Previous Page Next Page 
నయనతార పేజి 28

 

    కాని ఆవేశం వల్ల సాధించేదేం లేదు! ఈ మగవాళ్ళకి పాఠం చెప్పడాని కన్నా , మనం ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన హక్కుల కోసం పోరాడి, మాటల్లో కాక చేతల్లో మన ప్రయోజకత్వం నిరూపించాలి. ఈ పోరాటం ఎక్కడో బయట సంఘంలో , లోక్ సభలో జరగాల్సింది కాదు. కాగితాల మీద ఇచ్చే హక్కులు కాదు మనకి కావాల్సింది! అక్కడ స్త్రీ ఎలాగో నెగ్గుకొస్తుంది. కాని మన యిళ్ళల్లో యింకా వెనకబడే వున్న సంసారాల్లో మనం ఈ పోరాటం సాగించి మగాడు అంటి పెట్టుకుని కూర్చున్న గద్దె నించి క్రిందికి దింపి, అయ్యా, మీరు నేనూ ఒకటే అన్నప్పుడు, ఇద్దరం ఒకలాగా వుండడం చాలా అవసరం" అని చెప్దాం. యీ మహిళా మండళ్ళు ఉత్తినే చచ్చు కబుర్లు చెప్పుకునేందుకు సినిమాలు, సర్కస్ లు వదిలినప్పుడులాగ గలాటా చేసేందుకు కావని నిరూపిద్దాం ----- కనీసం మన ఇళ్ళలో మగవాళ్ళకి! యింట గెలిచి రచ్చ గెలవమన్న సామెత చెప్పినట్టు మనం యింట్లో అడుగున పడుంటూ బయట ఏదో సాధించామని , ఆడవాళ్ళు ప్రధానమంత్రులు, రాయబారులు , గవర్నరులు అవుతున్నారని భుజాలు తట్టుకుంటే ఒరిగేదేం లేదు! ఎవరింట్లో వాళ్ళు ఈ పోరాటం సాగించి గెలిస్తే అదే మొట్ట, 'స్త్రీ జనోద్దరణ' అవుతుంది.
    "అంచేత ఇక మాట్లాడేవారు తమ ప్రసంగాలని ఇంటి, యింటింటి సమస్యకే పరిమితం చెయ్యాలని కోరుతున్నాను. ఎవరి అనుభవాలు వారు చెప్పండి. ఎవరి పరిష్కార మార్గాలు వారు ప్రతిపాదించండి. అందరికి నచ్చిన పద్దతి అవలంబిద్దాం. ముందు ,మన అధ్యక్షురాలు రాణి విమలా దేవిని మాట్లాడమని ఆహ్వానిస్తున్నాను." కార్యదర్శిని శారదాదేవి అసలు విషయం సభ ముందు వుంచింది.
    రాణీ విమలా దేవి మాజీ రాచరికపు హుండాతో యాభై ఏళ్ళ బరువుతో లేచి గంభీరంగా ఆరంభించింది.
    "సోదరీమణులారా!
    అనాది నించి యుగయుగాలుగా, తరతరాలుగా స్త్రీ జాతి పురుషుడు అల్లిన సాలె గూడులో ఇరుక్కుని రకరకాల ఇక్కట్లు పడ్తూనే వుంది. అందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అలనాటి సీత, సావిత్రి, ద్రౌపతి, దమయంతి, మొదలు యీనాటి యిరవై శతాబ్దపు ఉత్తరార్ధం వరకు! దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఏం కనపడుతుంది ? చాలా శోచనీయమైన హృదయ విదారకమయిన దుస్థితి. మనలో వ్యక్తిత్వాన్నే చంపి, మూడనమ్మకాల బెదరింపుల్తో మనలో రకరకాల దిక్కుమాలిన అభిప్రాయాలు పాతుకు పోయేలాగా చేశారు! అందుకోసం ఎన్ని ఉచ్చులు పన్నారు? ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఏవేవో కల్పించి  మనచుట్టూ మందంగా ఆకాశ మెత్తూ గోడలు వేసి , మనలో మనకే నమ్మకం లేకుండా చేసి, మన ఆత్మవిశ్వాసం మంట గలిపి బానిసలుగా నీచంగా, హీనంగా, ఉపయోగించుకున్నారు. శోచనీయమేమంటే , ఇంకా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఎంత చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, సంపాదిస్తున్నా, పార్లమెంటు సభ్యత్వం పొందినా, స్వంత ఇంట్లో స్త్రీ స్థానం మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్టుంది! ఆనాడు యీనాడు కూడా పురుషుని అదీనంలో, అతని అధికారానికి తల ఒగ్గి ఉండవలసి వస్తుంది? ఇలా ఎన్నాళ్ళు? యింకా ఎన్నో తరాలు యిలా వాళ్ళ జులుం సాగాల్సిందేనా? యివే మనల్ని ఎదుర్కొంటున్న ప్రశ్నలు? అయితే ఈ విషయాల గురించి మాట్లాడాల్సింది మీరు? యువతులు! నా తరం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న మేం ఏం మాట్లాడినా సహజంగా వుండదు. కాబట్టి మీలో యువతులు ముందుకు వచ్చి మీకు తోచిన మాటలు చెప్పమని కోరుతూ యింతటితో విరమిస్తున్నాను."
    సభలో కరతాళ ధ్వనులు . అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
    "మీరు మాట్లాడండి సులోచన గారూ!" పద్మావతి అంది.
    "నేనా? హటాత్తుగా మాట్లాడమంటే ఏం మాట్లాడుతాను? ప్రిపేరు కాకుండా?"
    "యిందులో ప్రిపేరు కావడానికి ఏముంది? ఇంట్లో అనుభావాలేగా చెప్పమంతున్నది! యిడెం డిబెటా , ఎన్నికల ప్రచారమా? ప్రైజులియ్యబోతున్నారా? ఏమన్నానా? ఏదో మనలో మనం కష్టం సుఖం చెప్పుకుంటున్నాం గాని!" మాలతీ వెంకట్రావు అంది.
    "అవును, సులోచానగారు మాట్లాడాల్సిందే !" నాలుగైదు కంఠములు ప్రోత్సహించాయి.
    సులోచన తప్పదన్నట్టు లేచింది. ముప్పై ఏళ్ళ మనిషి. గ్రాడ్యూయెటు . సాధారణంగా యెక్కడ ఏ విందులు, వినోదాలు, సభలు, సమావేశాలు జరిగినా ముందు వరుసలో కనిపిస్తూంటుంది. అన్నింట్లో కుతూహలం కనబరుస్తూ చలాకీగా తిరుగుతూ చుట్టూ వున్న వాళ్ళని, చుట్టూ తిప్పుతూ వుంటుంది.
    "మహిళలారా!
    ఈనాడు సంఘంలో స్త్రీ వేషం మారింది గాని స్థానం మారలేదని ఘంటాపధంగా చెప్పగలను. ఆ మధ్య ఓ రచయిత్రి అన్నట్టు " ఆడదాని అభ్యుదయం చేతికి వాచీ కట్టుకుని, మొగుడితో సినిమాకి వెళ్ళేవరకు వచ్చింది! ఆ మాట అక్షరాల నిజం! అంతే! ఆ మీదట శతాబ్దాల క్రిందటి స్త్రీకి మనకి పెద్ద తేడా ఏం కనపడ్డం లేదు నాకు! ఆ రోజుల్లోనే ఇంకా కాస్త గౌరవం ఉండేదేమో ఇప్పటి కన్నా! ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా ఇంటిలో మగాడి చెప్పు చేతల్లో ఉండక తప్పదు! పెళ్ళికాక ముందు తండ్రి, పెళ్ళయ్యాక భర్త, ముసలితనంలో కొడుకు .... ఈ విధంగా ఆడదాని బ్రతుకంతా పురుషుడి అధికారంలో వుండక తప్పడం లేదు. ఇంటిలో మగాడికి ఇష్టం లేకుండా బయటికీ రాకూడదు! బయటికి వచ్చినా వాళ్ళలా మనం ఇష్టం వచ్చినట్టు తిరిగి రావడానికి వీలా? ఇది సూక్ష్మంగా పరిశీలిస్తే చాలు అర్ధమవుతుంది. మనకి దొరికిన స్వేచ్చా స్వాతంత్ర్యాలు యే మాత్రమో!...."

 Previous Page Next Page