Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 91


                        గురుదక్షిణ

                          రత్నకుండలాలు

    "ఉదంకా!"
    "గురుదేవా!"
    "వేదాలు పఠించావు!"
    "చిత్తం గురుదేవా!"
    "ఉపనిషత్తులు చదివావు!"
    "తమ దయ, గురుదేవా!"
    "శాస్త్రాలు తెలుసుకున్నావు. యోగవిద్య అభ్యసించావు. అష్టసిద్ధులూ అనుభవంలోకి తెచ్చుకున్నావు. గురుకులానికి వన్నె పెట్టావు. లోకానికి మార్గదర్శకుడవైనావు".
    అ"అంతా తమ అనుగ్రహమే గురుదేవా!"
    "నాయనా! నీ విద్యావ్యాసంగం పూర్తి అయింది. ఇక నీవు మీ ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు".
    "క్షమించండి గురుదేవా! ప్రశాంతమైన ఈ ఆశ్రమాన్ని, పవిత్రమైన తమ సాన్నిధ్యాన్ని వదలి వెళ్ళటానికి నాకు మనస్కరించటం లేదు".
    "కాని, తప్పదు నాయనా! నీవు వెళ్ళక తప్పదు. నీవంటి ఆదర్శశిష్యులు తాము నేర్చుకున్న విద్యా విశేషాన్ని విశ్వానికి పంచి పెట్టాలి".
    "ఒక్క మనవి గురుదేవా!"
    "అదేమిటి ఉదంకా! సందేహం దేనికి? చెప్పు".
    "తమకేదైనా గురుదక్షిణ..."
    శిష్యుని మాటలకు చిరునవ్వు నవ్వాడు పైలమహర్షి. ఈ విధంగా ఉదంకుడు అడగటం, పైలమహర్షి మందహాసం చెయ్యటం ఇంతకు ముందు ఒకసారి జరిగింది.
    ఉదంకుడు పైలమహర్షికి ప్రియశిష్యుడు. గురుకులంలోని శిష్యులందరిలో ఆచార్యులవారికి అత్యంత ప్రేమపాత్రుడైనాడు. ఉదంకుడు పైలమహర్షి దగ్గర అన్ని విద్యలూ అభ్యసించాడు. సమస్త శాస్త్రాలూ చదువుకున్నాడు. సాంగోపాంగంగా వేదాలన్నీ అధ్యయనం చేశాడు.
    ఉదంకుడు ఎన్నడూ గురువుమాట జవదాటేవాడు కాదు.
    గురుపత్నిని కన్నతల్లిగా గౌరవించేవాడు. తోడి విద్యార్థులతో ఎంతో ఐకమత్యంగా ఉండేవాడు. అనేకవిధాలుగా ఆచార్యదేవులను ఆరాధిస్తూ ఆదర్శ శిష్యుడనిపించుకున్నాడు ఉదంకుడు.
    ఒకప్పుడు కులపతి అయిన పైలమహర్షికి దేశంలో ఉన్న పుణ్య క్షేత్రాలన్నీ దర్శించి రావాలని కోరిక కలిగింది. ఆయన ప్రియశిష్యుడైన ఉదంకుణ్ణి పిలిచి, "కుమారా! నేను ఎంతోకాలం నుంచీ పుణ్యక్షేత్రాలు దర్శించి రావాలని అనుకుంటూ ఉన్నాను. కాని అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆశ్రమభారం అంతా నీమీద ఉంచి రేపే తీర్థయాత్రలకు బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. నేను వచ్చేవరకు ఆశ్రమకార్యాలు నిర్వహించటానికి నిన్ను నియమిస్తున్నాను" అన్నాడు ఆదరంగా. ఉదంకుడు గురుని ఆజ్ఞ శిరసావహించాడు. పైలమహర్షి సతీసమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు.
    ఉదంకుడు గురుకులంలో అన్ని పనులూ శ్రద్ధగా నిర్వహిస్తున్నాడు. ఆశ్రమం చుట్టూ క్రొత్త క్రొత్త మొక్కలు నాటి నీళ్లు పోసి పెంచాడు. పూలతీగలకు పందిళ్లు వేసి పైకి ప్రాకించాడు. కుటీరాలన్నీ పరిశుభ్రంచేసి పవిత్రంగా ఉంచాడు. ఆవుపాలు ఎక్కువభాగం దూడలకు వదిలి ఆప్యాయంగా పోషించాడు. ముచ్చటగా పచ్చిక పెంచి ఆశ్రమధేనువులకు సరిపడ్డ ఆహారం సమకూర్చాడు. ఉదంకుని పర్యవేక్షణంలో ఆశ్రమం అంతా ప్రశాంతంగా పవిత్రంగా సత్పురుషుని హృదయం వలె ప్రకాశిస్తూ ఉన్నది.
    పైలమహర్షి తీర్థయాత్రలనుంచి తిరిగివచ్చాడు. ఆశ్రమం అంతా సుందరంగా సుప్రశాంతంగా ఉండటం చూచి చాలా సంతోషించాడు. క్రొత్త క్రొత్త మొక్కలూ, రంగురంగుల పుష్పాలూ, బలసిన లేగదూడలూ, చెంగు చెంగున దుమికే లేడిపిల్లలూ అన్నీ ఉదంకుని సేవాసక్తినీ, దీక్షాశక్తినీ వేనోళ్ళ చాటుతున్నాయి. తన ప్రియశిష్యుడి కార్యదీక్షకు పరమానందపరవశుడైనాడు పైలమహర్షి.
    "ఇప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించటానికి ఉదంకుడు సర్వవిధాలా సమర్థుడైనాడు. ఇక ఇంటికి పంపి ఒక ఇంటివాణ్ణి చెయ్యాలి" అనుకున్నాడు మళ్ళీ గురుదేవుడు. ఆయన వెంటనే ఉదంకుణ్ణి పిలిచి "కుమారా! ఉదంకా! నీవు ఆశ్రమాన్ని అందంగా తీర్చిదిద్దావు. నాకు చాలా సంతుష్టి కలిగింది. ఇప్పుడు నీవు పరిపూర్ణ విద్యావేత్తవైనావు. ఇంక ఇంటికి వెళ్ళి గుణవంతురాలైన కులకన్యను పెండ్లాడి, కాపురం తీర్చిదిద్దుకో" అన్నాడు ఆప్యాయంగా.
    ఆ మాటలు వినగానే ఉదంకుడికి మళ్ళీ ఒక్కమాటుగా మోదమూ ఖేదమూ పొంగివచ్చాయి. అతని కన్నులు చెమ్మగిల్లాయి. కంఠం గాద్గద్యం పొందింది. ఇంటికి వెళుతున్నందుకు ఆనందం, గురుదేవులనూ గురుకులాన్నీ వీడిపోతున్నందుకు విచారం కలిగాయి ఉదంకుడికి. చిన్నతనం నుంచీ తోడునీడగా ఉన్న మిత్రులందరినీ వీడిపోవలసి వచ్చినందుకు చాలా బాధ పడ్డాడు. ఆశ్రమవాటికలోని లతలనూ వృక్షాలనూ తను ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. ఆవు దూడలను మచ్చిక చేసుకొని వీపులు దువ్వి ఆనందంగా ఆటలాడుకున్నాడు. ఇప్పుడు ఇటువంటి ఆప్తబృందం అంతటినీ విడిచి వెళ్ళిపోవటానికి పరిపరి విధాలుగా పరితపించాడు ఉదంకుడు.
    ఉదంకుడు గద్గదకంఠంతో గురుదేవుని చరణాల మీద వ్రాలి "స్వామీ! విద్యాభ్యాసం పూర్తికాగానే ఆచార్యదేవులకు అభీష్టమైన గురుదక్షిణ అర్పించాలని పెద్దలంటారు. ఇంతకుముందు ఈ ప్రశంస వస్తే తమరు నవ్వి ఊరుకున్నారు. మరి తమకు ఏమి కావాలో ఆజ్ఞాపించండి. ఏ వస్తువైనా సరే, ఎంత కష్టసాధ్యమైనా సరే, తెచ్చి తమ పదసరోజాల మీద సమర్పించుకుంటాను" అని విన్నవించుకున్నాడు కన్నీరు తుడుచుకుంటూ.
    పైలమహర్షి కొంచెం ఆలోచించి, "కుమారా! ఇప్పుడు నాకు సంధ్యావందనానికి సమయం అయింది. గురుదక్షిణ విషయం విశ్రాంతిగా ఆలోచించి చెపుతాను" అన్నాడు.
    మరునాడు మళ్ళీ ఉదంకుడు దక్షిణ విషయం గురుదేవునికి గుర్తుచేశాడు. అసలు పైలమహర్షికి గురుదక్షిణ అడగటమే ఇష్టం లేదు. తన ప్రియశిష్యుని సేవాభావం, సద్గుణ సంపదా - అవే తనకు గురుదక్షిణగా ఆయన భావించుకున్నాడు. ఇప్పుడు తన అంతేవాసి సంతోషం కోసం ఏదో ఒకటి కోరక తప్పటంలేదు. కాని ఎంత ఆలోచించినా ఏమి కోరాలో ఆయనకు స్ఫురించలేదు. అందువల్ల ఆయన ఉదంకుణ్ణి చూచి "కుమారా! నీవు మీ గురుపత్నిని అడిగి ఆమె కోరిన వస్తువు తెచ్చి ఇవ్వు. అదే నాకు అభీష్టమైన గురుదక్షిణ" అన్నాడు.

 Previous Page Next Page