కారణాల్ని వ్యక్తం చేస్తున్న విశ్వనాథ్ ని మరింత అభినందనగా చూశారు ఉపాధ్యాయ".  
    "అసలు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ ముందుగా ఆలోచించాల్సింది విదేశీ పెట్టుబడులే కాక సవరించబడాల్సిన ఫ్యాక్టరీ ఎక్ట్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టాల గురించి-"    
    విస్సు ఉపన్యాసం ఇంకా పూర్తి కాలేదు. ఉన్నట్టుండి ఆ స్టార్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కలకలం మొదలైంది. అదికాదు....ఓ విద్రోహుల చర్యలా ఆ హాల్లో దట్టంగా పొగ వ్యాపిస్తూంది.    
    "స్మోక్ బాంబ్స్" అన్న కేకలతో జనం కకావికలైపోయారు....ఎవరే పక్క పరుగెడుతున్నదీ అసలేం జరిగిందీ ఎవరికీ అర్ధం కావడం లేదు....అరనిముషం వ్యవధిలో మేఘాల్లా ఆవరించిన పొగలో పైకి లేవబోయిన ఉపాధ్యాయకి ఏమీ కనిపించని ఆ స్థితిలో తననెవరో లాగుతున్నట్టు బోధపడింది. ఊపిరితిత్తులనిండా నిండిన పొగతో ఉక్కిరిబిక్కిరైపోయారు. తననెవరో కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించి శక్తిని కూడగట్టుకోబోయారు కాని అప్పటికే ఆయనకు స్పృహ తప్పుతూంది.    
    రాత్రి పది గంటల సమయంలో అక్కడ జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఎంత కలవర పరిచిందీ అంటే నగరం అలర్ట్ చేయబడింది. అందరి నోటా ఒకటే మాట... టెర్రరిస్టులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాధ్యాయని కిడ్నాప్ చేయబోతే విస్సు అనే యువకుడు ప్రాణాలకి తెగించి పోరాడాడు. ఉపాధ్యాయగార్ని రక్షిస్తూ తాను దారుణంగా గాయపడ్డాడు.    
    పత్రికలు, ప్రజలు ఆసక్తిగా అపోలోకి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా అప్పటికే స్పృహలోకి వచ్చిన ఉపాధ్యాయ జరిగింది తెలుసుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వున్న విస్సు దగ్గరికి వెళ్ళారు. అతడి షర్టు రక్తసిక్తమై వుంది. మోచేయితో బాటు భుజం కూడా చీరుకుపోవడంతో బేండేజ్ కట్టినట్టు చెప్పాడు డాక్టరు.

 Previous Page Next Page