ఇద్దరూ మాట్లాడుకుంటూ గవర్నరుపేటనుంచి ఊళ్ళోకి వెళ్ళి, నెమ్మదిగా కనకదుర్గగుడి ఎక్కసాగారు.
ఆ రోజు శుక్రవారం.
కనుచీకటి పడుతోంది. దేవాలయ ప్రాంగణంలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయ్. కంకణాల ఖణఖణలు, గాజుల గలగలలు, యవ్వనాల బుసబుసలు, కిలకిల నవ్వులు, బలాబలాల నిట్టూర్పులు, నివేదనలు.
పురుషుల అట్టహాసాలు, వికటహాసాలు, మూర్ఖత్వాలు, కీచులాటలు. వీటితో కోలాహలంలా, అందంగావుంది దేవాలయ వాతావరణం.
చక్రపాణి చలించాడు. ఈ దృశ్యం కనులపండువగావుంది. మనసు ఆర్థ్రమైంది. కనులు చెమర్చాయి.
"నీ గురించి చెప్పవేం?" అనడిగాడు రాజారావు.
"ఏమీలేదు చెప్పటానికి. విధి అనే ప్రవాహంలో ఒక నీటిబిందువును."
రాజారావు ఈ మాటల్ని విశ్వసించలేదు. చక్రపాణి ముఖంలో మలిన తుషారం ఏదీ లేదుగానీ ఏదో ఓ అస్పష్టమైన మధుర భావనాముద్ర, శృంగారంలోని మత్తు కనిపించింది. మనిషిలో సౌకుమార్యానికి ఏమీ లోతు లేదుగానీ అమాయకత్వం కొంచెం లోపించినట్లయింది. గట్టిగా ప్రశ్నిద్దామనుకున్నాడు గానీ ఓ నీలితెర క్రమ్మేసింది. తమాయించుకున్నాడు.
దుర్గ దర్శనం చేసుకువచ్చాక, ఇద్దరూ గోడ ఇవతల నిలబడి ఎంతో దిగువనున్న పట్టణసౌందర్యాన్ని చీకటిముసుగులో చూస్తూ ఎంతసేపో కబుర్లు చెప్పుకున్నారు.
వెనుక ఏదో చప్పుడయ్యేసరికి చక్రపాణి తల త్రిప్పిచూసి ఉలిక్కిపడి, "ఆమె...... మీ సత్యవతి కదూ?" అన్నాడు.
రాజారావు తలత్రిప్పి చూసి అప్రతిభుడై నిలబడిపోయాడు. సత్యవతి ఇద్దరు స్నేహితురాండ్రతో వచ్చింది. ఆమె ప్రక్కనున్న యువతి రాజారావుని చూసి ఆమె చేతినిగిచ్చింది. సత్యవతి ఇటుతిరిగి ఇతన్నిచూసి కళ్లప్పగించి నిలబడింది.
"పాణీ! పద!" అని రాజారావు చప్పున అక్కడినుండి కదిలాడు.
"బావా! అంది సత్యవతి వెనుకనుండి దీనస్వరంతో. రాజారావు ఆగలేదు. చక్రపాణి ఆదుర్దాగా "రాజా! ఆగు... ఆమెతో మాట్లాడు..." అన్నాడు.
"నీకు తెలియదు..." అంటూ రాజారావు గబగబా మెట్లు దిగిపోసాగాడు.
సత్యవతి నిర్ఘాంతపోయి నిలబడింది.
* * *
రాజారావు స్వగ్రామం వచ్చాక ఓ రోజు సౌదామిని ఉత్తరం రాసింది.
తనకు పెళ్లిచేయాలని ఇంట్లోవాళ్లు పట్టుబడుతున్నారట. తాను వారించాలని ప్రయత్నిస్తోంది. కానీ తల్లి మొండిపట్టు పడుతోంది. దానికి రాజారావు సమాధానం రాశాడు. తప్పకుండా పెళ్లికి ఒప్పుకోమని తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆమెతో వున్నాయనీ.
చక్రపాణితో కలిసి ఇంకా కొన్నిరోజులు బెజవాడలోనే గడుపుదామనుకున్నాడు. కానీ ఇక్కడి వ్యవహారాలు విషమించాయి. తనకిక్కడ ప్రమాదస్థితి ఏర్పడింది. ఈ మూడునెలల్లోనూ ఎన్నో మార్పులు జరిగాయి. తన ప్రతికక్షులు సమయం చూసుకుని విజృంభించారు. ముప్పాతికమంది ప్రజల్ని మళ్లీ తమవైపు త్రిప్పుకున్నారు. ఈ పరిణామాన్ని చూసి అతడు విహ్వలచిత్తుడయ్యాడు. క్రిందటిసారి తాను ఊరు విడిచిపోతున్నప్పుడే ఈ విషబీజాలు అంకురిస్తాయని పసిగట్టకపోలేదు. కానీ ఇప్పుడే ఇంత తీవ్ర ఫలితాన్ని పొందుతాయని విశ్వసించలా. తనగురించి ఇంత విప్లవం రేకెత్తుతుందని ఈషణ్మాత్రమైనా శంకించలేదు.
ఊళ్లో ఉండలేక మొదట ఏ బెంగుళూరైనా పోదామనుకున్నాడు. కానీ చేతిలో అట్టే పైకంలేదు. అందుకని ఆ ప్రయత్నం విరమించి తగాదాలకే సిద్ధపడ్డాడు.
అతడిని గురించి గుసగుసలు ఎక్కువైనాయి. ప్రజలు దుష్ప్రచారం సాగించారు. ఊళ్లో ఎవరిదో ఇల్లు తగలబడితే అది రాజారావే చేయించాడనే వదంతులు లేవదీశాడు. ఏ స్త్రీకో మానభంగం జరిగితే ఆమె భర్త తన ప్రత్యర్ధి కావడంవల్ల అతనే చేయించాడని అల్లరిచేశాడు. పరపతి పూర్తిగా నశించింది. అతను ప్రముఖపాత్ర వహించిన బ్లాక్ డెవలప్ మెంట్ స్కీమ్ మొదలైనవాటిలో డబ్బంతా స్వాహా చేశాడని విరోధులు ఊరందర్నీ నమ్మించారు. ఓ సాయంత్రం అతను తప్పనిసరి పనివుండి మామిడితోటకు పోయి ఇంటికి తిరిగివస్తుంటే వెనుకనుండి ఎవరో అతనిమీదకు గట్టిగా రాయి విసిరేశారు. తల చిట్లి నెత్తురు కారింది.
వేసంగి ఎండలు నిప్పులు చెరిగేస్తున్నాయి. ఎప్పుడూ అయితే అతను ఏ పుస్తకమో తీసుకువెళ్లి తోటల్లో గడిపేవాడు మధ్యాహ్నాలు. ఇప్పుడా అవకాశం లేదు. ఇలావుండగా ఓ రాత్రి అతని వాటా తోటలుకూడా ఎవరో తగలబెట్టారు.
ఈ బాధలు పడలేక అతను ఎంత అవసరమున్నా గదినుండి బయటకు రావడం మానేశాడు. ఆఖరికి భోజనంకూడా అక్కడికే తెప్పించుకుని తినసాగాడు.
ఈ బాధలు పడలేక అతను ఎంత అవసరమున్నా గదినుండి బయటకు రావడం మానేశాడు. ఆఖరికి భోజనంకూడా అక్కడికే తెప్పించుకుని తినసాగాడు.
కానీ అతని వైరిబృందం చర్యలు మరింత శృతిమించాయి. ఓ రోజు ఎన్నో అపరాధాల జాబితా తీసుకుని అతని ఇంటిమీదకు పోలీసులు వచ్చి పడ్డారు. అప్పుడు పెద్దన్నగారు వచ్చి "ఏదో చిన్నవాడు, తెలియకచేశాడు" అంటూ నచ్చజెప్పబోయాడు. రాజారావు ద్వేషంగా 'నేనేం చిన్నవాడిని కాదు... ఇందులో తెలియక చేసింది ఏమీలేదు. పదండి స్టేషనుకు' అంటూ బయల్దేరాడు. ఇంట్లోనుండి తల్లి ఏడ్చింది. పోలీస్ స్టేషన్ ఆ ఊరికి ఆరుమైళ్ళ దూరంలోవున్న చిన్న బస్తీలోవుంది. అతను స్టేషన్ కు చేరిన సమయానికి పరిచితుడయిన ఓ జమీందారు (బ్రతికిన రోజుల్లో) కనిపించాడక్కడ. ఆయన విస్తుపోయి 'ఇదేమిటి ఇతన్ని తీసుకువచ్చారు?" అంటూ పోలీస్ ఇన్స్ పెక్టర్ ను అడిగాడు. ఇన్స్ పెక్టర్ తల గోక్కుంటూ ఏవో కారణాలు చెప్పాడు. ఆయన నాలుగు కేకలేసి అవసరమయితే తాను జామీనుంటానని చెప్పి రాజారావును పంపించేశాడు.
రాజారావు నల్లబడిన ముఖంతో ఉసూరుమంటూ తిరిగి ఇంటికివచ్చాడు. ఏమిటి తన జీవితంలో ఈ విషణ్ణ వాతావరణం? ప్రపంచానికి తను చేసిన ద్రోహం ఏమిటి? చొరవ, ముందుకు పోయే గుణం మనిషికి పనికిమాలిన వస్తువులా?
చీకటిలో వాకిటిలో ఓ స్త్రీ కూర్చునివుంది. అతన్నిచూసి దిగ్గునలేచి లోపలికిపోబోయింది.
రాజారావు ఖిన్నుడయి 'వదినా!' అని పిలిచాడు.
ఆమె తడబడుతూ సందిగ్ధంగా ఆగింది.
'నేను పరాయివాణ్ణనా నన్నుచూసి లోపలకు పారిపోతున్నావు?'
ఆమె సమాధానం చెప్పకుండా మెదలకుండా నిలుచుంది.