జనకుడు చాలా సంతోషించాడు. "ప్రాణం కన్న మిన్నగా పెంచాను సీతను. ఆమెను రామునికిచ్చి పెళ్లి చేస్తా" నన్నాడు.
సత్వరంగా ఈ వార్త అయోధ్యకు తెలియపరిచారు. "రాముడు శివధనుస్సు విరిచాడు." ఈ వార్త విన్నాడు దశరథుడు. పొంగిపోయాడు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయినాడు. వెంటనే మిధిలానగరానికి పయనం అయినాడు. సపరివారంగా మిధిలకు చేరాడు. జనకుడు వారిని తగు రీతిగా సత్కరించాడు. ఉభయ పక్షాల వారు కలుసుకున్నారు. ఆనందించారు. ఆ రాత్రి వారు ఆనందంగా గడిపారు.
జనకుడు అంకురార్పణ యజ్ఞం ముగించుకున్నాడు - ఆ రాత్రి.
తెల్లవారింది. జనకుని తమ్ముడు కుశధ్వజుడు వచ్చాడు. దశరథుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. జనకుడు వారికి గొప్ప వీడ్కోలు ఇచ్చాడు. అతడు వరులకు అనేక వస్త్రాలు, రధాలు, దాస దాసీజనం, రత్నరాసులు బంగారం అరణంగా ఇచ్చాడు.
ఇద్దరు రాములు:
జనకుడు దశరథుణ్ణి సాగనంపాడు. దశరథుడు అయోధ్యకు ప్రయాణం సాగించాడు. వారు శీఘ్రముగా పయనించారు. అలా కొంతదూరం పయనించగా వారికొక గాలిదుమారం కనిపించింది. భూమి వణికింది. చెట్లు కూలిపోయాయి. సూర్యుని కళ తప్పింది. చెట్లు చీకట్లు క్రమ్మాయి. సేన సొంతం దుమ్ముధూళితో నిండిపోయింది.
దశరథుడు ఆశ్చర్యపడ్డాడు. దీనికి కారణం ఏమిటని చూడసాగాడు. అతనికొక మహాపుఋషుడు కనిపించాడు. అతడు కైలాసంలో దుర్జయుడు. కాళాగ్నిలా దుస్సహుడు. ఒక చేతిలో చాపం వుంది. భుజాన గండ్రగొడ్డలి వుంది. అతడు త్రిపురాసురులను సంహరించిన మహేశ్వరునిలా వున్నాడు. అతడు 21 సార్లు భూమి సాంతం తిరిగి క్షత్రియులను ఏరిఏరి నరికిన మహావీరుడు. అతని పేరు పరశురాముడు.
అతన్ని చూచి దశరథుని ప్రాణం పైపైనే పోయింది. వశిష్ఠుడు, మున్నగు మహార్షులు అతన్ని శాంతింప జేయదలిచారు. ఎదురేగారు. పూజించారు. పరశురాముడు వారి పూజలందుకున్నాడు. దావాగ్నిలా ముందుకు కదిలాడు. రాముని దగ్గరకు వచ్చాడు. ఉరిమాడు. "నువ్వేనా రాముడివి? శివధనుస్సును విరిచావని విన్నాను. నేను భార్గవరాముణ్ణి, నా ధనువు చూడు. ఇది జామదగ్నీయము, దీనిని ఎక్కుపెట్టు, నీ బలం చూపు. నీతో ద్వంద యుద్ధం చేయడానికే వచ్చాను."
దశరథుడు ఆ మాటలు విన్నాడు. పెనుగాలికి ఎండుటాకులా వణికిపోయాడు. తన కొడుకులను రక్షించమన్నాడు. దోసిలొగ్గి ప్రార్థించాడు.
పరశురాముడు దశరథుని మాటలు వినిపించుకోనేలేదు. అతడు రామునితో యిలా అన్నాడు.
"దశరథరామా! విను. పూర్వం విశ్వకర్మ రెండు ధనస్సులు సృష్టించాడు. ఒకసారి దేవతలందరు బ్రహ్మ దగ్గరికి వెళ్లాడు. శివకేశవుల్లో ఎవరు అధికులు అని అడిగారు. బ్రహ్మ శివకేశవులకు యుద్ధం కల్పించాడు. అప్పుడు విశ్వకర్మ సృష్టించిన ధనువులను చెరొకటి తీసుకున్నారు. శివుడు కేశవుడు యుద్ధం చేశారు. యుద్ధం ఘోరంగా జరిగింది. యుద్ధంలో విష్ణువు హుంకరించాడు. శివుడు, శివధనస్సు స్తంభించి పొయ్యారు. దేవతలు వారిని ప్రార్థించాడు. శాంతింపజేశారు. దేవతలు విష్ణువునే గొప్పవాడనుకున్నారు. శివునికి కోపం వచ్చింది. తన ధనస్సును దేవరాతుని కిచ్చాడు. అదే నేనిప్పుడు త్రుంచిన ధనస్సు. ఇప్పుడు నా దగ్గరున్న ధనస్సు విష్ణుమూర్తి రుచీకున కిచ్చింది. రుచీకుడు నాతండ్రి జమదగ్ని కిచ్చాడు. నాతండ్రి అస్త్రసన్యాసం చేశాడు. అతడు తపస్సు చేసుకుంటున్నప్పుడు కార్తవీర్యర్జునుడు అతణ్ణి చంపేశాడు. నాకు కోపం వచ్చింది. భూమండలమంతా అనేకసార్లు తిరిగి క్షత్రియులను నాశనం చేశాను. భూమండలం సాంతం జయించాను. దాన్ని కాశ్యపునికి దానం చేశాను. మహేంద్ర పర్వతం మీదికి వెళ్లిపోయాను. అక్కడ తపస్సు చేసుకుంటున్నాను. అక్కడ వుండగా నీవు శివధనుర్భాగం చేశావని విన్నాను. వచ్చేశాను. ఇదిగో ఇది విష్ణుధనువు. దీన్ని ఎక్కుబెట్టి బాణం సంధించగల్గితే నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను."
అప్పుడు రాముడు పరశురామణ్ణి చూశాడు. "భార్గవరామా! నేను క్షత్రియ ధర్మాన్ననుసరించి వున్నాను. అందువల్ల అశక్తుణ్ణి అనుకుంటున్నావు. ఇప్పుడు నా పరాక్రమం చూపిస్తా. చూడు- నాతేజస్సు" అని ధనుర్బాణములందుకున్నాడు రాముడు. బాణం సంధించాడు. ఇలా అన్నాడు. "పరశురామా! నీవు బ్రాహ్మణుడివి. అందునా విశ్వామిత్రుడి బంధువువి. కాన నీవు నాకు పూజనీయుడివి. ఈ బాణంతో నీ ప్రాణం తీయలేను. కాబట్టి నీ పాదగతి, నీవు తపస్సువల్ల ఆర్జించిన లోకాలు ఈ రెంటిలో ఏదో ఒకటి నాశనం చేస్తాను." అన్నాడు.
అందుకు పరశురాముడు నేను భూమినంతా కాశ్యపుని కిచ్చేశాను. అతడు నన్ను భూమిపైన వుండరాదని నిషేధించాడు. నేను అలాగే వ్యవహరిస్తున్నాను. కాబట్టి నా తపస్సువలన ఆర్జించిన లోకాలను కొట్టేయ్ - ఈ ధనువును ఆరోపించిన నీవు నాశరహితుడవు. సర్వేశ్వరుడవు. విష్ణుదేవునివని తెలుసుకున్నాను. నీవు శత్రుంజయుడవు. నీకు శుభమగుగాక అన్నాడు.
అందరు చూస్తుండగానే రాముని బాణం పరశురాముడు సంపాదించిన పరలోకాలను కొట్టివేసింది. భార్గవరాముడు మహేంద్రగిరికి వెళ్లిపోయాడు. రాముడు విష్ణు ధనుర్భాణాలను వరుణునికిచ్చివేశాడు. వారు అయోధ్య బయలుదేరారు. అయోధ్య చేరేవరకు ఆ నగరం అమరపురిలా అలంకరించబడింది. వీధుల్లో పూలు చల్లబడ్డాయి. రాముడు మున్నగువారు తమ వధువులతో రాజప్రసాదంలో ప్రవేశించారు. కౌసల్యాదులు కోడళ్లను లోనికి తీసికెళ్లారు. రామ లక్ష్మణ భరత శత్రుష్ములు పెద్దలందరికి అనేక వందనములు చేశారు. అనేక దానధర్మాలు చేశారు. తదుపరి తమతమ భార్యలతో తమతమ గృహాలలోకి వెళ్లారు. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు కైకేయ రాజపుత్రుడు అయోధ్యకు వచ్చాడు. తన మేనల్లుడు భరతుణ్ణి పంపవలసిందని దశరథుణ్ణి కోరాడు. దశరథుడు అందుకు అంగీకరించాడు. భరతుడు, శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి వెళ్లిపోయాడు.
శివ ధనుర్భంగం సందర్భంలో రాజులంతా రావడం, రావణుడు అక్కడికి రావడం, ధనుస్సు ఎత్తలేక పడిపోవడంలాంటివేవీ బాలకాండలో లేవు.
పరశురాముని పరాభవం విషయంలో కూడా బ్రాహ్మణ క్షత్రియవైరం స్పష్టంగా కనిపిస్తుంది. పరశురాముణ్ణి రాముడు వదలివేయడానికి కారణం అతడు బ్రాహ్మడు కాబట్టి మాత్రమేకాదు. "విశ్వామిత్ర కృతేనచ" విశ్వామిత్రునితో ఉన్న బాంధవ్యం వల్ల.
ఈ రెండు వర్గాల వైరాలకు సంబంధించిన కథలే ఉన్నాయి బాలకాండనిండా. ఈ కాండ అందుకోసమే రాయబడిందా? అనిపిస్తుంది. అసలు ఈ కాండ రాసినవాడు క్షత్రియుడేమో అనుమానంకూడా కలుగుతుంది.
ఈ కాండ రచయిత విశ్వామిత్రుడు కాదుగదా!