Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 20


                         ఆదర్శ భారతము

                                                1

    ఆ కొట్లాట యెప్పటినుండి జరుగుచున్నదో బాలురందఱు పూర్తిగా నలసిపోయినారు. కాని వారి యుత్సాహము మాత్రము తగ్గలేదు. ఆ సింహద్వారముకడ బయట నుండి కొందఱు - లోనుండి కొందఱు ద్వార రక్షణ సేయుచుండిరి.
    బయటనుండి పోరుచున్న దళ మొక్కుమ్మడి సింహద్వారము నొక్క త్రోపు త్రోసిరి. ఆ దెబ్బతో నది తెఱచు కొనెను. లోనుండి రక్షించుచున్న వారిలోఁ గొందఱు క్రిందఁ బడిరి. 'కోట చిక్కినది; లోనికిఁ బొం'డని కేక వినబడినది. అందఱు లోనికి నెట్టుకొని పోయిరి. ఇంతలో 'శివాజీకి జై' అను నినాదము బయలుదేరినది.    
    అది యొక కోలాహలము. ఆ కోలాహలములోఁ బట్టాభిషేకము. అయిదారేండ్ల పాల బుగ్గల పసిబాలు నొక యరుగుపై కూర్చుండఁ బెట్టిరి. అతని కిరువైపుల భటులు నిలిచిరి. ఒక బాలుఁడు - రాజగురువఁట - అతని చిన్నారి మోముపై తిలకమద్ది, అట్ట కిరీటము తలపై నుంచి చప్పట్లు కొట్టినాఁడు.
    తరువాత కోటలోఁ జిక్కిన బందీల నొక్కొక్కరినే మహారాజుగారి యెదుటకుఁ గొనివచ్చిరి. మహారాజుగారు విచారించి 'దోషులను శిక్షించి, నిర్దోషులను విడిపింపుఁ'డనెను.
    ఇంతలో 'శివా' యను పిలుపు వినఁబడెను. సభ యంతయు స్తంభించెను. అందరి దృష్టులటు ప్రసరించినవి. రాజుగారు సయితము తాను 'మహారాజు' ననుమాట మఱచి 'అమ్మా'యని యరుగు దిగి పరుగెత్తిపోయెను.
    జీజాబాయి పూజాపాత్రధరించి భవానీ మందిరమున కేఁగుటకై గృహాంతర్భాగము నుండి వెలుపలకు వచ్చెను. ఆ కన్నతల్లి తన చిన్నారి కొమరు నెత్తుకొని, ముద్దాడి 'ఏమి నాయనా! ఆడుచున్నా'రని ప్రశ్నించెను. బాలశివుఁడు జిలిబిలి పలుకులతో "యుద్ధాల ఆటమ్మా! మేము కోటను బట్టుకొన్నా"మనెను. "కోట యేది నాయనా!" యని తల్లి ప్రశ్నించెను. బాలుఁడు 'ఉత్తుత్తి ఆటేనమ్మా! మనయిల్లే కోట'యనెను.
    ఆ పలుకులలో నామెకేదో యఖండ మగునానందము గోచరించెను. 'నేఁడు విజయదశమి. భవానీమత నర్చించి వత్తము ర'మ్మని జీజాబాయి బాలశివుని వెంటఁ బెట్టుకొని దేవి మందిరమున కరిగెను.
    ఉత్సవకోలాహలముతో నాలయమంతయు నిసుక వేసిక రాలనట్లుండెను. భవానీదేవి విజయాలంకార విరాజమానయై దర్శకుల కొక వింత యుత్సాహముదయింపఁ జేయుచుండెను. మౌళి భాగమున మణిమయ కిరీటము - ఒక చేత ఖడ్గము - ఒక చేత డాలు - ఇంకొక చేతిలోఁ జక్రము - వేరొక చేతిలోఁ ద్రిశూలము మెరయుచుండెను. ఇట్లాయుధపాణియై సింహవాహనరూఢయై యున్న భవానీ మూర్తి భీరువులకు భయము - ధీరులకు ధైర్యము గలిగించుచుండెను.
    వీరమాత జీజాబాయి భక్తిశ్రద్ధలతో దేవి నర్చించి, బాలశివుని దేవి పాదములపై మోకఱింపించి యిట్లు ప్రార్థించెను. "జగజ్జననీ! భువనపావనీ! భవానీ! నీ వరప్రసాదమగు నీ బాలు నెట్లనుగ్రహింతువో! భర్తృ పరిత్యక్తనై పడరాని యిడుమలఁ బడుచు నీ నిసుఁగును బెంచుచుంటిని. నలుమూలల నధర్మము తాండవమాడుచున్నది. పూత లగు గోమాతలకు సయితము జీవితము దుర్భర మగుచున్నది. రాజుల నిరంకుశత్వమునకు బ్రజలు బలి యగుచున్నారు. తల్లీ! భరత భూమిని సముద్ధరింపుము. అమ్మా! ఈ నా బిడ్డ వీరాగ్రేసరుఁడై - సాధుజన విధేయుఁడై - పవిత్రాశయుడై - మహోదారుఁడై - దివ్య తేజస్వియై - స్వతంత్ర సామ్రాజ్యాధినేతయై వర్ధిల్లునట్లనుగ్రహింపుము. భవానీ! నీ పాదపద్మములపై నున్న యీ కుంకుమమే నా బిడ్డనిలలాటమున దీక్షాతిలక మగుఁగాక!"
    ఇట్లు ప్రార్థించి పూజా కుంకుమము తీసి కనుల కద్దికొని, తాను ధరించి, కుమారుని మోమునఁబెట్టెను. శివుఁడు తామర మొగ్గవంటి యంజలిని ఫాలమునఁ గీలించి భవానికివందన మాచరించెను. ఆ బాలుని లేఁత మనస్సులో లేచిన భావ తరంగము లెట్టివో యెవరు చెప్పఁగలరు?


                               2


    'శ్రీరామచంద్రుఁడు మాయాకురంగముచే వంచింపఁబడక యాశ్రమ మందే యున్నచో నా దుష్ట రావణుని జీవములతోఁ బోనిచ్చునా అమ్మా?'
    'అందుకే రావణుఁడు మారేచునిఁ గపట మృగాకృతిగా ముందంపెను. నీచులకు వంచనములే ప్రధాన సాధనములు గదా నాయనా!'
    'శ్రీరాముఁడు రావణునకుఁ జేసినా ద్రోహ మిసుమంతయైనను లేదే!'
    'అక్కఱ లేరు బాబూ! సహజముగా దుర్జనులు సజ్జనులకు నిర్హేతుక శత్రువులు.'
    'శ్రీరాముఁడు భగవంతుడే కదా అమ్మా"
    'అవును దుష్ట శిక్షణ - శిష్ట రక్షణార్థము భగవానుడప్పు డప్పుడు భువినవతరించును. రామకృష్ణాదు లట్టి వారే. శ్రీరాముఁడు పదునాలుగు వేల రక్కసుల యుక్కడగించి ధర్మరక్షణము గావించెను. కృష్ణుఁడు భారతయుద్ధము నడపించి ధర్మసముద్ధరణ మొనరించెను. ధర్మచ్యుతిని భగవంతుఁడు సహింపడు. కావుననే ఆయన కీయవతారముల ప్రసక్తి.'
    పైవిధముగా మాతాపుత్రులకు సంభాషణ సాగి పోవుచుండెను. దౌదవ్వులనుండి యెవరో వచ్చుచున్నట్లు పొడఁగాంచి జీజాబాయి లేచి నిలువఁబడెను.
    వచ్చుచున్న వ్యక్తి మరెవ్వరో కాదు; గురుదేవుఁడగు 'దాదాజీ'యే.
    వారుభయులు గురుదేవునకు సాష్టాంగనమస్కార మొనర్చిరి.
    మువ్వురును ముఖమంటపమునం దుపవిష్టులైరి.
    అంత జీజాబాయి 'దాదాజీ! మీరు పరమపూజ్యులు. ధర్మస్వరూపులు. నా బిడ్డని ధనుర్విద్యాది సర్వశాస్త్ర పారంగతు నొనర్చి నాకోర్కెను దీర్పుఁడు. వీనిని ధర్మవీరునిగా సరిదిద్దు భారము సర్వము మీదియే. వీనిపైఁ బెద్ద యాశఁ బెట్టుకొంటి'నని యశ్రుపూరిత నయనయై వేడుకొనెను.
    దాదాజీ ప్రసన్న వీక్షణముల శివునిపైఁ బఱపి - "అమ్మా! వీని భవితవ్యము మహోజ్జ్వలము. నాఁడు గరుడుఁడు మాతృదాస్యము రూపు మాపినట్లే నేఁడు నీ వాడుఁ యావద్భారతదేశము నలముకొన్న దాస్యాంధ కారమును బటాపంచలుచేసి "స్వతంత్రమహారాష్ట్రము'ను స్థాపించును. ఇది భవానీదేవి యా దేశము - ఆశీర్వాదము. నా కర్తవ్యమును మరవను. వీఁడచిర కాలములో నా శిక్షణనంది వీరాధివీరుఁడగును. నీవు 'వీరమాత' వగుదువు. మహారాష్ట్రుల పుణ్యములతోఁబాటు దుండగుల పాపము ఫలించును. అందులకే 'శివు'డు ఉదయించినా"డని పలికెను.

 Previous Page Next Page