Previous Page Next Page 
సీతాచరితం పేజి 26


    హిమవంతునికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు గంగ. చిన్న కూతురు ఉమ. దేవతలు హిమవంతుని దగ్గరకు వచ్చారు. గంగను తమకు ఇమ్మన్నారు. ప్రార్థించారు. హిమవంతుడు అంగీకరించలేదు. గంగ స్వర్గానికి వెళ్లిపోయింది. అక్కడ ప్రవహించింది.


    పూర్వం సగరుడు అయోధ్యను పాలించాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కౌశిని, చిన్న భార్య సుమతి. వారిద్దరికీ సంతానం కలగలేదు. సగరుడు తపస్సు చేశాడు. భృగుమహర్షి ప్రత్యక్షం అయినాడు. ఒక భార్యకు ఒక కొడుకూ, ఇంకో భార్యకు అరవై వేలమంది కొడుకులూ వరం ఇచ్చాడు. కేశిని ఒక్క కొడుకును కోరుకుంది. ఆమెకు అసమంజసుడు పుట్టాడు. సుమతికి అనేకమంది పుట్టారుత.


    అసమంజుడు క్రూరుడు. అతడు సుమతి కొడుకులను నానా బాధలు పెట్టాడు. వాళ్లను సరయూనదిలో ముంచేవాడు. అంతేకాదు, సజ్జనులను బాధలు పెట్టేవాడు. సగరుడు అసమంజసుణ్ణి రాజ్యంనుంచి వెళ్లగొట్టాడు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. బుద్ధిమంతుడు, పరాక్రమశాలి.


    సగరుడు అశ్వమేధం చేయాలనుకున్నాడు. గుర్రాన్ని వదిలాడు. దానివెంట హిమవంతుణ్ణి పంపాడు. ఇంద్రుడు దొంగలా వచ్చాడు. గుర్రాన్ని దొంగిలించాడు. ఆ గుర్రం లేంది యజ్ఞం సాగదన్నారు రుత్విక్కులు.


    సగరుడు ఆలోచించాడు. గుర్రాన్ని వెదకడానికి అరవైవేల మంది కొడుకుల్ను పంపాడు. భూమండలం సాంతం గాలించమన్నాడు. ఎక్కడా దొరక్కుంటే పాతాళానికి వెళ్లమన్నాడు.


    సగరుని కొడుకులు సాగరులు. వారు భూమినంతా గాలించారు. గుర్రం కనిపించలేదు. అప్పుడు వారు  భూమిని త్రవ్వారు. ఒక్కొక్కరు ఒక యోజనం చొప్పున తవ్వారు. పాతాళానికి చేరారు. ఎంత వెదికినా గుర్రం కనిపించలేదు. అంతలో వారికి కపిలుడు కనిపించాడు. వారి వెనుక గుర్రం కనిపించింది. వారు కపిలుణ్ణే దొంగ అనుకున్నారు. కేకలు వేశారు. కొట్టబోయారు. కపిలుడు కళ్లు తెరిచాడు. హుంకరించాడు. సాగరులు భస్మం అయినారు.


    సాగరులు గుర్రాన్ని తేలేదు. సగరుడు అంశుమంతుణ్ణి పంపాడు. అతడు పాతాళానికి వెళ్లాడు. అక్కడ భస్మరాసులు కనిపించాయి. అతనికి ఏమి అర్థం కాలేదు. అక్కడ గరుత్మంతుడు కనిపించాడు. అతడు ఆ భస్మరాసులను గురించి చెప్పాడు. పినతండ్రులను తలచుకున్నాడు. అంశుమంతుడు చాల దుఃఖించాడు. వారికి తీర్ధాలు విడుద్దాం అనుకున్నాడు. అతనికి నీరు కనిపించలేదు. వారికి గంగాజలంతో తర్పణం ఇవ్వాల్సిందని సలహా ఇచ్చాడు గరుత్మంతుడు. అంశుమంతునికి ఏమీ తోచలేదు.  కపిలదేవుణ్ణి ప్రార్ధించి గుర్రాన్ని తీసుకున్నాడు. అయోధ్యకు వచ్చాడు. జరిగినదంతా తాతకు చెప్పాడు. సగరుడు చాల దుఃఖించాడు. దుఃఖంతోనే యజ్ఞం పూర్తి చేశాడు.


    సగరుడు కొడుకులకు తర్పణం ఇవ్వకుండానే చనిపోయాడు. అంశుమంతుడు రాజయినాడు. అతడూ తర్పణం విడువడానికి ప్రయత్నించాడు. ఫలించలేదు. అతని తరువాత దిలీపుడు రాజయినాడు. దిలీపుడు తరువాత భగీరథుడు రాజయినాడు.


    భగీరథుడు గంగను తేవడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటికి అతనికి సంతానం కూడా లేదు. అతడు గోకర్ణ క్షేత్రానికి వెళ్లాడు. తపస్సు ప్రారంభించాడు. వేయేండ్లు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్ష్యం అయినాడు. తనకు సంతానం కలగాలనీ, గంగ దివినుండి భువికి దిగాలనీ కోరాడు. బ్రహ్మ రెండు వరాలూ ఇచ్చాడు. కాని ఒక షరతు పెట్టాడు. గంగ ఆకాశం నుండి నేలకు దిగుతే భూమి భరించలేదు. దానిని భరించగలవాడు శంకరుడు మాత్రమే. శంకరుని గూర్చి తపస్సు చేయవలసిందని చెప్పాడు. బ్రహ్మ తనదారిన వెళ్లిపోయాడు.


    భగీరథుడు శివునిగూర్చి తపస్సు ప్రారంభించాడు. అలా ఒక సంవత్సరం సాగించాడు. శివుడు ప్రత్యక్ష్యం అయినాడు. గంగను భరిస్తానన్నాడు. గంగ అతివేగంగా ఆకాశం నుంచి దిగి వచ్చింది. శివును జటాజూటంలో చేరింది. ఆవేశంతో శివుణ్ణి కూడా తీసుకుని పాతాళానికి దిగిపోదామనుకుంది. శివుడు గ్రహించాడు. కోపించాడు. గంగ వేగాన్ని నిరోధించదలచాడు. తన జడల్లోనే బంధించాడు.


    భగీరథుడు చూస్తున్నాడు, గంగ దిగిరావడం లేదు. మళ్లీ తపస్సు ప్రారంభించాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చాడు. గంగను ఒక సరస్సులో వదిలాడు. గంగ శిరస్సునుండి బయలుదేరింది. ఏడుపాయలై బయల్దేరింది. హ్లాదిని, పావని, నళిని అనేవి తూర్పుగా ప్రవహించాయి. సుచక్షువ, సీత, మహానది, పడమటికి ప్రవహించాయి. ఏడోది గంగ భగీరథుని వెంట బయల్దేరింది.


    భగీరథుడు రథం ఎక్కి ముందుసాగాడు. వెనుక గంగ బయల్దేరింది. గంగ పల్లంలోపడి రాసాగింది. మిట్టపల్లాల్లో వంకరగా పారింది. చదను నేలలో పొడవుగా ప్రవహించింది. రాళ్లు తగిలినపుడు ఎత్తుగా ఎగిసింది. ముందు శివుని శిరమున, తదుపరి భూమిమీద పడిన గంగాజలము నిర్మలమై, పావనమై ప్రవహించింది.


    అలా సాగిపోతున్న గంగమ్మ జహ్ను మహర్షి యజ్ఞశాలను ముంచేసింది. ఆ మహర్షికి కోపం వచ్చింది. గంగను తాగేశాడు. దేవతలు, గంధర్వులు ఆ మహర్షిని పూజించారు. గంగను అతనికి కూతురుగా చేశారు. మహర్షి సంతోషించాడు. గంగను మహర్షి తన చెవిలోంచి విడిచాడు. అందుకే గంగను 'జాహ్నవి' అనే పేరు వచ్చింది.


    అలా బయలుదేరిన గంగానది సముద్రం ద్వారా పాతాళానికి చేరింది. సగర పుత్రుల భస్మరాసులను తడిపింది. గంగాజలం తాకగానే అరవై వేలమంది సాగరులు దేవతలయినారు. స్వర్గానికి వెళ్లిపోయారు.


    మానవుడు ఆశాజీవి, ప్రగతిశీలి, పురోగామి. అతని త్వష్ణకు అంతులేదు. అతని పిపాసకు పరిధిలేదు. అతనికి తృప్తిలేదు.


    మానవుని తృష్ణనుంచీ, కృషినుంచే నాగరికతలు పుట్తున్నాయి. మారుతున్నాయి. పెరుగుతున్నాయి. పెరుగుతుంటాయి. ఈ అభివృద్ధికి అవధిలేదు. ఆకాశంలా అది అనంతం అయింది.


    నాగరికతలకు నెలవు వీరు. వీరు అందుబాటులో ఉండడాన్ని బట్టి నాగరికత స్థాయిని విలువకట్టవచ్చు. పూర్వపు మహానాగరికతలన్నీ నదీ తీరాల్లోనే వెలశాయి. నైలునది నాగరికత, సింథునది నాగరికత మొదలయినవి వాటిల్లో కొన్ని.


    నాగరికత పెరుగుతున్నదీ అంటే నీటి అవసరం ఎక్కువ అవుతూందని అర్థం. ఆటవిక నాగరికతలో నీరు త్రాగడానికి మాత్రం అవసరం అయింది. భూస్వామ్య నాగరికతలో నీరు వ్యవసాయానికీ అవసరం. యంత్రముగ నాగరికతలో వ్యవసాయానికేకాదు అనేకవాటికి నీరు కావాలి. విద్యుదుత్పాదనకు, పరిశ్రమల నిర్వహణకూ, మనిషి మనుగడకూ నీరు అవసరం.


    నీటిని జనానికి అందుబాటులోకి తేవడం ఒక విద్య. దోసెడు నీటితో తృప్తిచెందిన ఆదిమానవుడు వ్యవసాయం ప్రారంభించాడు. వర్షాధారమైన వ్యవసాయం సాగింది. పంటకు నిరంతరం నీరుండే ఉపాయాలను గురించి ఆలోచించాడు మానవుడు.


    అంశుమంతునికి బహుశా అలాంటి ఆలోచన మొదట వచ్చి ఉంటుంది. అంశుమంతుడు దాన్ని అమలుజరుపలేకపోయాడు. దిలీపునికి అందించాడు. దిలీపుడూ విఫలుడయినాడేమో! అంశుమంతుని ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి పూనుకున్నవాడు భగీరథుడు.

 Previous Page Next Page