Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 64


    ఆ కాలమున యాదవరాజ్యమును మహాదేవరాజు పరిపాలించుచుండెను. ఆయన రాజధాని దేవగిరి. ఇతనికి మొదటినుండియు నాంధ్రసామ్రాజ్యమును విచ్ఛిన్న మొనరించి దక్షిణాపథమున కంతటికి నేకచ్ఛత్రాధిపత్యము వహింప వలయునను కోరిక మిక్కుటముగా నుండెను. దానికిఁదగినట్లు సామ్రాజ్యము నందలి గుట్టుమట్టు లెఱిఁగిన రాజబంధువులు మిత్రులైనారు. ఇఁకఁ గావలసిన దేమున్నది? మహాదేవుఁడు పరమానందముతో నేకశిలానగరముపై దండెత్తుటకును గాకతీయ సామ్రాజ్యమును భగ్నమొనరించుటకును మురారి హరిహరులకు వాగ్దాన మొనరించెను. బ్రహ్మాండమగు సైన్యమును సంసిద్ధపఱచుకొని సమయమునకై నిరీక్షించుచుండెను.
    మురారి హరిహరులు ముఖ్యపట్టణమును వదలినది మొదలు కొంత కాలమువఱకు రుద్రమదేవి వారేమి పన్నాగములు పన్నుచున్నారోయని విచారించినది. గూఢచారులను బంపించి వెదకించినది. ఈ దుర్మార్గులు సామ్రాజ్యమున హఠాత్తుగా నేమూలనుండి యెట్టి యుపద్రవమును దెచ్చిపెట్టుదురో మని యామెమానసమున సందేహ మంకురించినది. ఆఱేండ్లు గడచిపోయినవిగాని మురారిహరిహరుల విషయమై యెట్టిసమాచారమును రాణికి చారుల ముఖమునఁ దెలియరాలేదు. అవమానమును భరింపలేక హతాశులై యెందేని ప్రాణత్యాగముగావించుకొని యుందురని యామె తలపోసి యింక వారి జాడలను దెలిసికొను ప్రయత్నమునుండి విరమించుకొనినది.
    క్రమక్రమముగా సామ్రాజ్యమునఁ బ్రబలిన కల్లోలములు శాంతించినవి. వినోద విహారములకును, కవితా గోష్ఠులకును, కళాప్రదర్శనములకును మహారాజ్ఞి కొకింత విశ్రాంతి లభించినది. శ్రీవీరరుద్రమహారాజ్ఞి యేటేట నెన్నెన్నియో పండిత సత్కారములు గావించినది. ఎందరెందరో కవులను గౌరవించినది. బీదసాదలకు విరివిగా దానధర్మములు గావించినది. బ్రాహ్మణుల కగ్రహారము లొసంగినది. వేలకొలఁది చెరువులు త్రవ్వించినది. ఉద్యాన వనములు గల్పించినది. వేయేల! నామె తన యుదార స్వభావముచే గణపతిదేవ చక్రవర్తికంటె నధికమగు యశస్సు గడించినది.

                                5

    ప్రశాంత సమయములందు సైతము రుద్రమదేవి దుర్గరక్షణమునందును, సైన్యసమీకరణమునందును, రాజ్యాభివృద్ధియందును నశ్రద్ధ వహింపలేదు. పల్లవనాయకునకు నగరరక్షకపట్టము గట్టినది. ఏకశిలానగరదుర్గము ననేక విధముల సంస్కరించినది.
    అంతకుపూర్వము గణపతి దేవ చక్రవర్తి దుర్గము చుట్టును గట్టించిన ఱాతిగోడకు లోపలి భాగమునందు మెట్లులేవు. అట్టి సోపాన నిర్మాణ మొనరించి శత్రురాజులు నగరమును ముట్టడించినప్పుడు తన సైనికులు సునాయాసముగా కోట గోడలెక్కుట కవకాశము గల్పించినది. దుర్గమధ్యభాగమునందెన్నియో నూతనాయుధాగారములను నిర్మించినది. మదపు టేనుఁగుపై నెక్కి సంగ్రామ సమయములందు సైనికులను స్వయముగా నడిపించుటకు వలయునంత విశాలముగా దుర్గముచుట్టును మరియొక మట్టి ప్రాకారమును గట్టించినది. శత్రువులకు సర్వవిధముల దుర్గము దుర్భేద్యముగ నుండుటకై వెలుపలి ప్రాకారముచుట్టును లోఁతైన యగడ్తను త్రవ్వించినది.
    ఆమె సేనానాయకులు ఓరుగంటి దుర్గప్రాకారము నెనిమిది గవనులుగను పదునాఱుదిడ్లుగను విభజించిరి. దుర్గ సంరక్షణముకొఱకై కొమ్మకురువురు, బురుజు కేఁబది మంది, దిడ్డికి నూర్గురు, గవను కయిదువందలమంది, రక్షక భటులను సమాయత్తపఱచిరి.
    రుద్రమదేవి యద్వితీయ శివభక్తురాలు. తన తండ్రియగు గణపతిదేవ సార్వభౌముఁడు జీవించియుండఁగనే యామె గోళగీశైవ మఠాధిపతియగు విశ్వేశ్వర శివదేశికాచార్యులవారికి వెలగపూఁడి గ్రామమును దాన మొనరించినది. విశ్వేశ్వర శివదేశికులు స్త్రీలకొఱకై యానాఁటి యావత్పప్రంచ మెఱుఁగని ప్రసూతిశాలను నిర్మించుటకు రుద్రమదేవి ప్రోత్సాహమే కారణము. ఆమె యా గ్రామమున నిర్మింపఁ బడిన విశ్వేశ్వరస్వామివారి యాలయమునందు ప్రతిదినము నష్టాదశవర్ణములవారికిని నన్న దానముగావించుట కేర్పాటు చేసినది. స్వామివారి కష్టవిధకైంకర్యముల కనువుచూపినది.
    సంవత్సరమున కొకటిరెండు పర్యాయములైనను ఆప్తబంధువులతో వెలగపూఁడి గ్రామమునకు విచ్చేసి స్వామివారిని సందర్శించి కానుక లర్పించుకొనుట యామె కాచారము. చాలకాలమునుండి యీ యాచారము ప్రకారము స్వామి సందర్శనమునకై వచ్చుచుండెను. కాని పట్టాభిషేకానంతరము రాజ్యమునందేర్పడిన యలజడుల కారణమునఁ గొంతకాలమును, స్వపరిపాలనా నిర్వహణ కార్యభారము వలన మరికొంత కాలమును మహారాజ్ఞి కట్టియవకాశము లభించినదిగాదు.
    ప్రస్తుతము రుద్రమదేవి కొంచెము విశ్రాంతి లభించినదిగదా యని దుర్గరక్షణమునకై కొంతసైన్యమును నియమించి కొంతసైన్యమును వెంటఁగొని సబంధుమిత్రముగా స్వామివారి సందర్శనమునకై బయలుదేరివచ్చినది. శివదేశికాచార్యులవారి యాహ్వానమును, విశ్వేశ్వరస్వామివారి మహోత్సవములును రుద్రమదేవి వెలగపూఁడికిఁ బయనమగుటకు ముఖ్య కారణములు. రాణిగారి రాక నెఱింగిన యక్కడి భక్తవరేణ్యులు స్వామివారి మహోత్సవములు కైంకర్యములు నూతనోత్సాహముతో జరిపించుచుండిరి. సామాన్యగ్రామమగు వెలగపూఁడి యా యుత్సవసంరంభములతో నొక మహాపట్టణమువలెఁ బెరిఁగిపోయినది. మహారాణికి తా నాయుత్సవములలోఁ బాల్గొనునప్పుడు ఏకశిలానగరములోని శ్రీ స్వయంభూ దేవస్వామివారి మహోత్సవములలో నున్నట్లే యుండెను.
    ఈ విధముగా రుద్రమదేవి వెలగపూఁడికి వచ్చి విశ్వేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వకముగ నభిషేకములు గావించినది. సహస్రనామార్చనములు జరిపించినది. లక్షపత్రిపూజలు యథావిధిగా నేరవేర్చినది. కానుకలు సమర్పించినది. బీదసాదలకు బహుమూల్యవస్త్రాభరణములు దానము గావించినది. అసంఖ్యాకులగు జనుల కన్నదానముచేసినది.
    వినోదమునకై యొక కాఁపుపడుచువలె మారువేషమును ధరించి సంతోషఁ బ్రవేశించినది. సమస్తవస్తువులను బెరమాడినది. వీథిభాగవతములను దర్శించినది. భరత నాట్యములను పరికించినది. కోడిపందెములను, పొట్టేలు పోట్లాటలను చూచి నవ్వుకొనినది. అమాయికులగు జానపదుల సంభాషణము లాలకించి కొంతతడవు వినోదించినది. నాటకరంగములయందుఁ బ్రదర్శింపఁబడుచున్న తన విజయగాథలను గాంచి సంతోషభరితమానసురాలైనది. ఆ యానందములో, ఆ సంతోషములో, ఆయుత్సాహములో విశాలాంధ్ర సామ్రాజ్యమును తన బాహువులపై నిడుకొని మోయుచున్న విషయమే మఱచిపోయినది.

 Previous Page Next Page