Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 21


    ఇంతసేపు శివాజీ దృష్టులు మధుపములై గురుదేవుని వదన కమలము నుండి మరలనే లేదు. శివాజీ తనముందుఁ జూచుచున్నది దాదాజీనిగాదు - 'పరమశివుని'. ఇప్పటి నుండి దాదాజీ విశ్వామిత్రుడు - శివాజీ శ్రీరామచంద్రుడు; దాదాజీ పరమేశ్వరుడు - శివాజీ పరశురాముడు.


                              3


    అదిబిజాపురపు సుల్తాను కొలువుకూటము. సింహాసనాసీనుఁడగు ఆదిల్ శాహి నవాబు మొగ మేలకో జేవురించెను. అతని చూడ్కులు సెగల పొగల నెగయించు చుండెను. వీరులు - రాజకీయోద్యోగులు తమ తమ యాసన ములఁ గిక్కురుమనక కూర్చుండి యుండిరి.
    సుల్తాను మేఘగర్జనవంటి స్వరముతో "గోటితోఁ ద్రుంచివేయఁగల దానికి గొడ్డళ్ళ యవసరము వచ్చినది. మన శహాజీ కుమారుఁడెంతవాఁడైనాఁడు! అపార సేనావాహినితో విజృంభించి మన భూభాగమును గ్రమక్రమముగ నాక్రమించి బలవత్తరములగు దుర్గముల నిర్మించి 'స్వతంత్ర మహారాష్ట్రము'ను స్థాపించు దీక్షతో నిరంతరము కృషిసాగించుచున్నాడు. శహాజీపై గల ప్రేమ పక్షపాతముచే మన మూరకొన్న కొలది వాని యాగడము మితిమీరుచున్నది. ఆలస్యముచే నమృతము విషమగును. మన రాజ్యమునకే భంగము వాటిల్లునేమో! ఇందుకు మీ సలహాయే?" మనెను.
    అంత నొక సరదారు లేచి యిట్లనెను. 'ఖుదావంద్! తోరణగఢము జయించిన నాటినుండి శివాజీకిఁబట్టపగ్గములు లేకున్నవి. అతని దండుకుఁగొండలు, అడవులు కొట్టిన పిండి. మన కా పర్వతప్రాంతములు క్రొత్తలు కాన వానిని జయించుట తేలిక పనిగాదు.'
    మరియొక్కడు :- శహాజీని బంధించి మనము వేసిన యెత్తు పనిచేయలేదు. అతడు మనకు లొంగిరాఁడు సరి గదా, సమాధానము గూడ పంపలేదు.
    వేఱొకఁడు :- ప్రభూ! శహాజీని జంపివేసిన?
    ఇంకొకఁడు :- ఖుదావంద్! అది చాల ప్రమాదము. అది జరిగిన వెంటనే వాఁడు క్రోల్పులివలె మనపైఁ బడును.
    అని తల కొకటిగా విన్నవించిరి.
    అంత 'ఆదిల్ శాహి' కోపముతో 'ఏమి! ఒక కొండ యెలుకను బట్టి తెచ్చువీరు లిట లేనేలేరా? ఖామోష్. అందఱు పుస్తీలు పెంచుకొన్నవారే! జబ్బలు మెలిదిరిగిన జట్టీలే!' అని కఠినముగ నొవ్వనాడెను.
    కొలువులోనివా రొకరిమొగ మొకరు చూచుకొన సాగిరి. కొందఱు నేలచూపులు చూచిరి. మరికొందఱు తమ్ముఁ గాదన్నట్లు పైకప్పు దూలములు లెక్కించిరి.
    సభలోనివారి చూడ్కులన్నియు నొక్కసారిగాఁబరువెత్తి నిజాసనము నుండి లేచిన యొకవీరునిపై వ్రాలినవి.
    అతఁడు స్వామిభక్తి పరాయణుఁడు - ఉన్నత పదవీ వ్యామోహితుఁడు - మతాభిమానధనుఁడు - తంత్రోపాయకుశలుఁడు - దురహంకారుఁడు నగు 'అఫ్ జుల్ ఖాను.'
    అఫ్ జుల్ ఖాను గంభీరముద్ర నభినయించుచుఁ మెల్ల మెల్లగ 'తక్తు' నొద్దకు నడచివచ్చి నేలకువంగి సలాము చేసి 'జహాపనా! వీఁడు నమ్మినబంటుగదా! పనిగొనుఁ'డనెను.
    ఆదిల్ శాహి విప్పారిన మోముతో 'సెహబాస్! యోధాగ్రేసరా! నీ వొక్కఁడవే యందులకు సమర్థుడువు! నీవు బెబ్బులివి; అతఁడు జింక; జయము నీదే. శివాజీ రేపు మన వంటయింటి కుందేలు. సేనాసమేతుఁడవై రేపే కదలుము. ఇదిగో ఖడ్గ'మనెను. అఫ్ జుల్ ఖాను 'మహాప్రసాద'మని కృపాణముగైకొని తుది సలాము పెట్టెను.
    సభలోని వారందరు ఆదిల్ శాహికి - అఫ్ జుల్ ఖానునకు జయపెట్టిరి. సభాభవనము దద్దరిల్లెను.
    ఆ మహాజయ శబ్దములలో 'అమ్మయ్య! వీని పీడ మనకు నేఁటితో విడుగర - మనకేకాదు లోకమునకుఁగూడ-బత్తెము కాదు కాఁబోలు - కావున ముందునకు వచ్చినాఁడు. బుద్ధిః కర్మానుసారిణీ - ఇఁకనైన మనము హాయిగా బ్రతుకఁ గలము-' అనువాక్యములు సన్నసన్నగాఁ గలియకపోలేదు.
    నవాబు కొలువు చాలించెను.
    'బ్రతుకు జీవుఁడా' యని యెవరిదారిని వారు వెడలి పోయిరి. కాని కార్యభారమువలని గుండెబరువుతో దీర్ఘాలోచనాయత్తచిత్తముతో - నేల చూపులతో - మందగమనముతో నడుగులు లెక్కించుకొనుచు అఫ్ జుల్ ఖాను నిజనివాసము చేరుకొనెను.


                             4


    అది మంత్రలోచన మందిరము. అందు దీర్ఘ యోచనా పరవశుఁడై 'శివాజీ' కూర్చుండి యుండెను.
    ఇంతలో నొక మహారాష్ట్ర సేనాపతి తన వెంటనొక పచ్చల పల్లకితో వచ్చి బహిర్ద్వారమున నిలిచి ముకుళిత కరుఁడై శివాజీ వైపు చూచెను.
    శివాజీ - ఏమి? సేనాని! ఈ పల్లకి నిటేల కొనివచ్చితివి? ఇందె వరున్నారు?
    సేనాపతి - ఇది తమ కుపాయనము. ఈమె కొంకణ దేశపు సుబేదారు 'మౌలానా అహమ్మదు' గారి కోడలు. యుద్ధములో మేన చేఁజిక్కినది.
    శివాజీ - 'నీవు శివాజీ సేనాపతివేనా? మూర్ఖుఁడా? భవాని సాక్షిగాఁగైకొన్న శపథములనే గంగ పాలొనర్చితివి! పరస్త్రీలను గౌరవింపవలసిన పద్ధతు లెఱుఁగవా?' సేనాపతి సిగ్గుతోఁ దలవంచుకొనెను.
    తరువాత శివాజీ పల్లకీని సమీపించి 'సోదరీ? మా సేనాపతి నీ యందపరాధమొనర్చినాఁడు. క్షమింపుము. నీభర్తృ గృహమునకు నిన్ను సురక్షితముగఁ జేర్చు భారము నాది. సర్వము సిద్ధము గావింతును. భయపడకు'మని యామెను బంపివేసెను. మరల శివాజీ హృదయ మాలోచనాయత్తమయ్యెను.
    అఫ్ జుల్ ఖాను మదాంధుఁడు - కపటి - ఆదిల్ శాహికుడిభుజము. వచ్చినవాఁడు యుద్ధసన్నాహ మొనర్పక సంధి నడపుట కేమి కారణమొ? మంతనములాడ నేకాంత సమావేశ మఁట! కానిమ్ము. వాని యంతు తేల్చుకొన వలసినదే. "శఠేశాఠ్యం సమాచరేత్" - అని వితర్కించు కొని శివాజీ వెంటనే కవచ శిరస్త్రాణముల ధరించి, పైకిఁ గనఁబడఁకుండఁ దగిన దుస్తుల నలంకరించుకొని, కత్తినొక దానిని గుప్తముగ మొలలోఁ జెక్కి, పులిగోళ్ళను వ్రేళ్ళ కమర్చుకొని యంత లంతలఁబొంచియుండ సైనికుల కాజ్ఞ నిడి భవానీదేవిని యథావిధిఁ బూజించి తల్లి దీవెన నందుకొని రహస్య సమావేశ మందిరమున కేఁగెను.

 Previous Page Next Page