Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 88

                                 


                                          బంగారు తల్లి

    మాది కర్షక కుటుంబము. మా నాయనగారు పల్లెటూరి రైతు. నేను రైతు బిడ్డను. మాకు పది ఎకరముల భూమియున్నది. మా భూమాత బంగారుతల్లి. నా పేరు కల్పవల్లి.
    మాది పెంకుటిల్లు, ఇంటిముందు గొడ్లకొట్టము. ఇంటి వెనుక పెద్దదొడ్డి. మా దొడ్డిలో పెద్దబావి యున్నది. ఆ బావిలోని నీరు మానస సరోవరములోని సలిలమువలె మధురముగా, మనోహరముగా, చల్లగా, స్వచ్చముగా నుండును.
    నేను దొడ్డినిండ రకరకముల పూలచెట్లు పెంచుచుందును. బంతి, చేమంతి, మల్లె, మాలతి, సంపెంగ, పారిజాతము మొదలైన మంచి మంచి పుష్పజాతులు మా చిన్నతోటలో నల్లారు ముద్దుగ పెరుగుచున్నవి.
    మా గొడ్ల కొట్టములో నందివాహనముల వంటి వృషభములు, నందినీ ధేనువులవంటి గోవులు, ముద్దులు మూటగట్టు కోడెదూడలు కన్నులపండువు చేయుచుండును. మా కోడెదూడలు మెడలలో మువ్వల పట్టెడలు ఘల్లుఘల్లుమని మ్రోగుచుండ చెంగుచెంగుమని గంతులు వేయుచుండును. ఆ చక్కని దృశ్యములు చూచి మేము మురిసిపోవుచుందుము.
    మా నాయనగారు తెల్లవారుజాముననే యరక తోలుకొని పొలము పోవును. నేను మాయమ్మతో ప్రత్యూషముననే లేచి కాలకృత్యములు తీర్చుకొందును. చక్కగా స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరింతును. ఒకమాటు నా పూలతోటలోనికి పోయి నలుమూలలు చూచివచ్చెదను.
    మాయమ్మ నా పూల మొక్కలకు కొంచెము దూరములో పాదులు పెట్టి కూరగాయలు కాయించుచున్నది. పొట్ల, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, బీర, బెండ, రామములగ మొదలైన కాయగూర లన్నియు మా దొడ్డియందె పండింతుము. మేము కూరలకై బజారునకు పోవలసిన పనిలేదు.
    ప్రతిదినము రెండు గడియలు ప్రొద్దెక్కుసరికి మాయమ్మ నాకును మా యన్నకును చలిదియన్నము పెట్టును. అన్నము తిని నేను కొంచెముసేపు రాట్నముపై నూలుతీయుదును. మా యన్నయ్య ఆవులను, కోడెదూడలను తోలుకొని బీటికిపోవును.
    మాయమ్మ చకచక వంటచేయును. కూరలు తరిగి యిచ్చియు, పోపులపెట్టె నందించియు, నేను మా యమ్మకు సాయము చేయుదును. క్షణములో వంట పూర్తియైపోవును. వెంటనే మా యమ్మ పొలము పోయి నాన్నగారి కన్నమునిచ్చిరమ్మని నన్నుపంపును.
    అన్నపుదుత్త నెత్తిపైబెట్టుకొని యాడుచు పాడుచు నేను చేనికి చేరుకొందును. అల్లంతదూరమున నన్నుచూడగానే మా నాన్న యరక నాపివేసి యెద్దులను విడిచిపెట్టును. పట్టెడ లూడఁదీయగానే మా యెద్దులు పరుగు పరుగునబోయి ప్రక్కనే యున్న పచ్చని బీటిలో మొలబంటి గడ్డిలో నిలబడి స్వేచ్చగా కడుపునిండ మేత మేయును.
    మా నాన్నగారు మొక్కజొన్న చేనిలోని దోసపండ్లు రెండు కోసి కొనివచ్చి నాకిచ్చును. నేను దోసముక్కలు కరకర లాడించుచు కొంచెము సేపు మంచె క్రింద కూర్చుందును.
    మా పొలములో నొక పెద్దకుంట యున్నది. ఆ కుంటలోని నీరు టెంకాయ పాలవలె తెల్లగా చల్లగా నుండును. ఆ కుంటయొడ్డున పెద్ద వేపచెట్టున్నది. మా నాయనగారు కుంటలో దిగి కాలుసేతులు కడిగికొనివచ్చి వేపచెట్టుక్రింద కూర్చుండి యన్నము మూట విప్పును. మా నాన్న గోంగూర పప్పు కలుపుకొని మిరపతోటలోనికిఁ బోయి కొరుకుడు కాయలు తెమ్మని నన్ను పంపును.
    మా మిరపతోట గుబురు కట్టిన చిన్న చిన్న చెట్లతో, వ్రేలెడేసి కాయలతో, ఎఱ్ఱని పండ్లతో చూడముచ్చటగా నుండును. అచ్చటచ్చట వంగచెట్లకు కొమ్మ కొమ్మకు పెద్ద పెద్ద వంకాయలు వ్రేలాడుచుండును. పసుపు పచ్చని పూలతో బంతి మొక్కలు పచ్చి బాలెంతలవలె నిలబడియుండును. నేను గబగబ తోటలోనికి పరుగెత్తి రెండు గుప్పిళ్ళనిండ మిరపకాయలు కోసి కొని వచ్చి మా నాన్న ముందు కుప్పపోయుదును.
    మా నాన్న భోజనము చేయుచు నడుమ నడుమ నాకు గూడ నొకముద్ద పెట్టుచుండును. పెరుగన్నము మాత్రము చెరియొక ముద్దవంతున మేము భుజింతుము. నాకు మా పెద్దగేదె పెరుగన్న మిక్కిలి యిష్టము.
    ఆహా! పచ్చని పంటపొలముల నడుమ కుంటయొడ్డున గూర్చుండి చల్లని వేపచెట్టు నీడలో ఆ మాట యీ మాట చెప్పుకొనుచు నన్నపుముద్దలు మ్రింగుట యెంతటి యదృష్టము! ఎంతటి యానందము! ఎంతటి సంతోషము!
    కొంతసేపు విశ్రాంతి తీసుకొనిన తర్వాత మా నాన్నగారు మరల అరక గట్టి పొలము దున్నుట ప్రారంభించును. నేను హాయిగా కొంచెముసేపు మంచె క్రిందనున్న మంచముపై పడుకొని నిద్రింతును. తరువాత లేచి మా పంటచేనంతయు నలుమూలలు తిరిగిచూచి వత్తును. పచ్చని కందిచేలలో నున్న పసుపు పచ్చని జనపపూవులు భూమాత ధరించిన యాకుపచ్చని చీరెమీద బంగారు పూవులవలె ప్రకాశించును.
    మా పొలములో నున్న మంచెపై కెక్కి పంటవెన్నులపై వ్రాలు పరిగెపిట్టలను తోలుచుందును. నాకు వడిసెల పట్టుకొనుటన్న నెంతయో యుత్సాహము. అంతలో మాయమ్మ పెద్దగంప తీసుకొని పొలములోనికి వచ్చును. మే మిరువురమును కలిసి గంపనిండ గడ్డికోయుదుము. ఇంతలో మా యన్న వచ్చి రెండు మోపులు పచ్చిమేత కోయును. సాయంకాలము కాగానే మే మందరము గృహాభిముఖుల మగుదుము.
    ఇంటికివచ్చి శుభ్రముగా స్నానము చేసి యుతికిన గుడ్డలు ధరించి దీపము ముందు కూర్చుందుము. మా నాన్న నాకు కొత్త పాఠములు నేర్పును. కొంచెముసేపు చదువుకొని భోజనము చేసి మా అన్నయు నేనును కమ్మని కథలు చెప్పుకొనుచు ఆనందముగా నిద్రపోదుము.
    మా పొలము బంగారుతల్లి. ఆ తల్లి రాత్రింబవళ్ళు మా కుటుంబమును కనిపెట్టియుండును. వరి, వరిగ, జొన్న, మొక్కజొన్న మొదలగు నన్నిధాన్యములు మా పొలములో పండును. పంటకంకులతో వంగి గాలికి నొయ్యారముగా నూగుచున్న మా సస్యసంపదను చూచినప్పుడు నేనును పొంగిపోవుదును.


           

    పంటచేలు కోతకు రాగానే మా నాన్నగారు చాలామంది కూలీలను పిలుచుకొని వత్తురు. కూలీలు కొడవండ్లు పట్టుకొని నడుములు వంచి పట్టెల వెంబడి చకచక పైరు కోయుదురు. అట్లు కోసిన పైరంతయు బాగుగ నెండిన తరువాత బోదెలు బోదెలుగా పెట్టుదురు. అనంతర మా బోదెలన్నియు పెద్ద పెద్ద మోపులు కట్టుదురు. ఆ మోపులన్నియు తీసికొనిపోయి పొలము నడుమ పెద్ద పెద్ద కుప్పలు వేయుదురు. మాగాణి చేలలో కూడనిట్లే చేయుదురని మా మామయ్య నాకు చెప్పినాడు.
    కొంతకాలమైన తర్వాత పంట కుప్పలు కళ్ళమున వేయుదురు. ఎద్దులను బంతులు కట్టి "పొలియ-పొలియ" యని పాటలు పాడుచు కుప్పనూర్పులు సాగింతురు. అట్లు నురిపిడి చేసిన తర్వాత గడ్డినంతయు తీసివేసి ధాన్యమును చేటలతో తూర్పూర పోయుదురు. రాయిరప్పలు, గడ్డిగాదములు లేక పరిశుభ్రమైన ధాన్యపురాసులు బంగారు రాసులవలె కన్నులార చూచి మా నాన్న "ఈ బంగారు తల్లి దయయున్నచో మన యిల్లంతయు బంగారమే" అని సంతోషపారవశ్యముతోఁ బలికి పుడమితల్లికి చేతులుమోడ్చి నమస్కరించును.
    అప్పటికప్పుడే పనిపాటలవారు, బీదలు, బిచ్చగాళ్ళు కళ్ళముచుట్టు మూగుదురు. నాన్న చేటలతో ధాన్యము నెత్తి వారి చెఱగులలో పోయును. మిగిలిన ధాన్యమంతయు బస్తాలకు నింపి మూతులు కట్టి బండ్లకెత్తుదురు. రెండెద్దుల బండ్లు ధాన్యలక్ష్మితో మెల్లగా మా యింటికి చేరును.
    ఇదంతయు మన బంగారుతల్లి కరుణయే! కనుకనే-
    "సుజలాం సుఫలాం మలయజ శీతలాం
    సస్యశ్యామలాం మాతరం    
    వందే మాతరం"
    అని మన మందఱము పాడుకొనుచున్నాము.
                                            * * * *

 Previous Page Next Page