శ్రావణ శుక్ల చవితి.. సాయంత్రంలోపు ఇలా చేస్తే తలపెట్టే పనులలో విజయమే..!

శ్రావణ మాసం అంటేనే పండుగలు, వ్రతాల మాసం. ఈ మాసంలో ప్రతి ఇంట్లో కళ వచ్చేస్తుంది. కేవలం ఒక తిథి ప్రత్యేకం అని చెప్పలేము. ఈ మాసంలో ప్రతి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయా తిథిని బట్టి చేసుకునే పూజలు, పరిహారాలు, వ్రతాలు ఎనలేని పుణ్యాన్ని, ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ రోజు అంటే 28వ తేదీ సోమవారం రోజున చవితి తిథి ఉంది. సాధారణంగా చవితి తిథి అంటే వినాయకుడికి ఎంతో ప్రీతి. చవితి తిథి సోమవారం రోజు కలిసి రావడంతో దీనికి మరింత ప్రత్యేకత చేకూరుతోంది. ఈ రోజున వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే.. తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని, వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.
శ్రావణ మాసంలో సోమవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సోమవారాలలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ముఖ్యంగా శ్లాపణ మాసంలో మొదటి సోమవారం చవితి రోజే వచ్చింది. దీంతో ఈ రోజు వినాయకుడికి కూడా ప్రత్యేకత ఏర్పడింది. పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డ అయిన వినాయకుడికి ఈ రోజు సాయంత్రం లోపు గరికతో పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభించడం తథ్యం అంటున్నారు పురాణ పండితులు.
శ్రావణ మాసంలో తొలి సోమవారం రోజు కాబట్టి ఈ రోజు వివిధ సమస్యలకు వివిధ రకాలుగా ఆరాధనలు జరుగుతాయి. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహం దగ్గరకొచ్చి మరీ ఆగిపోతున్న.. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుని, వినాయకుడికి గరిక సమర్పించడం మంచిది. ఇలా చేస్తే వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఒకవేళ రుద్రాభిషేకం చేయించుకోలేకపోతే.. ఇంట్లోనే శివలింగానికి రుద్రం, నమకం, చమకం ఆడియో పెట్టుకుని అయినా శుద్ధమైన నీటితో అభిషేకం చేసుకోవచ్చు.
వివాహం జరిగి చాలా కాలం అయినా పిల్లలు పుట్టని వారు శ్రావణ సోమవారం రోజు ఆవుపాలతో శివాభిషేకం చేయించుకున్నా, లేక ఇంట్లో చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. నాగదోషం ఉన్నా పిల్లలు కలగడంలో ఇబ్బందులు, వివాహంలో ఆలస్యం కలుగుతూ ఉంటాయి. దీని కోసం శివుడికి అభిషేకం చేయించి నాగాభారణం సమర్పిస్తే మంచిది.
*రూపశ్రీ.



