'వీడు ఇంకో వందరూపాయలకి ఎత్తు వేస్తున్నాడు!' తండ్రి అనుకున్నాడు.
'అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని వేషాలయినా వెయ్యవచ్చు' లక్ష్మణమూర్తి అనుకున్నాడు.
ఈవిధంగా తలా ఒకటీ అనుకున్నారు గానీ 'ఏమిటి' అని అడిగినవాళ్ళుమాత్రంలేరు. చివరికి జగన్నాధమే పెదవి కదిపాడు.
"నీకెంత అవసరమయినా సరే, ఈతఫా వందరూపాయలు కాదు కదా! వంద పైసలు కూడా ఇవ్వను" అన్నాడు జగన్నాధం.
"ఇవ్వనూ అని ఇప్పుడు మీరంటున్నారు కదా నాన్నా! బహుశా ఇంట్లో అందరిమాటా అదే అయివుంటుంది. కానీ, ఈ తఫా నాకంత బాధలేదు. నేను అడక్కముందే మీఅంతట మీరే ఏంకావాలి? అని అడిగి ఇస్తారు. ఇచ్చి తీరతారు. కావాలంటే బెట్ కాస్తాను." ముఖం ఆనందంతో వెలుగుతుండగా అన్నాడు బోసుబాబు.
'ఇదో కొత్త టెక్నిక్! అటుతిప్పీ, ఇటుతిప్పీ మళ్ళీ డబ్బు అడగటానికి ప్లాను-' ఎవరికివారు ఇదేమాట అనుకున్నారు.
ఎవరూ అడగకపోయినా బోసుబాబు చెప్పాడు "నా కృషి ఫలించింది" అని.
"మీరెవరూ నేను చెప్పింది నమ్మటంలేదు కదూ పేపర్ లో ఫ్రంట్ పేజీలో నాగురించి వార్తపడాలి, నాఫొటో ప్రచురణకావాలి. అప్పుడుగానీ నమ్మరు. నేనూ నా నోటితో చెప్పను. నేనెవరు? నా గురించి ఏమిటి? మీరే చూస్తారు. పేపర్ ఫ్రంట్ పేజీలో" అన్నాడు బోసుబాబు!
'పేపర్ ఫ్రంట్ పేజీలో పడటం మాట తరువాత. వీడి మాటలు, వీడి వరుసా చూస్తుంటే ఈ తఫా కొంపమీదకి పెద్దదే తెచ్చేటట్లున్నాడు_' ఎవరికివారే అనుకున్నారు.
"ఏమిటి ?.... అని మీలో ఒక్కరూ అడగలేదుకాబట్టి నేనూ చెప్పను" బోసుబాబు మరోమాట వదిలాడు.
ఈవాగుడు మామూలే అన్నట్లు అందరూ ఇంకా మౌనవ్రతంలోనే వుండిపోయారు.
"నాకోరిక నెరవేరిన సందర్భంలో నేను మీ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వదలుచుకున్నాను. ఎవరికి ఏంకావాలో కోరుకోండి!" అన్నాడు బోసుబాబు.
'తాదూర కంతలేదు మెడకో డోలుట. నువ్వేం ఇవ్వక్కర లేదు నాయనా! ఏమీ అడగకుండా వుంటే చాలు. ఏదీ ఎత్తుకు వెళ్ళకుండా వుంటే అదే పదివేలు మా ప్రాణానికి. అదే మాఅందరికీ పెద్ద గిఫ్ట్' ఎవరికి వారే ఈ మాట అనుకున్నారు పైకి అనే ధైర్యంలేక.
"అడిగినా మీరెవరూ చెప్పటంలేదు. మీ అందరి ఇష్టాలూ నాకు తెలుసుకదా! నేనే మీ అందరికీ మీకు ఇష్టమయిన గిఫ్ట్ లు కొనిపెడతాను. నాన్నగారికి సింహం తలకాయ వున్న చేతికర్ర ఇష్టం. అతిఖరీదైన చేతికర్ర కొని ఇస్తాను.
అమ్మకి వంటిరాయి రవ్వతో చేసిన ముక్కుపుడక ఇష్టం. అది చాలా ఖరీదు అని, తన కోరిక ఈ జన్మకి తీరదని తరచూ అంటూ వుంటుంది.
అమ్మా! ఖరీదయిన రవ్వతో చేయించిన వంటిరాయి ముక్కుపుడక నీకు చేయించి పెడతాను. ఈ గిఫ్ట్ అమ్మకి. ఇంక అన్నయ్యకి ఖరీదయిన స్కూటర్ ఇష్టం. ఖరీదయిన స్కూటర్ కొనిపెడతాను. వదినకి ఏమిష్టమబ్బా...." ఒక్కక్షణం ఆలోచిస్తూన్నట్లుగా వుండిపోయాడు.
సామ్రాజ్యలక్ష్మికి తన కోరిక బయటపెట్టాలన్న ఆత్రుత కలిగి గబుక్కున నోరు తెరిచింది. బోసుబాబు ముఖం చూసేసరికి_
"ఆ....గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. వదినకి పట్టుచీర ఇష్టం వదినా! రెండువేలుపైన ఖరీదుచేసే పట్టుచీర నీకు కొనిపెడతాను! మరిది ఇచ్చిన గిఫ్ట్ గుర్తుపెట్టుకుంటావు కదూ! ఇహ ఇంట్లో మిగిలింది చెల్లాయ్!
సుమిత్ర విషయంలో మాత్రం సుమిత్ర ఏదికోరితే అది గిఫ్ట్ గా ఇస్తాను. అయితే ఈ గిఫ్ట్ లన్నీ ఇప్పటికిప్పుడే ఇవ్వలేను. నెమ్మది నెమ్మదిగా అందరికీ గిఫ్ట్ లు ఇస్తాను. మీరంతా కలిసినాకేమి గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నారో ఈరాత్రి అంతా కూర్చుని బాగా ఆలోచించండి. మీరే గిఫ్ట్ ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను" ఈ మాట చెప్పి బోసుబాబు కూర్చున్న చోటునుండీ లేచాడు.
"అమ్మా! ఈరోజు ఎందుకో బాగా ఆకలి వేస్తోంది. అన్నం పెట్టేసేయ్. బట్టలు మార్చుకుని, కాళ్ళు కడుక్కునివస్తాను" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు బోసుబాబు.
బోసుబాబు ముఖం ఆనందంతో వెలిగిపోతుంటే ఇంట్లో అందరి ముఖాల్లో భయం చోటుచేసుకుంది.
భోజనాలు వడ్డించటానికి మౌనంగా అత్తాకోడళ్ళు లేచి వంటగదిలోకి వెళ్ళారు.
భోజనం చెయ్యటానికి వీళ్ళముగ్గురూలేచారు. ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోలేదు.
బోసుబాబు తన గదిలోంచి బయటకిరాగానే తలుపులు తాళం వేస్తాడు. కానీ, ఈరోజు భోజనాలకి వెడుతూ తాళం వెయ్యలేదు. అంతేకాదు ఆ రాత్రికూడా, గదిలోపల గడియ వేసుకోకుండానే పడుకున్నాడు.
ఈ విషయం ఆ యింట్లో ఎవరూ గమనించలేదు.
రాత్రి అయింది.
అందరూ ఎవరి ప్రక్కలమీదకి వాళ్లు చేరారు.
పడుకున్నారన్న మాటేగానీ, ఆరాత్రి ఎవరూ సరిగ్గా నిద్రపోలేదు.
ఆఖరికి బోసుబాబు కూడా తన గదిలో సరిగ్గా నిద్రపోలేదు.
ఆరాత్రి భారంగా గడిచి తెల్లవారింది.
ఉదయం కాఫీ త్రాగుతూ, పేపర్ తిరగెయ్యబోతున్న జగన్నాధం కంట ఒక వార్త, బోసుబాబు ఫోటో ఫ్రంట్ పేజీలో కనపడ్డాయి. 'తన కళ్ళు తనని మోసం చెయ్యటం లేదు కదా!' అనుకున్న జగన్నాధం "ఇది చూడరా అబ్బాయ్!" లక్ష్మణమూర్తికి పేపర్ అందించాడు.
లక్ష్మణమూర్తి ఆ వార్త చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.
"ఏమేవ్! ఒకసారి ఇటురా! సామ్రాజ్యం ఇటురా!" ఇద్దరూ భార్యలని కంగారుపెడుతూ ఒక పొలికేక పెట్టారు,
అత్తాకోడళ్ళతోసహా సుమిత్ర కూడా వచ్చింది అక్కడికి పరుగుపరుగున.
అందరూ పేపర్ చూశారు.
బోసుబాబు చెప్పింది నిజమే. బోసుబాబు ఫోటో పేపర్ లో ఫ్రంట్ పేజీలో పడింది. దానికింద మాటర్ కూడా అతని గురించే పడింది.
బోసుబాబు తన గదిలోంచి నెమ్మదిగా వచ్చి వాళ్ళ వెనుకనే నిలబడ్డాడు. అది ఎవరూ గమనించలేదు.
ఇండియా మొత్తంమీద ఐ.ఏ.ఎస్. పరీక్షరాసి పాసయిన వాళ్ళలో పైగా ఎక్కువ మార్కులతో పాసయి, ఇంటర్వ్యూలో సెలక్ట్ అయినవాళ్ళలో, బోసుబాబు పేరు అభినందిస్తూ ప్రచురించి వుంది. అతని ఫోటో, పాసయిన నెంబరు, రెండుముక్కల్లో అతని బయోడేటా ప్రచురించారు. ఈ విషయంలో బోసుబాబుకి ముందే తెలుసు. కానీ పేపర్ లో పడేదాకా ఇంట్లో చెప్పదలుచుకోలేదు బోసుబాబు.
ఇప్పుడు బోసుబాబు కలెక్టర్. కలెక్టర్ ఎలాగూ అవుతున్నాడు కాబట్టి కలెక్టర్ అని శుభ్రంగా చెప్పేయవచ్చు.
"ఇది నిజమేనంటావా?" భార్యని అడిగాడు జగన్నాధం.