
ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ (Baahubali) సిరీస్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని, మార్కెట్ పరిధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దేవసేనగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) చూపించిన నటన, వెండితెరపై వారి మధ్య పండిన అద్భుతమైన కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, మేకర్స్ ‘బాహుబలి: ది టార్చ్బేరర్’ అనే పేరుతో ఒక క్రేజీ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
ఈ డాక్యుమెంటరీలో బాహుబలి సినిమా మేకింగ్ వెనుక ఉన్న ఎన్నో తెలియని రహస్యాలు, ఆసక్తికరమైన సంఘటనలతో పాటు, నటీనటులు షూటింగ్ సమయంలో పంచుకున్న ఎమోషనల్ జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డ ఇలా చిత్ర బృందమంతా తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చెప్పిన విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ డాక్యుమెంటరీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను, ముఖ్యంగా ప్రభాస్-అనుష్క అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రధానాంశం ఒకటుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్, అనుష్క మళ్లీ ఒకే ఫ్రేమ్లో పక్కపక్కనే కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.

గత కొన్ని ఏళ్లుగా ప్రభాస్, అనుష్కల వివాహం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ, తామిద్దరం కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ, వీరిద్దరినీ ఒకే స్క్రీన్పై చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎల్లప్పుడూ ఆశపడుతుంటారు. తాజాగా విడుదలైన విజువల్స్లో అనుష్క ట్రెడిషనల్ గ్రీన్ కలర్ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోగా, ప్రభాస్ స్టైలిష్ బ్లాక్ అవుట్ఫిట్లో రాయల్ లుక్తో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత ఈ టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ ఒకే చోట కూర్చొని కెమెరా ముందుకు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ అరుదైన దృశ్యాలను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్లు చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "దయచేసి మా అన్నా వదినలకి ఎవరైనా దిష్టి తీయండి", "ఇద్దరినీ ఇలా ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయి", "మా ఆల్టైమ్ ఫేవరెట్ జంట మళ్లీ కలిసింది" అంటూ నెటిజన్లు ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం వీరిద్దరి కెరీర్ విషయానికి వస్తే, అనుష్క శెట్టి సినిమాల వేగాన్ని కాస్త తగ్గించగా, ప్రభాస్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి2' సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.






