Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 28


    "ఆ గోడ ఏం సమాధానం చెబుతుంది? నన్నడిగితే చెబుతాను" అన్నాడు మధుబాబు పరిహాసంగా.

    "పోనీ మీరే  చెప్పండి" అంది ఇందిర సన్నని స్వరంతో.

    "రాయటల్లేదు."

    "ఎందుకని....?"

    "రాయబుద్ధి కావటంల్లేదు."

    "ఎందుకని?"

    "ఎందుకంటే ఏం చెప్పేది, నాలోంచి ఏమీ ఇన్స్పిరేషన్ రావటంలేదు. నిస్సారంగా, స్తబ్ధుగా, మత్తుగా వుంది మనసు..... అదీగాక...."

    ఆడపిల్లలిద్దరూ చెప్పమన్నట్లు చూశారు.

    "నాలో ఏమీ టాలెంట్ లేదు. నేను ఎందుకు రాశానో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేకుండా వున్నాను. ఈ రాయటం ఎందుకు? దేనికి ఈ తపనంతా అనిపిస్తోంది. చివరకు విరక్తే మిగులుతోంది."

    "ఈ చిన్న వయస్సులో మీకెందుకండీ విరక్తి?" అనడిగింది. రత్నకుమారి.

    అతను మందహాసం చేసి వూరుకున్నాడు, జవాబు చెప్పలేదు.

    ఇందిరకు కొంచెం ఉక్రోషం వచ్చింది. "చెప్పమను రత్నా, నవ్వకుండా. ఎందుకేమిటి విరక్తి?" అన్నది.

    "చెప్పలేను జవాబును. నాకూ సరిగ్గా  తెలీదు. చాలా పుస్తకాలు రాసిన మీదట ప్రతివాడికీ ఈ దశ తప్పదేమో. ఇప్పుడు నాలో తృష్ణ చల్లారిపోయింది. రచనలు విరివిగా చెయ్యాలనుకున్నను. చేశాను. నా వయస్సులో  ఎవరూ  సాధించనిది సాధించాలనుకున్నాను.  సాధించాను. పేరు కావాలనుకున్నాను. నా తృప్తిమేరకు  వచ్చింది. నన్నారాధించే వ్యక్తులుండాలనుకున్నాను. అదీ జరిగింది. ఒక జీవితం అయిపోయినట్లుగా వుంది. ఏ పొగరూ, ఉద్రేకం లేవు. అంతా నీరసం, శూన్యం. నిశ్చింతమట్టుకు లేదు. ఉండదేమోకూడా. జీవితంలో సెటిల్కాకముందే ఓ రకమైన అనుభూతిని పూర్తిగా  పొందేశాను. నేను మామూలుగా మిగిలిపోయాను. నన్నెవరైనా కదిలించనిదే, కవ్వించనిదే కేవలం డాక్టరుగానే రోగాలకు మందులిచ్చుకుంటూ గడపాల్సి వస్తుంది."

    ఇందిర గగుర్పాటు చెందింది. అతని ముఖంకేసి దీర్ఘంగా చూసింది. ఎంత అమాయకంగా, పసిగా, నిష్కల్మషంగా వుంది! ఎందుకో ఆమె నేత్రాంచలాల్లో నీళ్లు నిలిచాయి.

    "ఇంత గొప్ప రచయిత మీరు.... ఇలా అంటారేం? ఎంతతపనగా వుంది నాకు? ఎంత దుస్సహంగా వుంది" అని వాపోయింది లోలోపల అతన్నలాగే చూస్తూ.


                                                                      27

    ఇందిర మధుబాబుని తరచు కలుసుకుంటోంది. ఇప్పుడు  సిగ్గూ, సంకోచం చాలావరకూ తీరిపోయాయి. కాని అతన్ని తమ ఇంటికి ఆహ్వానించే ధైర్యం లేదామెకు. ఓ పరపురుషుడితో మాట్లాడేంతటి స్వేచ్ఛ ఆమెకు  లేదు ఇంట్లో. మొదట్లో  రత్నకుమారీ, ఆమె కలిసి వచ్చేవారు. తరువాత రత్నకుమారి అప్పుడప్పుడూ వస్తూండేది. ఇందిర వంటరిగానే రావటం నేర్చుకుంది.

    మధుబాబు జీవితంలో ఏదోచిత్రం వుంది. అతని గిరిలోకి వచ్చేవాళ్ళు అతి త్వరలో ఎంతో సన్నిహితంగా నైనా అయిపోతారు. లేక పట్టించుకోకుండా దూరంగానైనా కరిగిపోతారు. కాని మధ్యస్తంగా , కేవలం పరిచితులుగా ఎప్పుడూ మిగిలిపోరు.

    ఇందిరతోటి స్నేహం అతనికి ముదావహంగానే వుంది. ఆమెదగ్గర వున్నంతసేపూ  అతను విశ్రాంతి ఫీలౌతున్నాడు. నిశ్చింతగా, కేవలం పరిచితులుగా ఎప్పుడూ మిగలిపోరు.

    కాని ఇందిర ఇంకా లోకంలోకి సరిగ్గా అడుగెట్టని యువతి. అన్నలూ, చెల్లెళ్ళూ, తల్లీ, తండ్రీ....యీ బాధ్యతలు, బంధాలుతప్ప అన్యం ఆలోచించటానికి ఇంకా అలవాటు పడని అమ్మాయి. మధుబాబు పుస్తకాలు చదివాక జీవితాన్ని గురించి కొంచెం ఆలోచించసాగింది. మొదట అతను చాలా  పెద్దవాడనీ, కనీసం నలభై ఏళ్ళయినా  వుంటాయనీ, చాలా ప్రాంతాలు తిరిగి అనుభవం, విజ్ఞానం సంపాదించిన వ్యక్తి అనీ అనుకుంది. కాని ఓసారి అతని ఫోటో చూశాక "ఇంత చిన్నవాడా?" అని విస్మయం చెంది, అతని రచనల్ని మరింత అభిమానిస్తూ వచ్చింది. ఇంతలో ఆమెతండ్రికి విశాఖపట్నం ట్రాన్స్ ఫర్ అయింది. అప్పట్నుంచీ అతన్ని కలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూనే వుంది. కాని తనంతట తనుపోయి ఓ యువకుడ్ని ఎలా కలుసుకుంటుంది? ఆమె సిగ్గుపడింది. రత్నకుమారి చొరవవలన చివరకు అతనికి సూటిగా  వచ్చివేసింది.

    ఇందిరకు ఇదివరకెన్నడూ మనశ్శాంతి లేకపోవటం లేదు. జీవితంలో కష్టాలూ, ఇబ్బందీ వుంటాయని తెలీదు. మధుబాబుతో సన్నిహితంగా వస్తున్నాక, అతనిమాటలు వింటున్నాక ఆమెకికూడా జీవితమంటే భయం వెయ్యసాగింది. ఓ రకం అశాంతి వేధించసాగింది. ఇదివరకు లేని సమస్యలు ఇప్పుడు ఉత్పన్నమౌతున్నాయి.

    "ఏమిటలా వున్నారు?" అనడిగాడు ఒకరోజు మధుబాబు.

    "ఎలా వున్నాను?" అని ఆమె ఎదురు ప్రశ్నవేసింది.

    "దిగులుగా, అన్యమనస్కంగా కనిపిస్తున్నారు."

    "లేదే" అని ఆమె తప్పించుకోజూచింది.

    "చెప్పండి ఫర్వాలేదు. నాకు చేతనైతే సముదాయిస్తాను. నేను ఇతరుల్ని ఓదార్చటానికే పుట్టాను, తెలుసా?"

    "నేను మాత్రం ఇతరులచేత ఓదార్చబడటానికి పుట్టలేదండీ" అని సమాధానం చెప్పింది ఇందిర.

    మధుబాబుకి చిన్నదెబ్బ తగిలింది. అతనామె ముఖం చూడలేకపోయాడు.

    "కోపం వచ్చిందా?" అనడిగింది ఇందిర.

    "కొంచెం" అన్నాడతను బలవంతాన నవ్వి.

    "అయితే శిక్ష విధించండి."

    "ఏం శిక్ష?"

    "మీ ఇష్టం. పది గుంజీళ్ళు."

    అతని మనసంతా కెలికినట్లయింది. అక్కడ్నుంచి లేచి కిటికీదగ్గరకు వెళ్ళి బయటకు చూడసాగాడు. పద్మజ జ్ఞాపకం వచ్చింది.

    "ఏమైనా బాధ కలిగించానా?" అనడిగింది ఇందిర వెనకనుంచి భయంగా.

    అతను ఆమెకేసి తిరిగి "అబ్బే లేదండీ మీరు నాకు ఎందుకు బాధ కలిగిస్తారు?" అన్నాడు గాద్గదికంగా.

    "మీకంటే  చిన్నదాన్ని. నన్ను 'మీరు', 'మీరు' అనవచ్చా?"

    "నేనట్లాగే అనగలనండీ. నువ్వంటే ఎలాగో వుంటుంది."

    "ఇహ ఎప్పుడూ కూడా ఇంతేనా?"

    "భవిష్యత్ గురించి నేను జోస్యం చెప్పలేను."


                                                                   *    *    *


    తమ ఇద్దరిమధ్యా సంభాషణ ఇలాగే అంతరంగికంగా వుండటం గమనించాడు మధుబాబు. తనలోని రచయితని చూసి ఆమె తనదగ్గరకు వచ్చినా చివరకు  జనరల్  టాపిక్స్ లేకుండా పోయినాయి ఇద్దరిమధ్యా మాట్లాడలేకుండా వున్నారు. ఆ పుస్తకం రాయటంలో ఉద్దేశం ఏమిటనీ, యీ పుస్తకం  ఉద్దేశం ఏమిటని మొదల్లో అడుగూతూండేది. చెప్పాలంటే అతనికి భావోద్రేకం కలిగేదికాదు. మెల్లిగా  విషయం  తప్పించేవాడు.

    "పెళ్లినిగురించి మీ ఉద్దేశం ఏమిటి?" అనడిగింది. అట్టే  ఇష్టమూ లేదు."

    ఇందిర ఆశ్చర్యంగా చూసింది.

    "మరి మీ ఉద్దేశ్యం"

    "ఇందిర సిగ్గుపడింది. "అబ్బ, నాకు తెలీదు."

    మధుబాబు బలవంతం చేస్తూ "ఫర్వాలేదు చెప్పండి. చెప్పాల్సిందే మరి" అన్నాడు.

    ఇందిర కనులు మూసుకుని "పెళ్ళి ఓ మధురంబంధం" అంది ఎర్రబడ్డ ముఖంతో.

    అతనట్లాగే చూస్తున్నాడు.

    "మనిషికి నిండుతనం, సుఖం ప్రసాదించే ఆనందదాయకమైన ఘట్టం, వరప్రసాదం."

    ఆ తర్వాత చాలాసేపటిదాకా కనులు తెరవనేలేదు.



                                                                    28


    ఇందిరకూ, తనకూ మధ్య తెలియనది ఏమైనా జరుగుతోందా? అన్న సంశయం మధుబాబుని వేధించసాగింది. మనుషులు ప్రేమ అంటారుగాని  "ఒకర్ని ప్రేమించాను" అన్న స్థిరమైన సత్యం స్పష్టంగా తెలుసుకోవటం చాలా కష్టం. ఎప్పటికప్పుడు  అర్థంగాకుండా , ఆందోళనగా అందని అపూర్వంలా వుంటుంది. పొరపాటునన్నా ఆ వ్యక్తిని గురించి భ్రమేమో అన్నశంక రాకుండా, తియ్యదనానికి, నిరంతరాలోచలకూ అంతరాయం లేకుండా వున్నస్థితే నిజమైన ప్రేమ.

    ఒకర్ని ప్రేమించినా, ప్రేమించకపోయినా ఏ స్త్రీ అయినా ఒక పురుషుడి సాన్నిహిత్యంలో తరుచు వున్నదంటే ఆమె తప్పకుండా అతడిని కలవర పరుస్తుంది. "మా ఇద్దరిమధ్యా ఏంలేదు, వట్టి స్నేహం" అని ధైర్యంగా చెప్పుకోవటం బుకాయింపు. తరువాత అది స్నేహంగానే మిగిలిపోవచ్చు. సోదరసోదరీ ప్రేమక్రింద పరిణమించవచ్చు. చంచలతను తప్పించుకోవటం మాత్రం దుస్సాధ్యం. ఓ స్త్రీ అంటే బొత్తిగా గౌరవం లేక, లేకపోతే అసహ్యము వుండి ఆమెతో  ఎన్నిగంటలు, రోజులు గడిపినా వికారం కలగలేదంటే అది వేరే విషయం. కారణాలు స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి.

    ఓసారి ఇందిరకు జ్వరం వచ్చింది. రత్నకుమారిద్వారా ఈ విషయం మధుబాబుకు తెలిసింది. వెళ్లిచూడాలని ఆరాటపడ్డాడు. కాని వాళ్ల ఇంటికి ఎలా వెళతాడు? వూరుకున్నాడు.

    కొన్నాళ్ళు పోయాక ఇందిర చిక్కిపోయి, కళాకాంతులు నశించిన ముఖంతో  మధుబాబుదగ్గరకు వచ్చి "నాకు చచ్చిపోవాలని వుందండీ" అన్నది .

    "అదేమిటి?" అన్నాడతను విస్మితుడై.

 Previous Page Next Page