Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 74


    ఆమె రచయిత్రి మాత్రమే కాదు; గొప్ప వక్తృత్వము గలదిగూడ. ఆమెలోని భావామేగ మామె నొక మహావక్తగాఁ జేసినది. ఆమె మధురకంఠమునెత్తి యుపన్యాస మారంభించెనా లక్షలాది సభ్యులు నోళ్ళు తెఱచుకొని వినెడివారు. మహాత్ములు గూడ దిగ్భ్రమ నొందెడివారు. ఆమె నడుమ నడుమ హాస్యరసమును విరజిమ్మి శ్రోతల హృదయములను రంజింపఁజేసెడిది. ఆమె యుపన్యాసములు వినుట కుత్సాహపడి ప్రజలు తండోపతండములుగా వచ్చెడివారు. బ్రహ్మాండములైన సభలలోనామె "ఆంగ్ల, వంగ, హిందీ, ఉర్దూ" భాషలలో ననర్గళముగ నుపన్యసించెడిది. ఆమె వాక్కు లాలకించి సభ్యులానందపరవశు లయ్యెడివారు.
    ఆమె మాటలు చల్లని పిల్లగాలులవలె, నమృత ప్రవాహము వలె వారి కెంతయో యుల్లాసము చేకూర్చెడివి. ఆమె ప్రపంచ మందలి మహావక్తలలో ప్రథమగణ్యురా లని ప్రసిద్ధిగాంచినది. అనర్గళ గంగాప్రవాహము ననుకరించు నామె మహోపన్యాసములు స్వాతంత్ర్యోద్యమములో భారతప్రజలను ప్రబోధించెను. ఆ వక్తృత్వశక్తియే భారతదేశ మెల్లెడ స్వరాజ్యోద్యమ ప్రచారము సఫల మగుటకు సహకారియైనది.
    సరోజినీదేవి భర్త ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఆమె యతనిని ప్రేమించి పెండ్లాడెను. ఆ దంపతుల కిరువురు పుత్రులును, నిరువురు పుత్రికలును జన్మించిరి. వారందరును విద్యావంతులే; విజ్ఞానవంతులే; తల్లి దండ్రులకు పేరుదెచ్చిన వివేకశాలురే.
    సరోజినీదేవి నిరాడంబర స్వభావము గలది. ఆమె హృదయమున గర్వమునకు స్థానము లేదు. కార్పణ్యమునకు తావు లేదు. ఆమెకు సౌజన్య సౌహార్దములు సహజ భూషణములు.
    ఆమె సరసము లగు సంభాషణములతో నెదుటివారి కుల్లాసముఁ గూర్పగలదు. ఆమె నిరంతర ముత్సాహవంతురాలై యుండెడిది. ఆమె యే కార్యమునైనను దీక్షగా నెరవేర్పగల సామర్థ్యము గలది. ఆమెలో స్త్రీజన సహజములైన శాంతి సహనములున్నవి. ఆమె సుందరస్వరూప మామె పద్యములవలెనే యాకర్షణీయముగా నుండెను, ఆమె జ్ఞాపకశక్తి యసమానమైనది. ఆదర్శమానవ ధర్మములైన ప్రేమ, కరుణ, సత్యము శాంతి యామెలో సమైక్యమైనవి. ఆమె పరిపూర్ణ వ్యక్తి.
    సరోజినీదేవి నిరుపమాన మగు దేశభక్తి గలది. భారతమాత పారతంత్ర్యముఁ బాపుటకై యామె స్వతంత్రసమరముతో దుమికినది. ఆమె 1905వ సంవత్సరమున భారత జాతీయ కాంగ్రెసులోఁ బ్రవేశించినది. తరువాత నిరువది సంవత్సరముల కామె యా మహాసంస్థ కధ్యక్షురాలైనది. ఆ మహాధ్యక్షపీఠము నుండి సరోజినీదేవి చేసిన గంభీరోపన్యాసము విని మహాత్ముడు ముక్కుపై వ్రేలుంచుకొనినాడు. ఆమెకు బాపూజీపై నధికభక్తి. బాపూజీ కామెపై నత్యంత వాత్సల్యము.
    సరోజినీదేవి చాలా సాహసవతి. ఒకప్పుడామె ఇంగ్లండులో నుపస్యసించుచు భారతీయుల నష్టకష్టముల పాలుజేసిన యాంగ్లేయులను తీవ్రముగ విమర్శించెను. అందుచే సభలో నలజడి బయలుదేరెను. సరోజినీదేవి భద్రకాళివలె గుడ్లెఱ్ఱజేసి "నోరు మూయుఁడు మూర్ఖులారా!" అని గర్జించెను. ఆంగ్లదేశమెల్ల యా గర్జనము విని గడగడలాడిపోయెను.
    సరోజినీదేవి మహాత్ముడు ప్రారంభించిన యుప్పుసత్యాగ్రహములో పాల్గొనినది. కారాగారవాస మనుభవించినది. నిరంతరము కృషిచేయుచు నామె స్వాతంత్ర్యోద్యమములో వీరోచితమగు పాత్ర నిర్వహించినది. ఆమె మహిళల యభ్యున్నతికి శక్తికొలది ప్రయత్నము చేసినది.
    ఆమె 1947వ సంవత్సరములో పురాణఖిల్లాలో జరిగిన "అఖిల ఆసియా మహాసభ" కధ్యక్షురాలై దానిని జయప్రద మొనర్చినది.
    భారతదేశము స్వతంత్రమైనది. స్వతంత్ర భారతములో సరోజినీదేవి సంయుక్తపరగణాలకు "గవర్నరు"గా నియమింపఁబడినది. ఆమె యచిరకాలముననే యా రాష్ట్రీయుల గౌరవాభిమానములనుఁ జూఱఁగొనినది.
    సరోజినీదేవి 1949వ సంవత్సరములో లక్నోలో తన జీవిత యాత్ర చాలించినది. ప్రపంచమెల్ల నా యాదర్శ మహిళామణికి బాష్పాంజలి సమర్పించినది.
    భారతమాత వీరమాత. ఆమె రత్నగర్భమున వీరులు, విజ్ఞానులు, వక్తలు, ప్రవక్తలు, కవులు, గాయకులు నెందఱెందరో జన్మించిరి. జగత్ ప్రసిద్ధి నందిరి. సముజ్జ్వల చరిత్రలు సృష్టించుకొని భారత నారీరత్నములు ప్రపంచమునకు నవ్యదీప్తులు ప్రసాదించిరి.
    సరోజినీదేవి భారత నారీశక్తిని పుణికి పుచ్చుకొని మహిళాభ్యుదయమే దేశాభ్యుదయమని చాటిచెప్పినది.


                                           * * * *

 Previous Page Next Page