Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 92

                                 


    వెంటనే ఉదంకుడు గురుపత్నిని దర్శించి "అమ్మా! మీరు కోరిన వస్తువు గురుదక్షిణగా తెమ్మని ఆచార్యదేవులు ఆజ్ఞాపించారు. మరి మీ శ్రీచరణాలమీద ఏమి సమర్పించమంటారో చెప్పండి" అని ప్రార్థించాడు.
    ఆ మాటలు విని గురుపత్ని ఎంతో సంతోషించింది. ఆమె "కుమారా! నీవు పౌష్యమహారాజు పట్టణానికి వెళ్ళి ఆయన పట్టపురాణి మణికుండలాలు తెచ్చిపెట్టు. ఒకమాటు ఆ రాజదంపతులు మన ఆశ్రమానికి వచ్చినపుడు రాణి చెవులకున్న రత్నకుండలాలు నన్నెంతో ఆకర్షించాయి. వజ్రకాంతులతో ధగధగ మెరిసే ఆ కుండలాలు ధరించి వ్రతోద్యాపనం చేసుకోవాలని నాకు వాంఛ కలిగింది. అందువల్ల నీవు సరిగా మూడవరోజుకు తిరిగి రావాలి. ఆ కుండలాలు ధరించి నేను వ్రతం పూర్తి చేసుకోవాలి. కనుక నీవు సత్వరంగా వెళ్ళిరా" అన్నది. ఉదంకుడు 'మహాప్రసాదం' అన్నాడు. గురుపత్ని అతనిని చేయెత్తి ఆశీర్వదించింది.

           

    ఉదంకుడు గురుపత్ని ఆజ్ఞానుసారం కుండలాలు తేవటం కోసం పౌష్యుని పట్టణానికి బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళేటప్పటికే వృషభరాజం మీద ఆసీనుడై ఉన్న ఒక దివ్య పురుషుడు దారికి అడ్డంగా కనిపించాడు. ఉదంకుడు ఆ మహా పురుషునికి నమస్కరించి, "మహాత్మా! ఎవరు మీరు? ఇలా నా దారికి అడ్డంగా ఎందుకు నిలబడ్డారు?" అని అడిగాడు.
    ఆ మహా పురుషుడు ఉదంకునికి వృషభగోమయం చూపిస్తూ, "ఇదుగో! మారు మాటాడకుండా ఈ గోమయం భక్షించు" అన్నాడు. ఆ విచిత్రమైన విషయం విని ఆశ్చర్యపడుతూ "ఏమిటేమిటీ! గోమయం భక్షించాలా? ఛీ ఛీ. అటువంటి పాడుపని ఎవరైనా చేస్తారా? చాలు చాలు" అన్నాడు ఉదంకుడు.
    దివ్యపురుషుడు ఉదంకుడి వీపుతట్టి, "అలా అనకు నాయనా! ఇది నీవు అనుకున్నట్టు అపవిత్రమైనది కాదు. వెంటనే భుజించు. మీ గురుదేవుడు కూడా ఒకమాటు ఈ గోమయం ఆరగించినవాడే!" అన్నాడు ఆదరంగా. "మరి గురుదేవుడే ఆరగిస్తే నాకు మాత్రం అభ్యంతరం ఏముందీ?" అనుకున్నాడు ఉదంకుడు. వెంటనే ఆ వృషభ గోమయం భక్షించి ముందుకు సాగాడు ఉదంకుడు. అతనికేదో క్రొత్త శక్తి వచ్చినట్టు తోచింది.
    పౌష్యమహారాజు ఉదంకుణ్ణి ఆదరంగా ఆహ్వానించి అతిథి సత్కారం చేశాడు. "ఆర్యా! మీరు వచ్చిన పనేమిటి?" అని ప్రశ్నించాడు మహారాజు. ఉదంకుడు తాను వచ్చిన పని చెప్పాడు. "అయితే మీరు అంతఃపురానికి వెళ్ళి నామాటగా చెప్పి మహారాణి దగ్గర మణి కుండలాలు పరిగ్రహించండి" అని మనవి చేశాడు మహారాజు.
    ఉదంకుడు అంతఃపురంలో ప్రవేశించాడు. కాని అతనికి మహారాణి కన్పించలేదు. అతడు అంతఃపురం అంతా గాలించాడు. కాని ఎక్కడా మహారాణి కన్పించనేలేదు. ఉదంకుడు వెనుదిగిరి వచ్చి ఆ విషయం మహారాజుకు విన్నవించుకున్నాడు. ఆయన ఆశ్చర్యపడుతూ, "అదేమిటి స్వామీ! ఆమె నిశ్చయంగా అంతఃపురంలోనే ఉన్నది. కాని పరమ పతివ్రత అయిన మహారాణి అపవిత్రులకు మాత్రం కనిపించదు. మరి అఖిల పావనులైన మిమ్మల్ని అపవిత్రులని నేను ఎలా అనగలను? మీరే ఆలోచించండి" అన్నాడు.
    ఆ మాటలు విని ఉదంకుడు తాను ఎందువల్ల అపవిత్రుణ్ణి అయినానా అని కొంచెంసేపు ఆలోచించాడు. అతనికి తన పొరపాటు జ్ఞప్తికి వచ్చింది. తాను త్రోవలో గోమయం భక్షించి కాళ్లూ చేతులూ కడుక్కోకుండా వచ్చిన సంగతి గుర్తువచ్చింది. అతడు వెంటనే కాలుసేతులు పరిశుభ్రపరుచుకున్నాడు. ముఖ ప్రక్షాళనం చేసుకున్నాడు. ఆచమించి పరిశుద్ధుడైన ఉదంకునికి తక్షణమే పౌష్యరాణి సందర్శనం లభించింది.
    మహారాణి ఆదరపూర్వకంగా ఉదంకుణ్ణి అవలోకించి, "ముని కుమారా! మీరు వచ్చిన పని నాకు తెలుసు. ఇవిగో! గురుదక్షిణార్థం మీకు నా కుండలాలు ఇస్తున్నాను. పరిగ్రహించండి" అని పలికింది. ఉదంకుడు సంతోషంగా ఆమె ఇచ్చిన కుండలాలు అందుకున్నాడు.
    మహారాణి ఉదంకుణ్ణి ఉద్దేశించి "ఆర్యా! ఈ మణికుండలాలు మీరు జాగ్రత్తగా తీసుకువెళ్లాలి. వీటికోసం మాయావి అయిన 'తక్షకుడు' చాలాకాలం నుంచి తపించి పోతున్నాడు. ఆ నాగరాజు త్రోవలో ఎలాగైనా మీదగ్గర నుంచి వీటిని అపహరించాలని ప్రయత్నిస్తాడు. ఎంతమాత్రమూ ఏమరకుండా తీసుకొని వెళ్ళండి" అని మరిమరి నొక్కి చెప్పింది.

           

 

 Previous Page Next Page