విశ్వనాథంగారు అతన్ని పిలిచారు, "గురువులూ! తెల్లవారే వరకూ ఇలా వుండటం చాలా కష్టం! మనమిద్దరం స్మశానానికి తీసుకుపోదాం. వస్తావా?" అన్నాడు.
గురువులు వెంటనే బయలుదేరాడు.
ఇద్దరూ చెరో పిల్లవాడినీ ఎత్తుకుని కారులో బయలుదేరారు. గుండెలు పగిలే ఆక్రందనలతో, "బాబూ! మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా బాబూ?" అనే నరాలను చింపే కేకలతో మేడంతా కదిలిపోయింది. ఆ చీకటిరాత్రి... మేడ... మనుషులు... ప్రకృతి వికటాట్టహాసం చేస్తున్నట్లుగా వుంది.
సుందరం విశాఖపట్నంలో వున్నాడు. రామం తనూ వస్తానన్నాడు. కాని విశ్వనాథంగారు వద్దని వారించి రానియ్యలేదు.
కారు కొంతదూరం పోయాక ఇహ దిగి కాలినడకన పోవాలి. వెళ్లేటప్పుడు లాంతరు తీసుకువెళ్ళారు.
డ్రైవరు తనుకూడా వస్తానన్నాడు. అతను దీపం పట్టుకున్నాడు. విశ్వనాథంగారూ, గురువులూ చెరో పిల్లవాడినీ భుజంమీద వేసుకుని నడుస్తున్నారు.
ఆ అర్థరాత్రి సమయంలో, స్మశాన వాటికలో, అడ్డదిడ్డంగా పెరిగి భయంకరంగా కనిపిస్తున్న చెట్లమధ్యగా, పుర్రెలు, బొమికలు కాళ్ళకు తగులుతూ, వళ్లు జలదరిస్తుండగా, ఎక్కడినుంచో వినవచ్చే విచిత్ర శబ్దాలకు, నిర్ణవ నీరద సమాధులు, తమ నిట్టూర్పులు... గురువులికి కూడా కాస్త భయం వేసింది. అయ్యగారికి ఎలా వుందోననుకున్నాడు. ధైర్యంగా వుండటం కోసం కబుర్లు చెప్పసాగాడు.
ఇంతలో కాటికాపరి వచ్చి కలిశాడు. కొంతదూరంపోయి ఒకచోట రెండు గోతులు తీసి యిద్దర్నీ వుంచి మట్టి కప్పేశారు. పారతో తాను మట్టి వేస్తూండగా విశ్వనాథంగారికి మనసులో చైతన్యస్రవంతి ఏర్పడినట్లుగా అయింది. సృష్టి అంతా ఒక్కసారి కళ్ళముందు కదులాడింది. ఈ పసిపాపలు ఏం తప్పుచేశారు? వీళ్ళనింత నిర్దయగా విధి ఎందుకు చంపటం? ఈ కాసిని సంవత్సరాలు, నెలలు గడవటానికేనా ఈ భూమ్మీద జన్మించింది! వాళ్ళ జన్మకారణం తీరిపోయిందా ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది? జరగాలి. మాతృ హృదయపు చిల్లులు ఎన్ని లోకంలో? కంటినిండా నీటిబిందువులు జారి, ఈ శ్మశానపు మట్టిలో పడి యింకిపోయాయి. ఆ నీటి బిందువుళ పుట్టుకా మరణం అక్కడే.
ముగ్గురూ యింటిదారి పట్టారు.
* * *
అనంతరావుకు జీవితంపట్ల యిచ్ఛ నశించింది. నిరంతరం అదే తలపు! అదే స్మృతి. ఆరని మంట. ఆఫీసుకి ఆరునెలలు సెలవు పెట్టేశాడు. పిచ్చిగా, తనలోతను గొణుక్కుంటూ తిరుగుతూ వుండేవాడు. ఎవరితోనూ సాధారణంగా మాట్లాడేవాడు కాదు. అతనీ షాక్ నుంచి కోలుకోలేకపోయాడు.
ఇంట్లో సుభద్ర పరిస్థితీ అలానే వుంది. ఎప్పుడూ గదిలోనే ముభావంగా కూర్చునేది. శూన్యంలోకి అవలోకిస్తూ వుండేది. ఆ పాతదృశ్యాలన్నీ తలపుకి వచ్చినప్పుడల్లా గుండె పగిలిపోతున్నట్లుగా వుండేది.
వేళ అయేసరికి యింత అన్నం వండివుంచేది.
ఇద్దరూ సరిగ్గా తినేవారుకాదు. ఎప్పుడో కాస్త ఆకలి వేసినప్పుడు ఎవరిదారిన వారు పెట్టుకుని నాలుగు మెతుకులు కొరికేవారు. అసలు ఒక్కోసారి భోజనం మాటే తలపెట్టేవారు కాదు.
మొదట కొన్నిరోజులు కాకినాడలో వున్నారు. తర్వాత అనంతరావుకి అక్కడ వుండబుద్ధిగాక గుంటూరుకు బయల్దేరాడు. ఉండదలిస్తే భార్యని పుట్టింట్లోనే వుండమన్నాడు. ఆమె తల్లిదండ్రులు కూడా వుండమణి ఎంతో బలవంతం చేశారు. కాని ఆమె ఆ స్థితిలో భర్తని విడిచిపెట్టి వుండలేక తనూ అతనితో ప్రయాణమైంది.
అనంతరావు మనశ్శాంతి కోసం తహతాహలాడసాగాడు. ఇలా మొండిగా జీవించటం అతనికి దుర్భరంగా పరిణమించింది. ఆలోచన్లు కాల్చని క్షణం లేదు. పడుకుంటే నిద్రపట్టదు. మొదట్లో స్లీపింగ్ టేబ్లెట్స్ వేసుకునేవాడు. అవి క్రమంగా పనిచెయ్యటం మానేశాయి.
డబ్బులు పెట్టి పేకాట ఆడేవరకూ దిగాడు. అతనికి అందులోనూ తృప్తి కనిపించలేదు. త్రాగి చూశాడు. అదీ నచ్చలేదు.
ఓరోజు అతని ఆఫీసులో పనిచేస్తున్న బాపినీడు అనే అతను ఊరిబయట కలిశాడు. బాపినీడు ఏవో ఇంజక్షన్లు నిత్యమూ చేసుకుంటూ వుండటం అతను చూసేవాడు. ఒకసారి ఎందుకు అలా చెసుకుంటున్నావని అడిగితే 'హేపీనెస్ కోసం! ఇది చేసుకోకపోతే నాకు సుఖం వుండదు. జీవించలేను" అన్నాడు.
ఆ విషయాలన్నీ అనంతరావుకు జ్ఞాపకం వచ్చి అతను బాపినీడును అడిగివేశాడు. "నువ్వు ఎప్పుడూ ఇంజక్షన్లు చేసుకొనేవాడివే, దాన్ని గురించి చెప్పవూ?"అనడిగాడు.
బాపినీడు మొదట సంకోచించి 'ఎందుకూ?" అని అడిగాడు.
"కావాలి, నాకేమన్నా పనిచేస్తుందేమోనని... నాకు పిచ్చి ఎక్కేటట్లుగా వుంది. రిలీఫ్ కావాలి."
"దాన్ని మార్ఫియా అంటారు."
'ఎక్కడ దొరుకుతుంది?"
"ఎందుకు? వాడతారా?"
"వాడతాను. అది నామీద ఎలా పనిచేస్తుందో చూస్తాను" బాపినీడు దాన్నిగురించి తనకు తెలిసిన భోగట్టా అంతా చెప్పాడు. ఎక్కడ దొరుకుతుందో ఎలా సంపాదించాలో ఆ వివరాలన్నీ యిచ్చాడు. తనతో యింటికి వస్తే ఇంజక్షన్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తానన్నాడు.
అనంతరావు అతన్తో యింటికి వెళ్ళాడు.
అంతే అతనికి మార్పియా అలవాటయింది.
అది చేసుకున్నప్పుడు అతనికి మరోలోకంలోకి వెళ్ళి విహరిస్తున్నట్లుగా వుండేది. సుందర స్వప్నాలను కంటున్నట్లు వుండేది. గతమూ, వర్తమానమూ అంతా నశించి మనసంతా ఏదో హాయిని కలిగించే అనుభూతితో నిండిపోయేది. ఏదో తోడు దొరికినట్లు అనిపించింది. గాఢంగా నిద్రపట్టేది.
ఈ మార్ఫియా అలవాటు చిత్రమైంది. గంజాయికి కొంతమందీ, మద్యపానానికి కొంతమందీ దాసులయినట్లే యీ దుర్వ్యసనానికి కూడా అనేకులు బానిసలవుతుంటారు. అందులో వాళ్లు పొందే ఆనందం, సౌఖ్యం వాళ్ళకే తెలియాలి. అది అలవాటయినవారు రోజూ తీసుకోనిదే గడపలేరు. బ్రతుకులో నిషా లోపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనయినా యిబ్బందుల్లోనైనా అది తీసుకుని తీరవల్సిందే. లేకపోతే వాళ్ళకు తోచదు. పైగా యిది చాలా ఖరీదైన అలవాటు. డబ్బుగలవాడైతే ఫరవాలేదుగాని మధ్యతరగతి కుటుంబీకుని కెవరికైనా అది అబ్బిందా అతని అవస్థ భగవంతునికి తెలియాలి. ఎక్కడలేని డబ్బూ దీనికి ఖర్చు అయిపోతూ వుంటుంది. అప్పులు చేస్తాడు. అడ్డమయిన గడ్డీ కరుస్తాడు. కాస్త పచ్చగా వున్నవాడిని చూచి యీ దురలవాటు అతనికి కూడా మప్పుతాడు, అతని భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాడు. తరువాత మరొకర్ని వెతుక్కొంటాడు. ముఖ్యంగా ఏమయినా మానసిక బాధలు, శారీరక బాధలు వున్నవాళ్ళు ఈ దురభ్యాసానికి సులభంగా దాసులవుతారు. మహదానందంలో తమ బాధల్ని మరిచిపోతారు. ఎంతోమంది స్త్రీలు కూడా ఈ దుర్గుణానికి లొంగిపోతారు. మొదట ఒక్కో ఇంజక్షన్ తో వాళ్లు సంతృప్తులౌతారు. తరువాత రెండు... మూడు... నాలుగు... ఇలా చివికి చివికి నాశనమయిపోతారు.