ప్రముఖ హీరో, లెజండ్రీ దర్శకుడు, లెజండ్రీ రచయిత 'భాగ్యరాజ్'(Bhagyaraj)గారు నిన్న రాత్రి గుండెపోతో మరణించారు. తెలుగు పేక్షకులకి 'భాగ్యరాజాగా నాలుగుదశాబ్దాల నుంచే పరిచయస్తులు. తెలుగు నాట ఎంతో మంది దర్శకులు 'భాగ్యరాజా'కి వీరాభిమానులు. దక్షిణాది సినిమా ప్రపంచంలో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా, కథల రారాజుగా ఆయన సృష్టించిన ప్రభంజనం సామాన్యమైనది కాదు. కేవలం 16 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి, భారతీరాజా వంటి దిగ్గజ దర్శకుల వద్ద శిష్యరికం చేసి, ఆపై తానే ఒక బ్రాండ్గా ఎదిగారు. ముఖ్యంగా 1980 90ల కాలంలో ఆయన అందించిన సున్నితమైన కుటుంబ కథలు, సామాజిక అంశాలు, హాస్యం కలబోసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 100 శాతానికి పైగా విజయాలని నమోదు చేశాయి. తమిళంలో ఆయన కథ రాసినా, దర్శకత్వం వహించినా ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా కొల్లగొట్టాయి. అందుకే టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు ఆయన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేయడానికి అమితమైన ఆసక్తి చూపించారు. అలా తెలుగు చిత్రసీమలో రీమేక్ అయి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన భాగ్యరాజ్ చిత్రాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
భాగ్యరాజ్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన క్లాసిక్ చిత్రం 'అంతే 7 నాట్కల్' (Andha 7 Naatkal). ఒక ప్రేమికుడు తన ప్రియురాలి పెళ్లి వేరొకరితో అయిపోయినప్పుడు, ఆమె పసుపు కుంకుమల కోసం త్యాగం చేసే భావోద్వేగ భరితమైన కథ ఇది. ఈ చిత్రాన్ని తెలుగులో విశ్వవిఖ్యాత దర్శకుడు బాపు 'రాధా కళ్యాణం' (1981) పేరుతో రీమేక్ చేశారు. చంద్రమోహన్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో 175 రోజులకు పైగా ఆడి క్లాసిక్ హిట్ స్టేటస్ అందుకుంది. ఇదే సినిమాని హిందీలో అనిల్ కపూర్ హీరోగా 'వో సాత్ దిన్'గా రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించడం విశేషం. భాగ్యరాజ్ మార్క్ ఎమోషన్ ఎంత పవర్ఫుల్ అనేదానికి ఈ ఒక్క సినిమానే నిలువెత్తు సాక్ష్యం.
గ్రామీణ నేపథ్యంలో పెళ్లి, మొగుడు పెళ్లాల మధ్య వచ్చే చిన్నపాటి అపార్థాలను హాస్యస్ఫోరకంగా చూపిస్తూ భాగ్యరాజ్ రూపొందించిన 'తూరల్ నిన్ను పోచ్చు' (Thooral Ninnu Pochchu) చిత్రం తమిళంలో కనకవర్షం కురిపించింది. ఈ సినిమాను తెలుగులో సీనియర్ నటుడు శోభన్ బాబు హీరోగా, సుహాసిని హీరోయిన్గా 'పెళ్లి చూపులు' (1983) అనే పేరుతో రీమేక్ చేశారు. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి వినోదాత్మక అనుభూతిని పంచింది. కేవలం ఇవే కాకుండా, భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన 'సువరిల్లాద చిత్రంగళ్' తెలుగులో 'పేదల బ్రతుకులు'గా, 'ఒరు కై ఓసై' చిత్రం 'ప్రణయ గీతం'గా రీమేక్ అయ్యాయి. అలాగే ఆయన కథ అందించిన ఎన్నో చిత్రాలు తెలుగులోకి అనువాదమై, రీమేక్ అయి 80 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును సాధించాయి. అలాగే, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థిని మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో భాగ్యరాజ్ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ హిట్ 'సుందర కాండమ్' (Sundara Kandam). ఈ చిత్రం తమిళనాట మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఈ అద్భుత కథని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'సుందరకాండ' (1992) పేరుతో రీమేక్ చేశారు. కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా తెలుగులో 100కు పైగా థియేటర్లలో నేరుగా 50 రోజులు, అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని వెంకటేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇందులోని పాటలు, కామెడీ ట్రాక్ ఇప్పటికీ బుల్లితెరపై విశేషమైన రేటింగ్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వెంకటేష్, మీనా జంటగా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అబ్బాయి గారు కూడా తమిళంలో భాగ్యరాజ్ హీరోగా, దర్శకుడిగా చేసిన 'ఎంగా చిన్న రాసా' మూవీనే. మోహన్ బాబు, ఈవివి కాంబోలోనే వచ్చిన 'అదిరింది అల్లుడు' మూవీ కూడా భాగ్యరాజా చేసిన మూవీనే.ఇవే కాదు ఇలా ఎన్నో సినిమాలు, కథలు భాగ్యరాజా ప్రేరణతోనే తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ విధంగా ఆయన రాసుకునే స్క్రీన్ప్లే లోని మ్యాజిక్, సామాన్యుడిని సైతం కట్టిపడేసే కథన శైలి టాలీవుడ్పై చెరపని ముద్ర వేసింది. నటుడుగా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించారు.