Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 34

                                 

   
        "చుట్టరికంబునన్ మనసుసొచ్చి ననుం గరగించి వేడినన్
        దిట్ట తనంబు వోవిడిచి తీవ్రరణంబు కడంక దక్కినే
        బట్టిన యాయుధంబు వెడబాసిన గాని వధింపబోల ది
        ట్టిట్టన కేగు మిప్పరుస యింతక కాలము గాదు దానికిన్"

    తాత్పర్యము: నీవు చుట్ట రికమును గుర్తుచేసినావు. నా మనసున చొచ్చినావు. కరిగించి నావు. ప్రార్ధించినావు. నేను నా పరాక్రమము విడువవలె. రణరంగము నందు నేను పట్టిన ఆయుధము విడువవలె. అప్పుడు గాని నన్ను వధించుట సాధ్యపడదు. ప్రస్తుతము మాట్లాడకుము. వెళ్ళుము. నీవు అడిగిన దానికి ఇది సమయము కాదు.
    ధర్మరాజు భీష్ముని పలుకులు విన్నాడు. సంతసించినాడు. శిరసా నమస్కరించినాడు. పితామహుని అనుమతి పొందినాడు. సాగినాడు.
    శ్రీకృష్ణార్జునులు వెంటరాగా ధర్మజుడు ద్రోణుని వద్దకు వెళ్ళినాడు. ద్రోణునకు శిష్యునిగా పాదాభివందనము చేసినాడు.
    ద్రోణాచార్యుడు తాను విద్య నేర్పిన శిష్యుని ధర్మజుని చూచినాడు. అతని వినయమునకు మెచ్చినాడు. ఆచార్యునిలో వాత్సాల్యము పెల్లుబికినది.
    "ఆచార్య! యుద్దము అనివార్యమయినది. మీరు మా గురువులు. మీ అనుజ్ఞలేక ఆయుధము పట్టజాల. మీ అనుమతి కోరుటకు వచ్చినాను" అన్నాడు ధర్మరాజు.
    "వత్సా! నీవు ధర్మజ్ఞుడవు. వినయవంతుడవు. అనుమతి కోరోనవు. యుద్దము చేయుము" ఆచార్యుడు అనుమతించినాడు.
    "గురువర్యా! ఈ యుద్దమందు మాకు జయము కలుగునట్లు ఆశీర్వదింపుము" మరల అర్ధించినాడు ధర్మజుడు.
    నయ్యాచార్యుండు నీకుం గృష్ణుండు మంత్రియైయుండ నొరుల జయంబాశాసింపు మననేల? ధర్మంబేవలనంగలుగు నవ్వలన కృష్ణుండుగైకొను నవ్వలని జయంబగుననియె:
    "ఆచార్యవర్యా! నీవు జీవించి ఉండ నాకు గెలుపు కలుగుత అసాధ్యము. నిన్ను ఇతరులు గెలుచుటయు అసాధ్యము. నిన్ను వధించు ఉపాయము ఉపదేశింప ప్రార్ధన" పాండవాగ్రజుడు అడిగినాడు.
    ధర్మరాజు తన వధను గురించి అడిగినాడు. ఆచార్యుడు వ్యధనొందలేదు. అతని మనసు మలినముకాలేదు. వదనము మ్లానము కాలేదు. నిర్వికారముగా ఉన్నాడు. ఒక్క నవ్వు నవ్వినాడు. యుధిష్టిరుడు కోరినట్లే ఉపదేశించినాడు.
    "నా చేత నాయుధంబున్నంతసేపు నన్నుంజంపనెట్టివారికి నశక్యం బేను బ్రాయోపవేశంబున సన్న్యస్త్రశస్త్రుండ నైనంజంపుటకు నోపు, నట్టివారికి నది దొరకొనుబెద్ధము నమ్మగలవాడు సెప్ప నత్యంత దుస్సహంబైన కీడుమాట వింటినేని నట్టివాడనగుదు నప్పుడట్టిపగఱకు నప్పని దీర్పననువైయుండు"
    అంత ధర్మజుండు గృపాచార్యుని కడకేగె. అతడు వధింపనలవి కానివాడని యాతనివలన యెరింగె. అతని నుండి గెలుపు దీపనలందె.
    అట్లా ధర్మజుండు శల్యుని కడకేగి జయము కలుగునట్లుగా ఆశీర్వచనములు పొంది 'మామా! మద్రభూపాలా! నీవు కర్ణునకు సారథ్యము చేయుటకు అంగీకరించినావు. నీవు యుద్దమున కర్ణుని నానా విధములుగా దూషించుము. అతని ఉత్సాహము చేరచుము. అతనిని చిక్కుపరచుము. నీవు మాకు మామవు. ఈ వారము ప్రసాదింపుము" అని ప్రార్ధించి నాడు.
    "ధర్మజా! ఉద్యోగముననే నీవు ఇట్టి వరమును కోరినావు. నేను ఇచ్చినాను. మరల మాట ఇచ్చుచున్నాను. కర్ణుని దూషింతును. నిరుత్సాహపరతును. అతడు ఓడిపోవునట్లు చేతును. అవశ్యము జయము నీ పరమగును" అని వాగ్ధానము చేసినాడు శల్యుడు.
    ధర్మరాజు తన సేన వైపునకు సాగినాడు. వెంట శ్రీకృష్ణుడున్నాడు. భీమార్జున నకుల సహదేవులున్నారు. తిరిగి వచ్చుచుండగా రాదేయుడు - కర్ణుడు కనిపించినాడు. శ్రీకృష్ణుడు కర్ణునితో "రాధేయా! భీష్ముడు కూలునంత వరకు కౌరవ పక్షమున యుద్దము చేయనని ప్రతిన బూనినావు. భీష్ముడు ఉన్నంత వరకు పాండవపక్షమున యుద్దము చేయవచ్చును గదా! పాండవులు పరులు కారుగదా!" అన్నాడు.
    "శ్రీకృష్ణా!" కర్ణుడు అన్నాడు. ఈ ప్రాణములు దుర్యోధనునకు అర్పించినాను. నాకు మిగిలినది ఏమియులేదు. నేను దుర్యోధనేతరులకు ఉపయోగపడుట అసాధ్యము. రారాజునాకు సామ్రాజ్యమును అప్పగించి రుణము తీర్చుకుందును.
    ధర్మరాజు తిరిగి వచ్చినాడు. తన స్కంధావారమును చేరినాడు. రథమును అధిరోహించినాడు. కౌరవ సైన్యమును చూచినాడు. ఎలుగెత్తి ప్రకటించినాడు.
    "కౌరవ పక్షము చేరిన రాజులారా! సైనికులారా! మీలో ఎవరయిన నా పక్షమునకు రాదలచైనా రావచ్చును. అట్లు వచ్చిన వారిని నావారివలె - నా తమ్ముని వలె ప్రేమతో చూతును. ఇది నేను చేయు వాగ్ధానము రాదలచిన వారు నిస్సంశయముగా రావచ్చును."
    ధర్మజుని ప్రకటన కౌరవసేనలో కలకలము రేపినది. వారు ఆశ్చర్యచకితులయినారు. కనురెప్ప వాల్చక చూసినారు. యుద్దభూమి శాంతము ఉత్సుకతతో తిలకించినది.
    "కాలము జారిపోవుచున్నది.
    కౌరవసేన నుండి యుయుత్సుడు బయలుదేరినాడు.
    కౌరవసేన నిర్విన్నమయినది.
    పాండవసేనలో ఉత్సాహము ఉరకలు వేసినది.
    యుయుత్సుడు ధృతరాష్ట్రునకు సవతి భార్యవలన కలిగిన పుత్రుడు. "సోదరా! ధర్మజా! ఈ యుయుత్సుడు సేనా సమేతముగా నీ పక్షమునకు వచ్చుచున్నాడు. దుర్యోధనుడు దుష్టుడు, దుర్మార్గుడు. మిమ్ములను అనేక కష్టముల పాలు చేసినాడు. అతడు అధర్మి. నేను నీ పక్షమున ధర్మపక్షమున యుద్దము చేయతలచినాను. నన్ను నీ తమ్ములలో చేర్చుకొనుము" అన్నాడు.

         
    ధర్మజుడు రథముపై ఉన్నాడు. ఎదురుగా వచ్చుచున్న యుయుత్సుని సైన్యమును చూచినాడు. రథము దిగినాడు. ఎదురేగినాడు. యుయుత్సుని ఆలింగనము చేసుకున్నాడు. చేయి పట్టుకుని తన సేనవైపు సాగినాడు.
    యుయుత్స ధర్మజులు జతగా సాగుచున్నారు.
    వారి వెనుక సేన కదళి వచ్చుచున్నది.
    ద్రోణాచార్యుని ధాటికి పాండవసేవ నిలువలేకున్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల భయమును తెలుసుకున్నాడు. రథము వారి దగ్గరకు తెచ్చినాడు. నలుగురు వినుచుండగా అన్నాడు.
        "అనిమొన దేవాదానవులకైనను గెల్వ నశక్యమిమ్మహా
        త్ముని నొకమందుసెప్పెద సుతున్ హతుడయ్యెననంగ విన్నయం
        తన యితడాయుధంబు దిగద్రావి యచేష్టత బొందునప్పుడీ
        తని బరిమార్చవచ్చు నిదితప్పను పాయము గల్గ దెమ్మెయిన్"

    కావున అశ్వత్ధామ చచ్చెనని యొక్కరుండ తనికి జెప్పుట కర్ణంబనిన విని యచ్చటి యందరు నదియే మేలని రర్జునుండు దాని కొడంబడక యుండె బాండ వాగ్రజుండు విషాదంబుతో విచారించె దదనంతరంబ.
    భీముడు మాళవదేశపు రాజు ఇంద్రవర్మ ఏనుగు అశ్వత్ధామ, అనుదానిని చంపినాడు. ద్రోణుని దగ్గరకు వెళ్ళి అశ్వత్ధామ చచ్చినాడు అని చెప్పినాడు.
        "భీమసేన వచః శ్రుత్వా ద్రోణ స్తత్ పరమాప్రియమ్
        మనసా స్నగాత్రో - భూద్ యథా సైకత మమ్చసి"

    భీముడు చెప్పిన అత్యంత అప్రియము అయిన మాట విన్న ద్రోణుని మనసు నీరుపడిన ఇసుకవలె వికలమయినది.
    అశ్వత్ధామ తన పుత్రుడు, దివ్యాస్త్రసంపన్నుడు, చిరంజీవి యుద్దమున చచ్చెనా అని కుమిలినాడు. కాని ఆయుధము విడవలేదు.
    ధృష్టద్యుమ్నుని ఎదిరించినాడు. అతని మీద నానావిధ బాణములను కురిపించినాడు. పాంచాలపు 20,000 రథికులను, మత్స్యదేశపు 700 మంది రథికులను, 10,000 ఏనుగులను చంపినాడు. రాజులను గుంపులు గుంపులుగా హతమార్చసాగినాడు.
    అప్పుడు విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ఠ, అత్రి, వాలఖిల్య మహర్షులు ద్రోణునాకు కనిపించి
        "తఏనమబ్రువన్ సర్వ్ ద్రోణమాహవ శోభినమ్
        అధర్మతః కృతం యుద్ధం సమయో నిధనస్యతే
        న్యస్యాయుధంరణే ద్రోణ సమీక్షాస్మాన వస్థితాన్
        నాతః క్రూరతరం కర్మపునః కర్తు మిహార్హసి"

 Previous Page Next Page