Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 90


    జాలరి యా చేపను తరుగుచుండగా దాని కడుపులో రత్నాంగుళీయకము కన్పించెను. వాఁడు విస్మితుఁడై దానిని వీథిలో నమ్మజూపెను. రాజనామాం కితమైన యా యుంగరమును జూచి రాజభటులు వానిని బంధించి మహారాజుకడకుఁ గొనిపోయిరి.
    దుష్యంతుఁ డంగుళీయకమును జూచి విభ్రాంతుఁడయ్యెను. అతనికి వెంటనే పూర్వస్మృతి కలిగినది. శకుంతలా వృత్తాంత మాకళింపునకు వచ్చినది. తాను జేసినా యకృత్యమునకు నెంతయో సంతాపము కలిగినది. నాఁడు మొదలు రాజకార్యముల మఱచి దుష్యంతుఁడు శకుంతలనే ధ్యానించుచు చింతాక్రాంతుడై యుండెను. రాజునకు శకుంతల జాడ తెలియలేదు.
    ఇట్లుండ నొకనాఁడు దేవేంద్రుని సారథి యగు మాతలి దుష్యంతుని కడకువచ్చెను. "రాక్షస సంహారమునకై సురరాజు నీ సహాయ మర్థించు చున్నా"డని యాతఁడు దుష్యంతునకు విన్నవించుకొనెను. దుష్యంతుడు దేవేంద్రునికి సాయముచేయ నంగీకరింపఁగానే మాతలి యాతనిని తన రథమెక్కించుకొని స్వర్గమునకుఁ దోక్కొనిపోయెను.
    అటఁ ద్రివిష్టపమున రాక్షసభాధ లేకుండఁ జేసి రథారూఢుడై హస్తినాపురమునకు తిరిగి వచ్చుచు దుష్యంతుడు మార్గమధ్యమున హేమకూటపర్వత మందలి కశ్యప మహర్షి యాశ్రమమున దర్శింప స్యందన మాపించెను.
    అచ్చట నతఁడొక యశోక వృక్షము క్రింద నిలిచియుండెను ఆ సమయమున తన తల్లికడఁ బాలుద్రావు సింహకిశోరమును బట్టి యీడ్చి తెచ్చు బాలవీరుఁడొకడు దుష్యంతునకు కన్పించెను.
    అంతలో నొక తాపసస్త్రీ యా సింగపుఁబిల్లను విడువు మనుచు బాలునికడకు వచ్చెను. కాని యా బాలు డట్లు చేయలేదు. ఆమె 'నీవైనఁజెప్పి విడిపింపు'మని యట విస్మయముతో వీక్షించుచున్న దుష్యంతుని హెచ్చరించెను.
    అంత మహారాజా బాలుని సమీపించి "నాయనా! ముని కుమారుఁడవు. ఇట్టి హింసాకర్మము లొనరింపవచ్చునా?" యనెను. అందులకా తపస్విని "ఈతఁడు మునిపుత్రుడు కాఁడు! పూరు వంశజుఁడు!" అనెను.
    "ఈతని తండ్రియెవరు?" అని రాజడిగెను.
    "పరిణయమాడిన భార్యను బరిత్యజించినవాని పేరుచ్చరింపరా"దని యామె బదులు పలికెను. దుష్యంతుఁడిదియంతయుఁ దనకే వర్తించుచున్న దనుకొనెను. ఇంతలో బ్రస్తావవశమున నా బిడ్డనితల్లి 'శకుంతల'యని మహారాజు చూచాయగా తెలిసికొనెను.
    అప్పుడా తాపసస్త్రీ బాలునిచేత రక్షాబంధనము కన్పింపకుండుటఁజూచి వ్యాకులపడుచుండెను. 'న్హాసింహశాబకముతో నాడుచున్నప్పుడు జారిపడిన'దని రాజు క్రిందపడియున్న దాని నందుకొని యిచ్చుచుండ నామె వారించి యిట్లనెను. 'దాని నీతని తల్లిదండ్రులు దక్కఁ దక్కినవారు ముట్టిన నది పామై కరచును. ఇది భగవంతుఁ డగు కశ్యపముని శాసనము'.
    ఆమె చెప్పినట్లు జరుగకుండుటయు, నా బాలుని జనని శకుంతల యగుటయు, నతఁడు పూరువంశజుఁడగుటయు దుష్యంతుని హృదయములోఁ గుతూహలమును రేకెత్తించెను. అతఁడా బాలకునెత్తుకొని ప్రేమపూర్వకముగా ముద్దాడుచుండెను.
    అంతలో మునికన్యలవలన నీవృత్తాంత మెరిగిన శకుంతల యచ్చటికి వచ్చెను. శకుంతలను జూచినంతనే దుష్యంతుడు తన పూర్వదుర్ణయమునకుఁ బశ్చాత్తప్తుఁడై యామె పాదములపైఁబడి క్షమాభిక్ష వేడెను.
    శకుంతల యట్టి సుదినమునే కోరుచున్నది. ఆమె యాతని హృదయ పరివర్తనమునకు మిక్కిలి సంతసించెను.
    దుష్యంతుడు భార్యాపుత్రులతోఁగలసి ఆశ్రమమందలి కశ్యపమహర్షిని సందర్శించెను. ఆ మహర్షి వారి నాశీర్వదించెను. ఆపై ఆయన
    "దుర్వాసుని శాపవశమున జరిగిన యపరాధమునకుఁ గినియకు"మని శకుంతలతోఁ జెప్పెను. రాజునకు గుమారుని జూపి "ఈతఁడు సమస్త ధరామండలమునకుఁ జక్రవర్తియై 'భరతు'డనఁ బ్రసిద్దుఁడగును. ఈతని పరిపాలనమున నార్యావర్తము భరతఖండమై ప్రఖ్యాతిగాంచు"నని పలికెను.
    అనంతర మా మహర్షి శకుంతల తల్లియగు మేనకకును, చిన్ననాఁటనుండి పెంచిన కణ్వునకును శకుంతలా దుష్యంతుల పునస్సమాగమవార్త తెలియఁజేసెను.
    దుష్యంతుడు కశ్యపమహర్షి యనుమతిఁ గొని భార్యా పుత్రులతో నిజరాజధానియైన హస్తినాపురమున కరిగెను. అచ్చట శకుంతలను బట్టిమహిషిగాఁ జేసికొని, సర్వప్రజలకు సౌఖ్యము కలుగునట్లు ధర్మ పరిపాలనముఁ జేయుచు, నిష్టభోగముల సంతుష్టుడగుచుఁ బెక్కేండ్లు రాజ్యమేలెను.


                            * * * *

 Previous Page Next Page