అలితా ఎమ్. ఏ ప్యాసయి కాలీజీలో ఉద్యోగం చేస్తుంది. భర్త కూడా ఏమ్. ఏ అదే కాలేజీలో ఉద్యోగం. లలిత సందేహిస్తూ వచ్చి , విషయం సూటిగానే ఎత్తుకుంది.
"నేను ఉద్యోగినన్న మాట నిజం! వారూ నేనూ ఒకలాగే చదువుకున్నాం ఒకే ఉద్యోగం చేస్తున్నాం. ఒక లాగే సంపాదిస్తున్నాం. అయితే ఆ సమానత్వం అంతా వీధిలో ఉన్నంతవరకే! ఇంటిలో కడుగు పెట్టగానే , మళ్ళీ మేం యిద్దరం మామూలు అందరి స్త్రీ పురుషుల్లాగే భార్యాభర్తలమన్న సంగతి వారెన్నడూ మరిచిపోలేదు. నన్ను మరచిపోనీయలేదు! ఉద్యోగాలు సమానంగా చేస్తున్నాం కాబట్టి, రోజూ ఓ పూట మీరు, ఒకపూట నేను వండుదాం.... ఇంట్లో పని ఇద్దరం సమానంగా చేసుకుందాం అంటే ఊరుకుంటారా? ఇక్కడే తేలిపోతుంది. అడ మగా సమానత్వం యెంత వరకు నిజమో! పోనీ , అదలా వుంచి మనం సంపాదించినది వాళ్ళకి చెప్పని, తెలియని ఖర్చులు పెట్టడాని కైనా లేదే? వాళ్ళు మనకి అన్నీ చెప్పే చేస్తున్నారా? ఇవన్నీ మాములుగా అందరికీ జరిగేవి. ఇంకా కొన్ని కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. ఒకోచోట! ఆఫీసులో కనపడ్డ ప్రతీ ఆడదానితో నవ్వుతూ మాట్లాడడం, సరసాలాడ్దాం, సంస్కారమనీ, నాగరికమనీ భావించే మగవాడు , భార్య ఆఫీసులో తోటి ఉద్యోగులతో నవ్వుతూ మాట్లాడినా, కలిసి ఎక్కడకన్నా వెళ్ళినా రకరకాల అపోహలు పడిపోతాడు! కాబట్టి అతడికి జడిసి యీమె మాటలు రాని మూగదానిలా , నవ్వడం తెలియని దానిలా , బుద్దిగా తలవంచుకు పని చేసుకుని, టైముకి తల వంచుకుని యింటికి చేరాలి! ఇంటికి ఓ అరగంట ఆలస్యంగా వస్తే అదీ గొడవే!"....
"మొన్న ఏమయిందో తెలుసా! ఆఫీసులో పనెక్కువవుండి రోజుకన్నా ఓ గంట ఆలస్యంగా యింటికి వెళ్ళాను. దొరగారికి ఆఫీసు నించి రాగానే వేళకి కాఫీ అందలేదని చిందులు! ఎక్కడ కెళ్ళావు? ఇంతసేపు ఏం చేస్తున్నావు? వేళకి రావాలని తెలీదు అంటూ ప్రశ్నలు , ఏం, కాఫీ కలుపుకుని తను తాగి, నాకోసం ప్లాస్కులో ఒకపూట అయినా ఉంచితే మగతనానికి ముప్పు గాబోలు! ఆఫీసులో టైపిస్టు ఉద్యోగం చేస్తున్న సత్యవతి ప్రక్కనున్న సహోద్యోగిని మేరీతో అంటుంది.
"మనం వూరుకుంటే సరి! గట్టిగా జవాబీయలేక పోయావా?" మేరీ ప్రశ్న.
"నోరున్నవాళ్ళదే రాజ్యం! మనం ఏం అంటే చెల్లు తుంది! ఏమన్నా అంటే నిన్ను పెళ్ళాడ్డం ఒక తప్పు. ఉద్యోగం చేయించడం ఒక తప్పు అని నేను కాస్త చికాకులో జవాబిచ్చానని యింకో నాలుగని అలిగి యింట్లోంచి లేచి వెళ్ళిపోయారు? ఏమిటో మన జన్మ యింతే!" నిస్పృహగా అంది సత్యవతి.
"అంతలా మనం నిరాశపడి నీరసంగా వుండిపోవడం చేతే అబలలని ముద్దు పేరు పెట్టి అధికారం చేలాయిస్తున్నారు మగవాళ్ళు! అందుకే మనం ఐకమత్యం గా కూడబలుక్కుని , యీ నిరంకుశత్వం యింక సాగదని యింటింటా విప్లవం లేవదీసి , సమాన హక్కులు పొందాలి!' లలిత ముగించింది.
"ఇంకెవరన్నా మాట్లాడుతారా?" శారదాదేవి అందర్నీ అడిగింది.
"ఇంకేముంది మాట్లాడడానికి! ఎవరు మాట్లాడినా ఇదేగా!"
"వాళ్ళు మనల్ని ఉద్దరించనూ వద్దూ, పాడూ వద్దూ . వేళకి వచ్చి తిని పడుకుని సాధింపులు, తిట్లు లేకుండా సక్రమంగా వ్యవహరిస్తే అంతే చాలు! ఆడదాని కష్టం, సుఖం మంచి చెడ్డా ఆలోచిస్తే అదే చాలు." సుందరమ్మ అంది.
"వాళ్ళలాగా మనమూ పిల్లల్ని వాళ్ళ మొహాన పడేసి అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే వూరుకుంటారా?"
"ఈ అత్యాచారాన్ని అరికట్టాలి!"
సభలో కలకలం మొదలైంది.
"ఇంకెవరన్నా మాట్లాడుతారా అంటే అందరూ మాట్లాడాలని నా ఉద్దేశం గాదు. ఆగండి .....ఆగండి! ఒకరి తరువాత ఒకరు."
ఈలోపల మితభాషిణి ముందుకు వచ్చింది. మితభాషిణిఅన్న పేరు ఆమె స్వభావాన్నిబట్టి నలుగురూ ఆమెకి ఇచ్చిన ముద్దుపేరు.
"సోదరీమణులారా!
మన స్త్రీలకి పురుషులు ఏమాత్రం సమానత్వం యిస్తున్నారో, ఏమాత్రం గౌరవం ఇస్తున్నారో చెప్పడానికి ఇన్ని మాటలు అక్కరలేదు. ఒక్క ఉదాహరణ చాలు! ఒక వంటవాడు వున్నాడంటే ఊరందరికీ వండుతాడు గాని, చస్తే ఒక పూటన్నా పెళ్ళానికి వండి పెట్టడు! దీన్ని బట్టే ఊహించవచ్చు. భారతదేశంలో స్త్రీ స్థానం యెక్కడో!"
చాలా మితంగా మాట్లాడి పేరు నిలబెట్టుకున్నందుకు నలుగురూ నవ్వారు. తరువాత 'లాజికేశ్వరి ' లేచి , తను యూనివర్సిటీలో పఠించిన లాజిక్ పరిజ్ఞానంతో సభికురాండ్రను తబ్బిబ్బు చేసింది.
"అక్కయ్యలూ, చెల్లాయిలూ,
అసలు నన్నడిగితే భగవంతుడు మోగాడే కాబట్టి సృష్టి లోనే మనకి అన్యాయం చేశాడంటాను..... సరే పిల్లల్ని కనడం మనకెలాగూ తప్పదు. ఆ పిల్లల్ని పెంచడం ఆ బాధలు , ఆ కష్టాలు అన్నీ మనం ఒక్కరమే ఎందుకు పడాలి? అర్ధరాత్రి నిద్రలేచి ఏడ్చే పిల్లను ఆడదే యెందుకు సముదాయించాలి! మగాడు ఏం పట్టనట్లు పడుకోడం, లేచినా విసుక్కోవడం తప్ప యింకేం చెయ్యకుండా ఎందుకుండాలి! మనమే ఉద్యోగం చేసి వాళ్ళే ఇంట్లో ఎందుకు పడుండకూడదు? వాళ్ళ షేవింగ్ సెట్లు కడగాలి! నీళ్ళు, కాఫీలు అందించాలి. బట్టలుతకాలి, బొత్తాలు కుట్టాలి, యిస్త్రీ చెయ్యాలి మనం. అలాగ వాళ్ళు మన జాకెట్లు యిస్త్రీ ఎందుకు చెయ్యరు? మన చీరలు యెందుకు వుతకరు? కాఫీలు నీళ్ళు ఎందుకు అందీయకూడదు? అసలు భర్తని భార్య మీరు అని మన్నించి సంభోదిస్తుంది. గాని, భార్యని ఏకవచనంతో పిలుస్తాడెం మగవాడు? వీటన్నింటికి జవాబేమిటి? జవాబు తెలియని మనం దద్దమ్మల్లా సరిపెట్టుకుని ఊరుకోబట్టే యింత దాకా వచ్చింది. ఇహ ముందేనా మనం కళ్ళు తెరవడం చాలా అవసరం. కళ్ళు తెరచి , ఎంతటి హీన స్థితిలో ఉన్నామో తెలుసుకుని, తను నిజంగా ఆటబొమ్మ కాదని, తనకీ మగాడితో సమానంగా గౌరవాధికారాలు ముట్టాలని పోరాడాల్సిన అవసరం ఎంతయినా వుంది." సభలో కరతాళధ్వనులు ముగిశాక నలుగురి వంక చూసి , ఇంకెవరూ మాట్లాడేవారు లేదని గ్రహించి శారదాదేవి లేచి నిలబడి -------