Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 63


    రుద్రమదేవి యాంధ్రదేశమున కేకైక మహారాజ్ఞియై నిరుపమాన శౌర్యసాహసములతో సామ్రాజ్యచక్రమును సాగింప మొదలుపెట్టెను. ఆమె చల్లని పరిపాలనమున సంతోషము ననుభవింపనివారు లేరు. కాని రాజ బంధువులగు హరిహర మురారిదేవులిరువురకు మాత్రము రుద్రమదేవి ప్రభుత్వము కంటకమయ్యెను. మొదటినుండియుఁ బుత్రసంతానములేని గణపతి దేవచక్రవర్తి తమలో నొకరికి రాజ్యము నొసఁగునని వారు కొండంత యాశతో నువ్విళ్ళూరుచుండిరి. కాని వారి యాశలన్నియు నిరాశలయ్యెను. దూరదేశమున రాజప్రతినిధులుగానున్న వారిరువురు అంత్యకాలమునకు నోరుగంటిలో లేకపోయిన తమ రాజ్యార్హత కెక్కడలోటు వాటిల్లునోయని చక్రవర్తి యవసానసమయమునకు నేకశిలానగరమునకుఁ జేరుకొనిరి. కాని చక్రవర్తి సంకల్పముతోపాటు భగవంతుని సంకల్పమును వారికిఁ బ్రతికూలముగనే పరిణమించెను.
    విశాలాంధ్ర సామ్రాజ్య సింహాసనమున నొక యబల పట్టాభిషిక్తురాలగుట గాంచినంతనే వారికి ద్వేషము మితిమీరెను. కిరిటమును ధరించిన రుద్రమదేవిని గాంచి వారి హృదయములు మరింత కలుశితములు కాసాగెను. దురాశాపరులగు వారిరువురు సామంతరాజులతోఁ గలిసి కుట్రలు సలుపసాగిరి. ఒక యాఁడుదాని పరిపాలనకులోఁబడి శిరస్సులు వంచుట మనవంటి పౌరుషవంతులకు భరింపరాణి యవమానమని వారలను రెచ్చఁగొట్టిరి. ఆవశ్యకమగు పక్షమున తాము వారికి సర్వవిధముల సాయపడెదమని వాగ్దానమొనరించిరి. కాని వారి యాశాలతలు లేఁ తలోనే వాడిపోయినవి. కుట్రలు బయటపడినవి.
    మురారి హరిహరులు రాజద్రోహముచేయుటకై ప్రయత్నములు చేయుచున్నారని వినుతతోడనే మహామంత్రి గోవిందామాత్యులవారికి మిక్కిలి యాగ్రహము గలిగెను. ఆయన వెంటనే వారిరువురను బిలిపించి వారి ద్రోహచింతలను నిరూపించి "జాగ్రత్త" యని హెచ్చరించెను.
    అది మొదలు మురారిహరిహరులకు నిద్రపట్టలేదు. రాత్రిపగలు ప్రతి నిమిషమును బ్రాణాపాయభయము వారిని బాధింప మొదలిడెను. "ఈ లేనిపోని కష్టములను గొనితెచ్చుకొంటి"మని హరిహరుఁడు మురారిని దూఱనారంభించెను. "రాజ్యమునకుఁ బౌరుషము ప్రధానము. రాజ్యాధికారము జన్మముతో నెవ్వరికిని తేరగాఁ బ్రాప్తించదు. సుక్షత్రియవంశమునఁ బుట్టిన పురుషులు పరాక్రమవంతులై దిగ్విజయ మొనరించి రాజ్యపాలన మొనరింపవలయును. లేదా వీరోచితముగ మరణింపవలయును. అంతేకాని సామాన్యసైనికులవలె నొకరిక్రింద - అందులో నాఁడుదాని క్రింద - కొలువుసేయుచు జీవన్మృతులమై తేజోవిహీనులమై బ్రతుకులీడ్చుట నా యభీష్టముగాదు. పురుషులమై జన్మించి వూఁబోండికి జోహారులు చేయుటకు సిగ్గుండవలదా" యని మురారి హరిహరుని మందలించెను.
    సామ్రాజ్యమం దేసేనానాయకునితోఁ గాని, ఏ మంత్రివరునితోఁగాని, ఏ దండనాయకునితోఁగాని రాణి కించుక వైమనస్యము కలుగునేమోయని వారిరువురు సమయముకొఱకై వేచియుండిరి.

                                                4

    మహారాజ్ఞి సమస్తప్రజారంజకముగా రాజ్యమును బాలించుచుండెను. సామంతనరనాథులు, తదితరప్రజలు గణపతి దేవచక్రవర్తియే రాజ్య మొనరించు చున్నట్లు భక్తి విశ్వాసములతో రాణిని సేవించుచుండిరి.
    అయినను దక్షిణదిశయందున్న వైరిరాజులవలన నాయాప్రాంతములందు సామ్రాజ్యశాంతికిఁ గొంత భంగము వాటిల్లినది. చోళులకును గాకతీయులకును మొదటినుండియు యాగర్భశత్రుత్వము. గణపతి దేవుని మరణవార్త చోళ చక్రవర్తియగు కులోత్తుంగ చోళుఁడు వినిన వెంటనే యపారమగు సేనా వాహినితోఁ గాకతీయ సామ్రాజ్యములోనికిఁ జొచ్చుకొని రాఁజొచ్చెను.
    తాత్కాలికముగా కొప్పెరుంజింగడు గణపతిదేవచక్రవర్తి సామంతుఁడయ్యెనేకాని యతఁడమితపరాక్రమశాలి. ఆనాఁటి వీరసైన్యములలోఁ బల్లవసేనను బ్రతిఘటింపఁ గలుగునది మరియొకటిలేదనియే చెప్పవచ్చును. అట్టి మహాసైన్యముతోఁ గొప్పెరుంజింగఁడు తిరుగుబాటొనరించెను, కాంచీపుర ప్రతినిధియగు గండగోపాలుఁడును సామ్రాజ్యమునకు వ్యతిరేకముగ విద్రోహమునకుఁ దలపడి కుట్రదారులతోఁ జేతులుకలిపెను.
    మహారాజ్ఞి రుద్రమదేవి దక్షిణదిశయం దేర్పడిన యీ యలజడి కేమాత్రమును భయపడలేదు. ప్రాణములను ధారవోసియైన నోరుగల్లు సామ్రాజ్యమును రక్షించుటకు బద్ధకంకణులైన దండనాయకులెందఱో యామె కండగా నిలిచిరి. వారిలో రేచర్లరుద్రుఁడు కులోత్తుంగుని యపారసేనానీకములను జెల్లాచెదరుగావించి పాఱఁద్రోలెను. వీరాధివీరులగు త్రిపురాంతకుఁడును, నతని తమ్ముఁడగు నంబదేవుఁడును గొప్పెరుంజింగనిఁ దఱిమివైచి గండగోపాలుని గర్వమణఁచి విద్రోహకారులను బందీలుగాఁ గొనివచ్చి రుద్రమదేవి పాదసాన్నిధ్యమునఁ బడవైచిరి.
    పైవిధముగ దేశమునం దల్లరులు బయలుదేరిన కాలముననే మురారి హరిహరులు కొలఁదిసైన్యములను మాత్రము తీసికొని ఓరుగల్లు పట్టణమును విడిచిపోయిరి. దయామయ హృదయమగు రుద్రమదేవి మురారి హరిహరుల దురాలోచనములు దెలిసినను వారి నుచితరీతుల గౌరవించుచునే వచ్చెను. అట్లయినను నామె యౌదార్యము కృతఘ్నులగు వారియెడ నేమాత్రమును ప్రయోజనకారి గాలేదు.
    క్రమక్రమముగ వారిరువురు కుతంత్రములను సాగించుచునే యుండిరి. కొలఁది సైన్యములతో బయలుదేరి యా విద్రోహులిరువురు యాదవ రాజ్యమును జేరుకొనిరి. యాదవ రాజును నోరుగంటిపై దండెత్తిరావలసినదని ప్రార్థించిరి. రుద్రమదేవిని పదభ్రష్టురాలినిగావించి తమ్మాసింహాసనముపై నభిషేకించినచో బ్రతికినంతకాలము సామంతులమై యాదవులకుఁ గప్పములు గట్టు చుండెదమని యాసవెట్టిరి. తమ సామ్రాజ్య మన్యాయముగా స్త్రీ హస్తగతమైన దనియు, గణపతి దేవుఁడు పుత్రిక యందలి మమకారముచే యుక్తాయుక్తము లెఱుంగక దేశమునకు మహాపకారము గావించి నాఁడనియు, ఇది తమకేకాక దేశమునందలి వీరవరేణ్యుల కందఱకు భరింపరాని యవమానకరమైన విషయమనియు, దీని కంతకు గోవిందామత్యుని దుర్నీతియే మూల కారణమనియు పరిపరివిధముల యాదవరాజుతో మొఱ వెట్టుకొనిరి, గణపతి దేవ చక్రవర్తి తనయనంతరము తమకే సామ్రాజ్యము నిమ్మనిచెప్పినను మహామంత్రి తన ప్రాభవమున కెట్టి భంగము వాటిల్లునో యను భయముచే రాజుమాట ద్రోసిపుచ్చియసమర్థురాలగు రుద్రమను పేరుకుమాత్రము సింహాసనముపైఁ గూర్చుండఁబెట్టి వాస్తవమునకుఁ దానే రాజైచక్రము ద్రిప్పుచున్నాఁడని యేవేవో లేనిపోని నిందలుమోపి యాదవరాజు సహాయమర్థించిరి.

 Previous Page Next Page