భక్తీ రస చిత్రం కధ
పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
"నిర్మాతా! నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు భలే జాలి కలుగుతోంది. నీలాగే ఎంతో శ్రమపడి సినిమా తీడ్డామనుకున్న వినాయకుడి కధ చెప్తాను. మార్గాయాసం తెలియకుండా విను" అంటూ ప్రారంభించాడు.
వినాయకచవితినాడు మధ్యాహ్నం వినాయకుడు ఉండ్రాళ్ళు తిన్నాక భక్తులు తన నెంతగా ప్రార్దిస్తున్నారో చూద్దామని తాపీగా భూలోకం వైపు బయల్దేరాడు. దారిలో నారదుడు కనబడి తనూ వస్తానని వెంబడి పడ్డాడు. ఇద్దరూ ఇళ్ళన్నీ చూసుకుంటూ తిరగసాగారు. ఏ ఇల్లు చూసినా తన పత్రిమలూ, డానికీ అలంకారాలూ అయితే ఉన్నాయి గానీ తలుచుకొనేవారూ పూజించే వారూ ఎవరూ కనిపించలేదు. అసలు చాలా ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయ్.
"నారదా , ఏమిటిది? నా భక్తులందరూ ఎమయిపోయారు?" అనడిగాడు వినాయకుడు నీరసంగా.
"ఎంతటి భక్తులయినా ఈ రోజుల్లో శెలవు దొరికితే చాలు మాట్నీలకూ, ఫస్టు షోలకు వెళ్ళిపోతారు వినాయకా. కావాలంటే పద చూపిస్తాను." అంటూ ఇసుక వేస్తె రాలనంతా జనం ఉన్న సినిమా దియేటర్లు కొన్ని చూపించాడు . వినాయకుడికి మతి పోయినట్లయింది.
"నా గతి ఇలా అయిందా?" అన్నాడు దీనంగా.
"నీ గతే కాదు నాయనా, దేముళ్ళందరి గతి ఇంతే. ముందు సినిమా - తరువాత దేముడు అంటున్నారు జనం."
"మరి దీనికి మార్గాంతరం ఏమీ లేదా? ఈ ప్రజలను మళ్ళీ భక్తీ మార్గంలోకి మళ్ళించేదేలా?"
"దాన్దేముంది ? నువ్వు ఇక్కడే కొన్నాళ్ళుండి దేవుళ్ళ మహిమ మీద ఓ సినిమా తీసెయ్ దాంతో మళ్ళీ అందరికీ భక్తీ పెరిగిపోతుంది."
"అంతేనంటావా?"
"అంతే. నే వస్తామరి. అవతల అర్జంటు పని ఉంది" అంటూ వెళ్ళిపోయాడు నారదుడు.
వెంటనే వినాయకుడు వాళ్ళమ్మతో మాట్లాడాడు.
"అమ్మా! నేను భూలోకంలో సినిమా తీస్తున్నాను - ఇంటి కొచ్చే సరికి ఆలస్యం అవుతుంది." అన్నాడు భూలోకం నుంచే గట్టిగా అరుస్తూ.
"అలాగే బాబూ, కానీ ఓ విషయం గుర్తుంచుకో - భూలోకంలో ఉండగా నీ మహిమ మూడు సార్లు మాత్రమే పని చేస్తుంది. ఆ తరువాత అరచి గీ పెట్టినా లాభం ఉండదు -"
"అలాగే"
మరుక్షణంలో వినాయకుడు మద్రాస్ నగరంలోని పాండీ బజారులో పుట్ పాత్ మీద నిలబడి ఉన్నాడు. అలా అయిదు నిమిషాలు నిలబడ్డాడో లేదో ఓ వ్యక్తి వచ్చి పలకరించాడు.
"అచ్చం వినాయకుడి ఫేస్ కట్ ఉంది మీకు. సినిమాల్లో వేషం కోసం వచ్చారా?" అనడిగాడు కుతూహలంగా.
"నేనే వినాయకుడినయ్యా - సినిమా తీద్దామని వచ్చానిక్కడికి " అన్నాడు వినాయకుడు.
"సినిమా తీస్తారా?" అడిగాడా వ్యక్తి ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ.
"అవును! ఓ మాంచి భక్తీ రస ప్రధానమైన చిత్రం నిర్మించి తద్వారా ప్రజల్లో దైవభక్తిని పెంచాలని నా ఆశయం."
ఆ వ్యక్తి అనందం పట్టలేక అక్కడికక్కడే స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోబోయాడు. కాని వినాయకుడు అతను పడిపోకుండా తన తొండంతో పట్టుకున్నాడు.
వెంటనే ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు.
"ఇంతకూ నువ్వెవరివి వినాయకా?" అడిగాడు వినాయకుడు..
"అయ్యో! నేనెవరో మీకు తెలీదా? నైన్టీస్ సెవెంటీ ఫైవ్ ఆగస్ట్ మూడో తారీఖు న్యూస్ పేపర్లు మీరు చూళ్ళేదా?" ఆశ్చర్యంగా అడిగాడా వ్యక్తి.
"లేదు!"
"అందుకే అలా అడుగుతున్నారు. అంతకు ముందు రోజున తెలుగు ప్రజలందరూ కలిసి రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున నాకు సన్మానం చేసిన వార్తలే ప్రచురించారు పేపర్ల నిండా!"
"సన్మానం ఎందుకు?"
"ఎందుకా? ఇలాంటి చచ్చు ప్రశ్న ఇంకెవరయినా అడిగితె ఊరుకునే వాడిని కాదు. లేపోతే ఏమిటండీ! నేను డైరెక్ట్ చేసిన డజను సినిమాలు శతదినోత్సవాలు చేసుకోవడం గొప్పకాదు? అలాంటి మహత్తరమయిన డైరక్షన్ చేసినందుకు నాకు సన్మానం చేయోద్దూ మరి? ఇప్పుడు మనం తీయబోయే భక్తీ రస చిత్రం ద్వారా కూడా తప్పక రెండొందల్రోజులు పిక్చరవుతుంది."