లక్ష్మీదేవి ఆరాధనకు శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, కీర్తి    తెచ్చిపెట్టే దేవత. లక్ష్మీదేవి  కృప ఉంటే  కుటుంబంలో ఆనందం,  శ్రేయస్సు మాత్రమే కాకుండా ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది. దీనితో పాటు లక్ష్మీదేవి కృప ఉన్నవారి  జీవితం సుఖ సంతోషాలతో  విలసిల్లుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పులతో ఇబ్బంది పడేవారు శుక్రవారం సాయంత్రం కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు పురాణ పండితులు. శుక్రవారం రోజు సాయంత్రం ఏం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయో తెలుసుకుంటే..

శుక్రవారం నాడు దేవుడి గదిలో తప్పనిసరిగా  తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రం లేదా విగ్రహం ఉండేలా చూసుకోవాలి. పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఆ ఇంటి మీద ఉంటుంది.

శ్రీ యంత్రాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు.  శుక్రవారం నాడు శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించి నిత్యం కుంకుమ అర్చన,  కనకధార స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే అప్పుల బాధలు తొలగి ఐశ్వర్యం సిద్దిస్తుంది.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం శుక్రవారం సాయంత్రం తెల్లటి వస్తువులను దానం చేయాలి.  ఆహారం లేదా బట్టలు కూడా దానం చేయవచ్చు. ఈ సాధారణ పరిహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు దీపాలను వెలిగించాలి. దీని తరువాత  లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ చాలీసాను పఠించాలి. ఇలా చేస్తే  ఇంట్లో ఆనందం,  శ్రేయస్సు చేకూరతాయని నమ్ముతారు.

                               *రూపశ్రీ.


More Lakshmi Devi