Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 73


                        మహతి

                                సరోజినీ దేవి

    అది యొక విద్యావనము. ఆనాడు విద్యార్ధులందరు వికసిత వదనములతో విరాజిల్లుచుండిరి. పచ్చని మామిడాకు తోరణములు వచ్చిన యతిథులకు స్వాగత మిచ్చుచుండెను. ఎచ్చటఁ జూచినను సంతోషము పొంగి పొరలుచుండెను. ఏ మూలఁ గాంచినను నూతనోత్సాహము తాండవించు చుండెను.
    గురుదేవుఁడు శిష్యసముదాయముతోఁ గూడి యొక గొప్ప నాయకుని సమాగమనమునకై యచ్చట నిరీక్షించుచుండెను. ఇంతలో నొక మహాపురుషుడు సపరివారముగ విద్యావనము లోనికి విచ్చేసెను. ఆయన వెంట నొక కవయిత్రిగూడ నుండెను, నాయకుడు గురుదేవుడు కలిసికొనిరి.
    గురుదేవుఁ డా గొప్ప నాయకునకు నమస్కరించెను. నాయకుడు గురుదేనకుఁ బ్రణమిల్లెను. గురుదేవుడు చిరునవ్వు నవ్వెను. నాయకుడును నవ్వెను. గురుదేవుడు నాయకుని ప్రేమపురస్సరముగఁ గౌఁగలించుకొనెను. నాయకుడును గురుదేవుని గాఢాలింగన మొనర్చుకొనెను.
    ఆ ప్రియవయస్యు లిరువురు పరస్పరాశ్లేషములలోఁ గరఁగి మైమరచి పోయిరి. ఆ మనోహర దృశ్యమును గాంచి ప్రేక్షకులం ముఖపద్మములు ప్రఫుల్లములయ్యెను. అంతరంగములు ద్రవించెను. నయనాంచలముల నుండి ప్రమోద బాష్పములు స్రవించెను.
    కవయిత్రి కవితా తరంగిణి పొంగెను. ఆమె మందహాసముచేయుచు "సౌందర్యము సత్యమును కౌఁగలించుకొన్నది" అని పలికెను. ఆ సుందరమైన సుకవిసూక్తి నాలకించి యచ్చటివా రందఱు మేలు మేలని యానందముతో కరతాళధ్వనులు చేసిరి.
    ఆ విద్యావనము శాంతినికేతనము. ఆ గురుదేవుడు రవీంద్రుడు. నాయకుడు పూజ్య బాపూజీ. ఆ కవయిత్రియే మన సరోజినీదేవి.
    శ్రీమతి సరోజినీదేవి సుప్రసిద్ధ కవయిత్రి. సుగుణశీల. దేశసేవా పరాయణురాలు. సదయహృదయ. భారతవీరనారీ శిరోమణి.
    సరోజినీదేవి క్రీ.శ. 1879 ఫిబ్రవరి 13వ తేదీన వంగ దేశమున జన్మించినది. ఆమె జనకుడు అఘోరనాథ చటోపాధ్యాయుడు. ఆంగ్లము, సంస్కృతము, జర్మనీ, ఫ్రెంచి, గ్రీకు, మున్నగు నేడు భాషలలో నఖండ పాండిత్యము గలవాడు. సహృదయుడు. విజ్ఞానాచార్యుడు. ఉదారగుణ సంపన్నుడు. సత్యమూర్తి.
    సరోజిని జనని పేరు వరదసుందరీదేవి. ఆమె యుత్తమ గుణ సంపన్నురాలు. బెంగాలీ భాషలో మనోజ్ఞముగ గేయకవిత్వము వ్రాయగల ప్రతిభావంతురాలు.
    అట్టి యుత్తమ దంపతులకు జన్మించిన సరోజినీదేవి విశ్వవిశ్రుత యగుటలో వింత యేమున్నది?
    వారి వంశము సహజముగా సాహిత్య చైతన్యము గలది. ఉషఃకాంతులుదయమును జూపునట్లు బాల్యము జీవితభవిష్యత్తును జూపును.
    సరోజినీదేవి బాల్యముననే యాంగ్లభాషలోఁ గవిత్వము వ్రాయుట నేర్చుకొనినది. ఆమెకా కవిత్వము వ్రాయుశక్తి నెవ్వరును నేర్పలేదు. సంగీత సాహిత్యములు స్వభావసిద్ధముగనే యామెకు సంప్రాప్తించినవి.
    సరోజినీదేవి కాఱవయేఁట నాంగ్లమున నక్షరాభ్యాసము కావింపఁబడెను. ఆమె తండ్రిగారి కామె నాంగ్లేయభాషలో గొప్ప విద్వాంసురాలిని జేయ వలయునని కోరిక. జనకుని ప్రత్యేక శ్రద్ధవలన నాంగ్లభాషయును, విద్యావతి యగు మాతృదేవి సహకారమున వంగభాషయును సరోజినీదేవి సులభముగా నభ్యసింపఁగలిగెను. ఆమె పదునొకండవ యేఁటనే "మెట్రిక్యు లేషన్" పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యెను.
    సరోజినీదేవి యతి విచిత్రముగా కవిత్వము వ్రాయనారంభించినది. ఆమె తన చదువుల గదిలోఁ గూరుచుండి యొకనాఁడేవియో లెక్కలు చేయుచుండెను. ఎంత కష్టపడినను లెక్క సరిగా రాలేదు. కాని హఠాత్తుగా నామె కవితా హృదయము నుండి యొక పద్యము వెలువడినది. నాఁటినుండి యామె కవయిత్రి యయ్యెను. ఆమె చాల చిన్నవయస్సుననే మృదుమధురములగు నాంగ్లగీతికలు రచించి ప్రాజ్ఞుల మన్నన లందినది. "పూవు పుట్టగానే పరిమళించును" అను లోకోక్తి యామె యెడల సార్థకమైనది.
    సరోజినీదేవి తెలివితేటలను, రచనా విశేషమును జూచి నైజాము నవాబెంతయో సంతసించి యామెకు సంవత్సరమునకు 4500 రూప్యము లుచిత వేతన మిచ్చి యున్నత విద్యాభ్యాసమునకై యాంగ్లదేశమునకు బంపించెను.
    సరోజినీదేవి లండన్ లోని "కింగ్స్ కళాశాల" లోను కేంబ్రిడ్జిలోని "గిర్టన్ కాలేజి" లోను నాంగ్లభాషా పాండిత్యము సంపాదించినది. ఆమె తన విద్యార్థి జీవితమునందే మిక్కుటముగ కవితారచనము గావించినది. ఆమె పాశ్చాత్య సంప్రదాయములను గుర్తించినది. వారి భాషా వ్యవహారముల నాకళింపుచేసి కొనినది. తరువాత కొంతకాలమునకు మాతృదేశమునకు మరలి వచ్చినది.
    సరోజినీదేవి కవిత్వములో ప్రకృతిసౌందర్యము ప్రతిబింబించుచుండెను. ఆమె కవిత్వము హృదయరంజకమగు లాలిత్యమును గల్గియుండును. సరసము లగు భావములను చక్కని మాటలలో విశదీకరింపఁగల శక్తి యామె కున్నది. మనోహరములైన యామె యాంగ్లగీతికలు విశ్వవ్యాప్తములైనవి. ఆమె కవిత్వమునందెల్ల భారతదేశ సంబంధము లగు జాతీయ భావములే వెల్లి విరిసినవి. ఆమెకు భారతీయ సంప్రదాయములపై నెంతో విశ్వాస మున్నది.
    సరోజినీదేవికి బీదసాదరపైఁ గల యాదరము కవితారూపమున కరుణరస వాహినియై ప్రవహించినది. ముద్దుగా, ముచ్చటగా కావ్యకన్యను దిద్దితీర్చుట యామెకు వెన్నతోఁబెట్టిన విద్య. ఆమె రచనలు సర్వత్ర యభిమానింపఁ బడినవి. ఫ్రెంచి, జర్మని భాషలలోని కనువదింపఁబడినవి. ఆమె నిక్కముగా విశ్వకవయిత్రియైనది. ఆమె కవిత్వము పవిత్రమైన ప్రేమ కమరత్వము గల్గించి యాధ్యాత్మికప్రభావమును నిరూపించినది. అందులకే యామెకు 'ప్రాచ్యదేశపు కోకిల' "The nightingale of the east" యని పేరు వచ్చినది.
    ఆమె రచనము లన్నియు నలుగు సంపుటములుగా తాయారు చేయఁబడినవి. అవి "సువర్ణప్రాంగణము" "జీవన్మరణ గీతములు" "కాల విహంగము" "ఛిన్నగురుత్తు" అనునామములు గలవి.

 Previous Page Next Page