Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 57


    "ఖడ్గతిక్కన వచ్చుచున్నాడు, ఖడ్గతిక్కన వచ్చుచున్నాడు" అను పౌరుల కలకల మాలించి తన కుమారుఁడు సంగ్రామరంగమున శాత్రవసైన్యములను సంహార మొనర్చి జయలక్ష్మి సమేతుఁడై వచ్చుచున్నాడు కాఁబోలు నని నందను నభినందించుటకై సిద్దనామాత్యుఁడు భవన ద్వారము ముందు నిలిచి నీరిక్షించుచుండెను. కాని దూరము నుండియే కుమారుని ముఖ లక్షణములను బరికించి చూచి సిద్దమ చిత్తము సంశయాయావత్తమయ్యెను. "ఇదేయేమి? వీని వదనమున విజయచిహ్నములు గానుపించుటలేదే! వీని యునికి యపజయమును సూచించుచున్నదే! ఏమేమి యనర్ధములు వాటిల్లినవో! ఒకవేళ సమరపరాజ్ముఖుఁడై శత్రువులకు వెన్నిచ్చి వచ్చుట లేదు గదా! ఏమి సిద్దన నందనుండంతటి యాకార్యమునకు సిద్దపడునా! ఏమో! ఎట్టి యవాచ్యములు వినఁబోవుచున్నానో!" యని పెక్కు విధములందలపోయుచు డోలాందోలిత హృదయుడై యున్నంతలో తిక్కన యింటి సమ్ముఖమునకు వచ్చి యశ్వము నుండి క్రిందికి దుమికెను. తన ముద్దుబిడ్డ తన్ను వీరమాతను గావించి విరోధిసేనానీకమును గుసిమసంగి వచ్చి యున్నాఁడని ప్రోలమాంబయు, తన భర్త తనకు వీరపత్నీ గౌరవమును గట్టి పెట్టుటకై విచ్చేసినాఁడని తిక్కన యార్ధంగి చానమ్మయును లోపలి నుండి పరిగెత్తుకొని వచ్చిరి.
    కాని వారెంత యుత్సాహముతో వచ్చినారో యంత నిరుత్సాహ మేదురైనది. తిక్కన ముఖమండలమున నెంత వేదికినను విజయలక్షణములు గానిపించుట లేదు. అతని చూపులలో నడకలో గర్వరేఖలు కానవచ్చుట లేదు. పరాజయ చిహ్నము లాతని కన్నులలో స్పష్టముగఁ బ్రతిఫలించుచుండెను. తిక్కన గుఱ్ఱమును దిగి తండ్రి వైపు గాని తల్లి వైపు గాని చూడలేదు. ఎవ్వరితోనూ మాటాడలేదు. అట్లే తలవంచుకొని చెరచెర లోనికి వచ్చి గృహంతర్భాగమున గోడకానుకొని కూలఁబడెను.
    సిద్దనామాత్యుఁడు విన్నఁబోయిన కుమారుని యాననము వంకఁ జూచుచు "తిక్కా! ఇట్లున్నా వేమి?" విశేషము లేమియు లేవు గదా! సంగర మేమి చేసి వచ్చితివి" అని ప్రశ్నించెను. కొడుకు తండ్రి ప్రశ్నకు సమాధాన మీయలేదు. అట్లే వినమ్రవదనుఁడై నేలఁ జూచుచుఁ గూర్చుండి యుండెను. ఏ నాఁడును గని విని యెరుంగని తనయుని పరాజయ పరిక్లిన్న వదనమునకుఁ దల్లి యుల్ల,ము తహతహలది పోయినది.  ఇఁక తిక్కన భార్య యొక్క క్షణమైన నక్కడ నిలువలేకపోయినది. భర్త ప్రతిపక్షులకు వెన్నిచ్చి పరాభూతుఁడై పరుగిడివచ్చినాఁడన్న విషయ మామె గ్రహించుట కెంతో కాలము పట్టలేదు. ఒకమాటు తన విభుని ముఖము వైపు చురచుర చూచి చెర చెర గృహం తర్భాగమునకుఁబోయి యా వీరనారీశిరోమణి "తా నొక పిరికి పందకు భార్యనై వీరపత్నీ గౌరవమును గోల్పోయితిని గదా" యని చింతింపసాగెను.
    జనకుఁడు తనయునిఁ జూచి "కుమారా! ఎంతటి యాకార్య మొనరించితివి? ఇదియేనా వీర లక్షణము? నీకు నేర్పిన విజయగాధలన్నియు నే గంగలోఁ గలిపివచ్చితివి? నా కడుపున సింహకిశోరము జన్మించిన దనుకొంటిని కాని జింకపిల్ల పుట్టిన దనుకోలేదు. నీమూలముగా నా కొట్టరువు వంశమునకును, మనుమసిద్ది మహీనాదునికి , సింహాసనమునకును, విక్రమసింహాపురమునకును, తుదకు నాంధ్రభూమికే యపయశస్సు వాటిల్లినదిగా! నేనింక రాజేంద్రుని ముఖమేట్లు చూడఁగలను? నీయన్న కవి తిక్కన నీ చర్యలు విన్న నెంత చింతించునో యేచించితివా! సమరరంగమున శత్రువులను జంపవలయును లేదా వారిచేఁ జావవలయును. ఇది వీర ధర్మము. వీరధర్మమును బరిత్యజించి కందిశీకుఁడవై కాలికి బుద్ది సెప్పుట హేయము గాదా? తిక్కా! నీవు నీ యక్రమ ప్రవర్తనచే విక్రమపుర విఖ్యాతిని మట్టిపాలు సేసితి" వని కర్ణకఠోరముగఁ బలికి గదిలోనికిఁ బోయి తలుపు వేసికొనెను.
    ప్రోలమాంబ కొంతసేపు కుమారునిఁ జూచుచు నిలువఁబడినది. తన భర్త పలికిన వాక్యములకుఁ జాల నొచ్చుకొనినది. తన తనయుని యనాలోచిత బీరుత్వ ప్రదర్శనకు లోలోనఁగుందినది. మెల్లగాఁ గుమారుని సమీపించి పైఁట చెఱఁతో ముఖామనందలి స్వేదబిందువులఁ దుడుచుచు నిట్లు పలికినది.
    "తండ్రీ ! ఎప్పుడును లేని హృదయ దౌర్భల్యమీనాఁడు నీ కెక్కడి నుండి దాపురించినదొయీ? కలనైన నేరుఁగని యీ పిరికిమందు నీ కెవరు నూరిపోసిరొయీ? ఇంతకూ ముందెన్ని సారులు వీరాధివీరుఁడవై రణరంగమున కేఁగలేదు! ఎన్ని మారులు వైరుల పీఁచ మనంచలేదు! ఎన్ని పర్యాయములు విజయలక్ష్మి సమలంకృతుఁడవై నాకున్న దోయికి విందు సేయలేదు! ఈ దినమింత బేలవై తూలి వచ్చితివేమి? మన వీరులందరు నేమైరి? నీ యఖండపరాక్రమ మేల మొక్కవోయినది? నీ ధైర్య సహసాములన్నియు నే సముద్రములోఁ గలసినవి? అటు చూడుము! విజయశ్రీ విరాజితుఁడవై నీవు విచ్చేయసమయమున నీకు నెదురు వచ్చి స్వాగతమీయవలయునను నుబలాటముతో , కోడలు పళ్ళేరము నిండా పూలదండల నెట్ల మర్చియున్నదో! నీ విట్లు భీరువువయి పారిపోయి వచ్చితివన్ననా వీరాంగన హృదయ మెంత యుడికి పోవుచున్నదో! నాయనా! మీ నాయన మాటలకుఁ గష్టపడకుము. అయినదేదో అయినది. లే! స్నానము చేసి రెండు మెతుకులు తినుము' అని తల్లి లోనికిపోయి స్నానము చేయుటకై ఖడ్గ తిక్కనకు నుష్తోదకము సిద్దము చేయుమని కోడలికిఁ జెప్పినది.
    తిక్కనకు మాతృహృదయములోని బాధ యవగతమైనది. తండ్రి పలుకులలోని భావము తెల్లమైనది. సతీమణి తిరస్కారద్రుష్టిలోని యంతరార్ధము గొంతవరకు బోధపడినది. అతని మానససరోవరమున నెన్నియో కల్లోలములు లేచినవి.
    "ఈ నాఁడు విధి వశమున బ్రాప్తించిన పరాజయమునకుఁగదా యీ పరభావమంతయును! నిజమే రణరంగమునఁ బురోగమించుట వీరలక్షణముగాని తిరోగమించుట భీరులక్షణముగాదా! నాకేల ఈ బుద్ది తోఁచలేదు? శత్రువుల మాయావాక్యములకు లొంగిపోయి నేనేల గృహోన్ముఖుఁడైతిని?అట్లే శక్తి కోలఁది పోరాడి సంగ్రామ క్షేత్రమునంబ్రాణములు వీడిన నన్ను వీరందఱును వీరశిఖామణి యని వేనోళ్ళఁబొగడియుందురు గదా! నా తల్లి యుల్లమునఁ ఋత్రదుఃఖమున కంటే వీరమాతనన్న సంతోషమే యదికమై యుండేదిదిగదా! నేనిట్లు మగిడి వచ్చితినన్నమాట విన్న మనుమసిద్ది మహీనాదుఁడెంత బాధపడునో! అన్న తిక్కనామాత్యుఁడెంత చింతించునో! నన్నెంత దూషించునో! అ మహానుభావుని వదన మెట్లు చూడఁగలను? ఇప్పుడు కర్తవ్యమేమిటి? మరల నశ్వము వదిరోహించి సైన్యములను బిలిచికొని సమరభూమి కరుగురునా? ఆహా! ఈ గాయముల నుండి రక్త మింకను స్రవించుచునేయున్నదే! నా పంచకళ్యాణి యింకను రొప్పుచునేయున్నదే! నాసేన లోకింత యాయాసమునైనఁదీర్చుకొనవలదా! ఊరక రణరంగమునఁ బురుగువలేఁ జచ్చుటయే వీరధర్మమా! యుక్తా యుక్తవివేకమువలదా! శక్తి చాలనప్పుడు తొలఁగిపోయి వెండియు సేనలఁ గూర్చుకొని వీరవిహారము సేయుటకు శాస్త్రవేత్తలోప్పుకోనరా? సాధ్యమయినంతవరకు విజయలక్ష్మిని బడయు నుపాయమును దృష్టిలో నుంచుకొని ప్రవర్తించుటయుఁ బాపమయ్యేనా? ఈ యాలోచానతోడనే కదా నేను సుంత విశ్రాంతి దీసికొని మరలఁ గ్రొత్తసైన్యములను సమీకరించుకొని సమరరంగమునఁ బ్రవేశింప వచ్చునని పురాభిముఖుఁడనైతిని. "జయాప జయమ్ములు దైవాధీనము" లనియైనఁ దలంపక నగరవాసులందరూ నన్నిట్లవమానింతురా? ఒకవేళ వారు తెలియకట్లు పరాభవించినను నన్నుఁగన్న జననీజనకులును నా హృదయేశ్వరియు నా స్వభావమును గొంచమైనను గుర్తింపక పిరికిపంద యని భావింతురా! రవ్వంత సేదతీర్చుకొని వెండియు ఖండన భూమికింజని ప్రతిపక్షుల చించి చెండాడేడంగాక."

 Previous Page Next Page