Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 94

                                 


                          దక్షిణాంగుష్ఠం

    "నమస్కారాలు స్వామీ!"
    "ఎవరు నాయనా నీవు?"
    "నేను ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న భిల్లరాజ్యం పరిపాలించే ఎరుకలరాజు కుమారుణ్ణి స్వామీ! నా పేరు ఏకలవ్యుడు."
    "నీవు ఇలా ఎందుకు వచ్చావు నాయనా?"
    "తమ సాన్నిధ్యంలో నాజన్మ సార్థకం చేసుకోవాలని వచ్చాను. నా మనవి చిత్తగించండి స్వామీ!"
    "ఏమిటి నాయనా!ఏమి కావాలో స్పష్టంగా చెప్పు".
    "అనుగ్రహించండి స్వామీ! నేను విశ్వ విఖ్యాతులైన తమ వద్దకు విద్యార్థినై వచ్చాను".
    "ఏమిటీ! నీవు విద్యార్థివై వచ్చావా?"    
    "అవును స్వామీ! ధనురాచార్యులైన తమ దగ్గర అస్త్రవిద్య అభ్యసించాలని వచ్చాను. నాకు తమ సేవాభాగ్యం ప్రసాదించండి స్వామీ! ఈ రాజనందనులతో పాటు నన్నూ తమ శిష్యుణ్ణిగా స్వీకరించండి".
    కల్లాకపటం ఎరుగని భిల్లకుమారుడి మాటలు విని రాజకుమారులంతా గొల్లుమని నవ్వారు. ద్రోణాచార్యులవారి మానసంలో అనేక భావాలు అలలు అలలుగా చెలరేగాయి. ఆయన దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.
    "ఆఁ. వేటమీద విరక్తి పుట్టి విలువిద్య వెలగబెట్టటానికి వచ్చాడు మహావీరుడు" అన్నాడు దుర్యోధనుడు. "అవును మరి! ఇంత ఉత్తమ వంశం వాడికి విలువిద్య నేర్పకపోతే ఎలాగా?" అన్నాడు భీముడు. "అందుకోసం రాజగురువులే కావలసి వచ్చారా!" అన్నాడు అర్జునుడు. ఈ విధంగా రాజకుమారులు తలా ఒకమాట వెంట వెంటనే వెటకారంగా అని వేళాకోళం చేశారు ఏకలవ్యుణ్ణి.
    ఈ రాజకుమారుల వికార చేష్టలకి ఏకలవ్యుడు ఎంతమాత్రమూ చలించలేదు. అతడు అలాగే ఆశతో ఆచార్యునివంక ఆలోకింపసాగాడు. అతని హృదయంలో ఎన్నెన్నో కోరికలు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. "గురుదేవులు నన్ను తప్పకుండా కరుణిస్తాడు. ప్రియశిష్యుడుగా స్వీకరిస్తారు. అస్త్రవిద్య నేర్పుతారు. నేను విలువిద్యలో సాటిలేని మేటి మీరుడనవుతాను" అని ఉవ్విళ్ళూరు తున్నాడు ఏకలవ్యుడు.
    ద్రోణాచార్యుడు విలువిద్యలో విశ్వవిఖ్యాతి గాంచిన మహా పండితుడు. ఆయన హస్తినాపురంలో అస్త్రగురువై కౌరవ పాండవులకు యుద్ధ విద్యలు నేర్పుతున్నాడు. రాజకుమారులందరిలోనూ అర్జునుడంటే ఆచార్యుడికి అపారమైన వాత్సల్యం. అందువల్ల ద్రోణాచార్యుడు తన అనుగుశిష్యుడైన అర్జునునికి రహస్యంగా, "ప్రపంచంలో నీకు ప్రతివీరుడు లేకుండా విలువిద్య నేర్పుతాను" అని వాగ్దానం చేశాడు.
    లోకైకవీరుడైన ద్రోణాచార్యుని మహాప్రసిద్ధి విని చుట్టుప్రక్కల అనేక రాజ్యాలనుంచి ఎందరెందరో రాజకుమారులు విద్యార్థులై వచ్చారు. ఆయన పాదసన్నిధిలో శ్రద్ధాభక్తులతో యుద్ధవిద్యలు అభ్యసిస్తున్నారు. ద్రోణాచార్యుని కీర్తిచంద్రికలు భారతదేశం నలుమూలలా ప్రాకిపోయాయి.
    ఆనాటి ఉదయం ఆచార్యుడు రాజకుమారులకు యుద్ధ వ్యూహాలు పన్నటం, విప్పటం ప్రబోధిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన సమక్షానికి మెల్ల మెల్లగా ఒక భిల్లకుమారుడు వచ్చి నిలిచాడు. మెలిదిరిగిన కండరాలూ - తళతళలాడే కుండలాలూ - ఎర్రని కళ్లూ - నల్లని ఒళ్ళూ - చేతిలో విల్లూ - వీపున అమ్ములపొదీ - వీరమూర్తిలాగా విరాజిల్లుతున్నాడు భిల్లకుమారుడు. అతనిని చూచి రాజకుమారులు అలాగే ఆశ్చర్యంగా కన్నార్పకుండా అవలోకింపసాగారు. ఏకలవ్యుడూ అలాగే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు.
    ఆచార్యుడు కొంచెంసేపు ఆలోచించి, "నాయనా! ఏకాలవ్యా! నీ విద్యాసక్తికి నేను చాలా ఆనందించాను. కాని నీవు భిల్లకుమారుడవు! నేను రాజగురువును! నేటి సాంఘిక ధర్మం ప్రకారం బ్రాహ్మణులకూ, క్షత్రియులకూ తప్ప అన్యులెవ్వరికీ అస్త్రవిద్య అభ్యసించే అధికారం లేదు. అందువల్ల నీకు విలువిద్య నేర్పటానికి వీలులేదు. నీ కోరిక తీర్చలేను నాయనా!" అన్నాడు.
    ఆ మాటలు వినగానే ఏకలవ్యుడి వదనపద్మం వాడిపోయింది. అతనికి విచారం కలిగింది. అతడు మనస్సులో ఇలా అనుకున్నాడు. "అవును. ఈ విధంగా జరుగుతుందని మా తండ్రిగారు నేను వచ్చేటప్పుడే చెప్పారు. కాని నేను వినకుండా వచ్చేశాను. ఏమైనా సరే! నాకు ద్రోణాచార్యులే గురుదేవులు కావాలి! ఈయన అనుగ్రహం వల్లనే నేను అస్త్రవిద్యలో ఆరితేరి అసమానుణ్ణి కావాలి!"
    ఏకలవ్యుడు చేతులు జోడించి, "కానివ్వండి స్వామీ! తమ అనుగ్రహం ఉంటేచాలు. అస్త్రవిద్య ఎలాగైనా అభ్యసిస్తాను. తమరు నేర్పటానికి వీలుకాకపోతే, తమ విగ్రహాన్ని ఆరాధిస్తూ నేనే స్వయంగా నేర్చుకుంటాను. అందుకైనా అనుమతించండి! దయచేసి నన్ను ఆశీర్వదించండి స్వామీ!" అని ప్రార్థించాడు.

           

    ఏకలవ్యుడి భక్తిశ్రద్ధలకు ఆచార్యుడు చాలా ఆనందించాడు. ఆయన దయార్ద్రహృదయంతో, "అలాగే నాయనా! స్వయంగా నీవే అస్త్రవిద్య అభ్యసించుకోవటానికి నా అభ్యంతరం లేదు. నా ఆశీర్వాద బలం వల్ల నీవు విలువిద్యలో ప్రవీణుడవౌతావు! సాటిలేని మేటివై శాశ్వత కీర్తి సంపాదిస్తావు! వెళ్ళిరా!" అని దీవించి పంపాడు. "అమ్మయ్య! పీడ వదలిపోయింది" అనుకున్నారు రాజకుమారులు. కాలం గడచిపోయింది. క్రమక్రమంగా రాజకుమారులు ఈ విచిత్ర విద్యార్థి విషయమే విస్మరించారు.
    ఏకలవ్యుడు ఇంటికి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుల విగ్రహం తయారుచేశాడు. దానిని ఒక మర్రిచెట్టు క్రింద పరిశుభ్రమైన ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. చుట్టూ వేదిక నిర్మించాడు. ఆ విగ్రహాన్నే గురువుగా భావించి విద్యాభ్యాసం ప్రారంభించాడు.
    ఏకలవ్యుడు ప్రతిరోజూ ఉదయమే లేచి ఆచార్యుని మూర్తి ముందు తలవంచి నిలబడేవాడు. ధనుస్సూ, బాణాలూ వేదికమీద ఉంచేవాడు. భక్తి పూర్వకంగా ప్రదక్షిణం చేసి విగ్రహానికి ప్రణామం కావించేవాడు. అనంతరం ధనుర్బాణాలు ధరించి అస్త్రవిద్య అభ్యసించేవాడు. నిష్ఠతో, నియమంతో లక్ష్యశుద్ధి సాధించుకునేవాడు. ఆ విధంగా ఏకలవ్యుడు భక్తిశ్రద్ధలతో గురుదేవుని పూజిస్తూ బాణవిద్యలో ప్రవీణుడైనాడు. ఉత్సాహంతో పరిశ్రమిస్తూ ధనుర్విద్యలోని మెలకువలు స్వయంగా గ్రహించాడు. ఆ విధంగా కొంతకాలం గడచిపోయింది.
    ఒకనాడు కౌరవులూ, పాండవులూ అందరూ కలసి గురువు గారి ఆజ్ఞ తీసుకొని అరణ్యానికి వేటకు వెళ్ళారు. ధర్మరాజూ భీముడూ అర్జునుడూ దుర్యోధనుడూ దుశ్శాసనుడూ మొదలైన రాజకుమారులు ఉత్సాహంగా కోలాహలం చేస్తూ క్రూర జంతువులను తరిమి తరిమి వేటాడసాగారు. అప్పుడు వారివెంట ఉన్న వేటకుక్క ఒకటి త్రోవతప్పి భిల్లపల్లి వైపుకు వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఒంటరిగా విలువిద్య అభ్యసిస్తున్న ఏకలవ్యుణ్ణి చూచింది. అక్కడ నిలబడి 'భౌ భౌ' అని పెద్ద పెద్దగా మొరగటం మొదలు పెట్టింది. ఆ ధ్వని విని ఏకలవ్యుడు ఇలా అనుకున్నాడు. "ఈ కుక్క నోరు మూయిస్తాను. దీని ముఖంలో ఏడు వాడి బాణాలు ప్రయోగించి అరవకుండా చేస్తాను. నాకు బాణవిద్యలో ఎంత ప్రావీణ్యం ఉన్నదో పరీక్షించుకుంటాను."
    ఏకలవ్యుడు ఎక్కడో ఉండి మొరిగిన కుక్క నోటినే గురిచూచి ఏడు బాణాలు ప్రయోగించాడు. కుక్క కుయ్యి పెట్టడం మాని, బాణాలు నిండిన నోటితో రాజకుమారుల ముందుకు పరుగెత్తిపోయింది. దానిని చూడగానే రాజకుమారులకు అమితమైన ఆశ్చర్యం కలిగింది. "ఎవరీపని చేసింది? అబ్బ! ఎంత విచిత్రమైన ప్రయోగం! ఆ విలువాని విద్యా ప్రావీణ్యం ఎంత గొప్పగా ఉన్నది!" అని అందరూ మెచ్చుకున్నారు. అందరిలోనూ అస్త్రవిద్యలో ఆరితేరిన అర్జునుడి గుండెలు గుభిల్లుమన్నాయి. అస్త్రవిద్యలో తనకన్నా అధికుడు లేడని విర్రవీగుతున్న అర్జునుడికి గర్వభంగం జరిగినట్లయింది. అంత నేర్పుగా ఆ కుక్క నోటినిండా అన్ని బాణాలు అవలీలగా ప్రయోగించి అరవకుండా చేసిన ఆ విలుకాడెవడో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు అర్జునుడు.

 Previous Page Next Page