Previous Page Next Page 
సీతాచరితం పేజి 40


    "నీవూ అలాగే చేస్తున్నావు. నీ భర్త ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నావు. రాముడు అడవులకు వెళ్తాడు. అతని వెంట అయోధ్యకూడా తరలిపోతుంది. అప్పుడు పాడుబడిన అయోధ్యనే భరతుడు పాలించాల్సి ఉంటుంది. కాబట్టి నా మాట విను. నీ పట్టువిడువు. రామునికి పట్టం కట్టించు. అయోధ్యను రక్షించు దశరథుని రక్షించు."


    సుమంత్రుడు వాడియైన మాటలే విసిరాడు. కైక మంకు చూచాడు. సూతునికి ఆజ్ఞాపించాడు.


    "రామునితో వెళ్లడానికి చతురంగ సేనలు తయారు చేయి. రత్నరాసులు తరలించు. వేశ్యలకు వణిక్కులను పంపు. అంగడులు తయారుచేయించు. నా స్వంత ధాన్యాగారం, బొక్కసం అడవులకు తరలించాల్సిందే. అలా పంపితే రాముడు అడవుల్లో యజ్ఞాలుచేస్తూ కాలం గడుపుతాడు. సుఖపడ్తాడు. కాబట్టి సమస్త సంపదలతో రాముణ్ని అడవులకు పంపే ఏర్పాట్లు చేయించు"


    కైక దశరథుని మాటలు విన్నది. ఆమెలో దుఃఖం పొంగింది. ముఖం వాడిపోయింది. "జనం లేని రాజ్యం కల్లులేని కుండలాంటిది. అలాంటి శూన్యం అయిన రాజ్యాన్ని భరతుడు కోరడు" అన్నది.


    ఆ మాటలు విని దశరథుడు మండిపడ్డాడు. "పాపిష్టిదానా! నీవు రాముని అడవులకు పంపమన్నావు. అంతే. అతడు ఏమీ తీసుకొని పోరాదని కోరలేదు" అన్నాడు.


    ఆ మాటలు కైక విన్నది. అంతకంటే ఎక్కువ మండి పడింది. "సగరుడు అసమంజసుణ్ని కట్టుగుడ్డలతో అడవులకు పంపాడు. నీవు రాముని అలాగే అడవులకు పంపాలి" అన్నది.


    దశరథుడు ఆ మాటలు వినలేకపోయాడు. ఛీ ఛీ అన్నాడు. అక్కడ ఉన్నవారంతా ఏవగించుకున్నారు. అయినా కైక లెక్కచేయలేదు.


    అక్కడ సిద్ధార్ధుడు అనే మంత్రి ఉన్నాడు. అతడిలా అన్నాడు.


    "అసమంజసుడు ప్రజలను నానా హింసలు పెట్టాడు. అతన్ని వెళ్లగొట్టమని ప్రజలంతా మొరపెట్టుకున్నారు. అందువల్ల సగరుడు తన పెద్ద కొడుకును అడవులకు పంపాడు. రాముడు అలాకాదే, అతడు నిర్దోషి. ధర్మాత్ముడు. అలాంటి వాణ్ని వెళ్లగొట్టడం అధర్మం అవుతుంది అందువల్ల సకల సంపదలూ నశిస్తాయి. కాబట్టి రాముని సంపదను అడ్డురావద్దు. అందువల్ల అపకీర్తి వస్తుంది"


    సిద్దార్ధుని మాటలు విన్నా కైకలో ఎలాంటి మార్పూ రాలేదు. అప్పుడు దశరథుడు "నేను రాజ్యాన్ని వదిలేస్తాను. సుఖాన్ని వదిలేస్తాను. ధనాన్ని వదిలేస్తాను. రాముని వెంట అడవులకు వెళ్తాను" అన్నాడు.


    రాముడు సిద్ధార్ధుడు చెప్పింది విన్నాడు. కైక మంకు గ్రహించాడు. తండ్రి పరిస్థితి చూచాడు.  "నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను. అడవులకు వెళ్తున్నాను. నాకు పరివారం ఎందుకు? ధనం ఎందుకు? ఏనుగునే ఇచ్చాను. ఏనుగును కట్టే తాడెందుకు? నాకు ఇస్తానన్నవన్నీ భరతునికి ఇచ్చేస్తున్నాను. మాకు నారచీరలు ఇప్పించండి. తవ్వుగోల, తట్ట మాత్రం ఇప్పించండి" అన్నాడు.


    కైక సంబరపడింది. నారబట్టలు తెచ్చి ఇచ్చింది. రాముడూ, లక్ష్మణుడూ నారచీరలు కట్టుకున్నారు. కాని సీత ఉచ్చును చూచిన లేడిలా కన్నీరు కార్చింది. అప్పుడు రాముడు చీరమీద చీరకట్టి ఇలా కట్టుకోవాలని చూపించాడు. అది చూచారు. అక్కడున్న జనులంతా కంట తడిపెట్టారు.


    సీత నార చీరలు కట్టుకోవడం చూచాడు. వశిష్టుడు సహించలేకపోయాడు. గర్జించాడు :-


    "కైకా! నీవు కులం నాశనం చేయడానికి పుట్టావు. రెండు వరాలు కోరావు. అధర్మానికి పాల్పడ్డావు ఇంకా అనేక దుర్మార్గాలకు ఒడిగడ్తున్నావు. సీత రామునితో అడవికి ఎందుకు వెళ్లాలి? సీత రాముని ఆత్మ. అందువల్ల ఆమె సింహాసనం ఎక్కుతుంది. రాజ్యం పాలిస్తుంది. భరతుడు నీ కొడుకు. నీ పాపపు బుద్ధులు అతనికి వస్తాయనుకోకు. అతడు పట్టం కట్టుకోడు. అతడూ అన్నపోయిన దారినే పోతాడు. నారబట్టలు కట్టుకుంటాడు. అడవులకు వెళ్లిపోతాడు.

 
    "అంతేకాదు రాముడు అయోధ్య వదులుతాడు. అయోధ్య సాంతం అడవులకు తరలిపోతుంది. పశువులు, పక్షులు కూడా ఉండవు. అయోధ్య పాడుబడ్తుంది. నీవు అలా పాడుబడిన అయోధ్యను పాలించాల్సిందే.


    రాముడు అడువికివెళ్తే సీత అయోధ్యలో ఉండదు. కాబట్టి ఆమెను సకల లాంఛనాలతో అడవులకు పంపాల్సిందే. అందుకు అడ్డుచెప్పడానికి నీకు ఏమాత్రం అధికారం లేదు.


    కైక మారు పలుకలేదు.


    రామునికోసం రథం తేవలసిందని సుమంత్రుని ఆజ్ఞాపించాడు దశరథుడు. సీతకు అడవుల్లో ఉన్నంతకాలం సరిపోయే బట్టలు, ఆభరణాలు సమకూర్చవలసిందని ఆజ్ఞాపించాడు.


    సుమంత్రుడు రథం సిద్దం చేశాడు.


    కౌసల్య సీతను చూచింది. ఆమెలో దుఃఖం పొంగింది. సీతను కావలించుకుంది. ఏడ్చింది. తల ముద్దాడింది. దుఃఖం దిగమింగింది. కళ్లు తుడుచుకుంది. కోడలుకు నీతులు బోధించింది :-

 
    "స్త్రీలు సుఖాల్లో భర్తతో పంచుకొంటారు. కాని భర్తకు కష్టం వస్తే అతన్ని లక్ష్యపెట్టరు. అది స్త్రీలకు సహజగుణం. వారు ఎప్పుడూ అబద్దాలాడుతారు. వికారంగా ప్రవర్తిస్తారు. మనసులోని మాట చెప్పరు. కోపంవస్తే ప్రేమను విడిచేస్తారు. స్త్రీ చిత్తము చంచలం. వారు విద్యను గుర్తించరు. అగ్నిసాక్షిగా జరిగిన వివాహాన్ని సహితం లెక్కచేయరు. కాని ధర్మమును అనుసరించే స్త్రీలకు భర్త తప్ప అన్యం అవసరం ఉండదు.


    "నా కొడుకు అడవులకు వెళ్తున్నాడు. అతణ్ణి అవమానించవద్దు. అతడు ధనికుడు అయినా, దరిద్రుడైనా  నీకు భర్తకదా"


    కౌసల్య అలా చెప్పింది. సీత విన్నది. చేతులు జోడించింది. "అత్తయ్యా! మీరు చెప్పినట్లే నడచుకుంటాను. తీగలు లేకుండా వీణ మ్రోగదు. చక్రాలు లేకుంటే రథం నడవదు. భర్తలేని స్త్రీ సుఖపడదు. కాబట్టి నేను పతివ్రతల ధర్మం అవలంభిస్తాను" అన్నది.


    రాముడు కౌసల్యకు చేతులు జోడించి "అమ్మా! పధ్నాలుగు సంవత్సరాలు త్వరలోనే గడిచిపోతాయి. తిరిగి వస్తాను. నిన్ను సుఖపెడ్తాను. దుఃఖించకు" అని తల్లికి పాదాభివందనం చేశాడు. తక్కిన మూడువందల యాభైమంది దశరథుని భార్యలకు నమస్కరించాడు. అది చూచి వారంతా గొల్లుమన్నారు. రాజభవనం సాంతం ఏడ్పులతో నిండిపోయింది.


    సీతా రామలక్ష్మణులు దశరథునికి ప్రదక్షిణం చేశారు. పాదాభివందనం చేశారు.


    లక్ష్మణుడు కౌసల్యకు నమస్కరించాడు. తన తల్లి సుమిత్ర పాదములు పట్టుకున్నాడు. సుమిత్ర దుఃఖం మింగింది. కొడుకును కావలించుకుంది. కళ్లు తుడుచుకుంది. డగ్గుత్తికతో ఇలా అంది :-


    "నాయనా! నువ్వు అడవుల్లో ఉండడానికే పుట్టావు. రాముని విషయంలో అనురాగం ఉంచు. అతనికి ఎలాంటి ఆపదా రాకుండా చూడు. రాముణ్ణి తండ్రిగా భావించు. సీతను తల్లిగా భావించు. అడవిని అయోధ్యగా భావించు బాబూ! క్షేమంగా వెళ్లిరా"


    రథం సిద్ధంగా వుంది. ముందు సీత రథం ఎక్కింది. ఆమె సర్వాలంకార భూషితంగా వుంది. సూర్యబింబంగా మెరిసిపోతుంది. తరవాత రామ లక్ష్మణులు ఎక్కారు. దశరథుడు సీతకు ఇచ్చిన నగలు, బట్టలు, రామలక్ష్మణులకు ఇచ్చిన ఆయుధాలు, కవచాలు, తవ్వుగోలలు తట్టలు రథంమీద పెట్టారు.

 Previous Page Next Page