Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 89
శకుంతలా దుష్యంతము
పూర్వము హస్తినాపురమున దుష్యంతుఁడను మహారాజు పాలించు చుండెను. ఆ మహీపాలుఁ డొకనాఁడు మృగయావినోదార్థమై యరణ్యమునకుఁ జనియెను. అచ్చట దుష్యంతుఁ డొక సారంగమును జూచి దానిని వెన్నాడుచు కమనీయమగు కణ్వ మహాముని యాశ్రమమును బ్రవేశించెను.
ఆ సమయమునఁ గణ్వుడు సోమతీర్థమునకుఁ బోయి యుండెను. ఆయన పెంపుడు కొమరితయగు శకుంతల చెలులతో గూడి యాశ్రమ వృక్షములకు నీరు వోయుచుండెను. ఆమె ముఖమును జూచి పద్మమని భ్రమించి భ్రమర మొకటి పరిభ్రమింపసాగెను. అది యెంత తోలినను పోలేదు.
అంత శకుంతల భయపడి "నన్ను రక్షింపుఁడు రక్షింపు"డని చెలికత్తెలను బ్రార్థించెను. ఇదంతయుఁ జూచుచుఁ బ్రచ్చన్నముగా నుండిన దుష్యంతమహారాజదే యదననుకొని లతాకుంజము చాటునుండి యెదుటికివచ్చి "ఇదిగో - నేను రక్షింతు" ననుచు నా గండుతుమ్మెదను ద్రోలివైచెను.
తరువాత వారు రాజున కతిథిసత్కార మొనరించిరి. ఆతఁడును వారితో ముచ్చటించుచు శకుంతల నిజముగాఁ గణ్వపుత్రి కాదనియు. మేనకా విశ్వామిత్రుల యపత్య మనియుఁ దెలిసికొని యామెయందు మనస్సు నిలిపెను. ఇంతలోఁ బరిజనము తన్ను వెదకుచు వచ్చు టెఱింగి దుష్యంతుఁడు మునికన్యకల వీడ్కొని తనవారిఁ జేరనేగెను.
మఱునాఁడు రాజు వేఁట చాలించి సైనికులకుఁ బురమునకు మరలిపోవ ననుజ్ఞ యిచ్చెను. దుష్యంతున కిప్పుడొక విషమ సమస్య వచ్చినది. ఆశ్రమమున నేనెపముతోఁ దిరిగితాను ప్రవేశింపనగునా యని యాతఁ డెంతయో ఆలోచించెను. కాని యందుల కుపాయము తోఁచలేదు.
అంతలో మునికుమారు లిర్వురు దుష్యంతుని కడకువచ్చి కులపతియగు కణ్వమహాముని లేని కారణమున రాక్షసులు విజృంభించి యాశ్రమమున యజ్ఞధ్వంస మొనరించుచున్నారనియు వచ్చి రక్షింపవలయుననియుఁ గోరిరి. దుష్యంతుఁడు వారి ప్రార్థన మాలకించి తక్షణమే యాశ్రమమునఁ బ్రవేశించి దానవులఁ బాఱద్రోలి తపోధనుల యజ్ఞములను గాపాడెను. మఱల శకుంతలను గలిసికొనెను.
ఆ భూకాంతుఁడు కణ్వపుత్రియగు శకుంతల యందు బద్ధానురాగుఁడై గాంధర్వవివాహమున నామెను బరిగ్రహించెను.
తరువాత నాతఁడు తన పట్టణమగు హస్తినాపురమున కేగుచు శకుంతలకు స్వనామాంకిత మగు నంగుళీయక మిచ్చి యిందెన్ని యక్షరములు గలవో యన్ని నాళ్ళలోఁ దిరిగివత్తునని నుడివి వెడలిపోయెను.
అనంతరము కొంతకాలము గడచినది. శకుంతల తనకు భర్త బహూకరించిన యంగుళీయకమును జూచుకొనుచుఁ బ్రాణేశ్వరుని యాగమమున కెదురు చూచుచుండెను. చెప్పిన గడువుదాటినది కాని యామెకు పతిజాడ కనిపించలేదు.
ఒకనాఁడు శకుంతల భర్తృవియోగముచే వ్యాకుల హృదయయై యాశ్రమములో విచారించుచుఁ గూర్చుండి యుండెను. అప్పుడు దుర్వాసుఁడను నొక మహర్షి యాతపోవనమునకు విచ్చేసెను. అన్యమనస్కయగు శకుంతల యామహామహుని యాగమునకు గమనింపలేదు.
దుర్వాసమహాముని ముక్కోపి. అతడు శకుంతల తిరస్కారదృష్టితో తనకు భిక్ష నిడలేదని కడుంగడు కోపించి "నీవు అతిథిని మఱచినట్లే నీ భర్త నిన్ను మఱచిపోవుగాక!" యని భయంకరముగా శపించెను.
ఆ మహాముని శాపవాక్యములు శకుంతలకు విన్పింపలేదు. ఈ వార్త యెఱిఁగి శకుంతల చెలికత్తె లనసూయాప్రియంవదలు మహర్షి పాదములపైఁబడి శాపవిమోచన మనుగ్రహింపవేడిరి. అతడుఁను జాలిపడి "రాజున కేదేని యభిజ్ఞానమును జూపిన స్మృతిగలిగి శాపవిముక్తి యగు"నని పలికి వెడలిపోయెను.
కణ్వమహాముని సోమతీర్థమునుండి తిరిగివచ్చి జరిగిన వృత్తాంత మంతయుఁ దెలిసికొని దుష్యంతునివంటి మహారాజు శకుంతలకు భర్తగా లభించెఁగదా యని సంతసించెను.
అనంతరము మఱికొన్ని దినములు గడచినవి. కాని దుష్యంతుడు తిరిగిరాలేదు. కొన్ని మాసములు గడచినవి మహారాజు జాడలేదు. అప్పుడు కణ్వమహర్షియే యిరువురు శిష్యులను తోడిచ్చి గర్భవతియగు శకుంతలను దుష్యంతుని సమీపమున కంపెను. శకుంతల కన్నీళ్ళతో తండ్రిని నిచ్చెలులను ఆశ్రమమును వీడి అత్తవారింటికిఁ బ్రయాణమయ్యెను.
శకుంతల మునిబాలకులతో హస్తినాపురమున కేగి తన నాథుఁడగు దుష్యంత మహీకాంతుని సందర్శించెను. దుష్యంతుడు శకుంతలను గాంచి "నేను నిన్నెఱుఁగను పొ"మ్మనెను. శకుంతల ఎన్నిగుర్తులు చెప్పినను నిష్ప్రయోజన మయ్యెను. దుర్వాసుని శాపమున మహారాజు కణ్వాశ్రమములో జరిగిన వత్తాంతమును మఱచిపోయెను.
శకుంతల కొక యాలోచన తట్టినది. తనకు రాజిచ్చిన యంగుళీకమునుజూపి యాతనికి తపోవనవృత్తాంతము జ్ఞప్తి కెలయింపవలయునని యామె తలంచినది. కాని యా యంగుళీయకము మార్గమధ్యమున శక్రావతార తీర్థమున స్నానమాడునప్పుడు జారి జలములలోఁ బడిపోయినది. ఆ సంగతి శకుంతల గుర్తింపలేదు. పాప మామె చేయునదిలేక నిండు పేరోలగమున నిశ్చేష్టురాలై యట్లే నిలిచిపోయెను.
దుష్యంతుఁడీమె నా భార్య కాదనియుఁ గల్పనాకథవలె నున్నదనియు శకుంతలను దిరస్కరించెను. అదివిని చేయునదిలేక కణ్వ మహాముని యంతేవాసులు "నీ వీమెను గణ్వాశ్రమమున గాంధర్వవిధితోఁ బరిగ్రహించినది సత్యము. నీ యర్ధాంగిని నీ కప్పగించుచున్నాము" అని శకుంతల నచటనే వదలి వెడలిపోయిరి. దుష్యంతుడు కింకర్తవ్యతామూఢుఁడై నేలఁజూచుచుండెను. శకుంతల దుఃఖవివశ యయ్యెను.
అది చూచి రాజపురోహితుడు దుష్యంత ధరణీకాంతుని జూచి "తమకుఁ జక్రవర్తికాదగు తనయుఁ డుదయించునని దైవజ్ఞులు వచించిరిగదా! ఈమెకట్టి రాజలక్షణములుగల పుత్రుడు జన్మించిన రాణిగాఁ బరిగ్రహింపవచ్చును. ప్రసవించు దనుక నీమెను మా యింటికడ నుంచెద"నని మహారాజు ననుజ్ఞుగొని యామెను దనతోఁ దీసికొని పోవుచుండెను. త్రోవలో శకుంతల తల్లియగు మేనకయను దేవకాంత యొక దివ్యతేజోరూపమున వచ్చి శకుంతల నాకాశమార్గమున నేచటికో యెత్తికొని పోయెను.
శకుంతల చేతినుండి నీటిలో జారిపడిన యుంగరము నొక మత్స్యము మ్రింగెను. అనంతరము కొన్నాళ్ళ కొక పల్లెవాఁడు శక్రావతారతీర్థమునఁ జేపలు పట్టుటకై పోయెను. ఆ యుంగరమును మ్రింగిన మీనము జాలరి వలలోఁబడినది.
Previous Page
Next Page