స్వయంభూ విఘ్నేశ్వరుడు - చోడవరం

విశాఖజిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, విఘ్నేశ్వరాలయాల్లో ఆలయ మూర్తులు స్వయంభువులు. వీటికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖజిల్లాలో ఈ రెండు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ వుంటారు. చోడవరానికి తూర్పు ముఖంలో వున్న ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో దీనిని మత్స్యగణపతిగా పేర్కొంటారు. శ్రీ గౌరీశ్వరుడు, మత్స్యవంశంపు రాజు కలలో కనిపించి చోడవరం కోట వున్న చోట తవ్వకాలు జరిపించగా చుట్టూ గంగాజలంతో కూడిన శివలింగం బయల్పడటంలో అక్కడే ఆలయ నిర్మాణం చేశారు.

ఆనాటి మత్స్యవంశీయుల కోట దిబ్బలు నేటికి దర్శనమిస్తాయి. అటు తరువాత తురుష్కుల దాడిలో ఆలయంతో పాటు గౌరీశ్వరస్వామి లింగాకృతి సైతం చిన్నాభిన్నమయ్యాయి. అప్పటి నుంచి ఈ ఆలయంలో గౌరీశ్వరుడు పుట్ట ఆకృతిలో ఉండడంతో దీని స్థానంలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒక్కటైన కాశీ నుంచి రప్పించిన కొత్త లింగాన్ని ప్రతిష్టించాలనుకున్నారు.

కానీ స్వయంభూ విగ్రహానికి మాత్రమే పునఃపూజలు జరిపించవలసిందిగా స్వామి కలలో కన్పించి చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఆలయ మండపంలోని నాలుగు స్తంభాలు నంది విగ్రహం సింహాచల దేవస్థానం శిల్పకళను పోలి వుండటం కూడా మత్స్య వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు భావించడానికి మరో కారణం. ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ
విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు. ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది.

సుమారు 200 సంవత్సరాల నుంచి స్వయంభూ విఘ్నేశ్వరుని దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడి విఘ్నేశ్వరుని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది. తొండం చివరి భాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి. ప్రస్తుతం పాత చెరువు ఒడ్డున ఉన్న ఈ దేవాలయంలో వెలసిన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని గౌరీశ్వరఆలయంలోకి తరలించడానికి తవ్వకాలు జరిపించగా తొండం భాగం ఎంత దూరం తవ్వినా చివర కన్పించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని, తవ్విన ప్రాంతాన్ని ఏనుగు బోదెగా పిలుస్తూ చెరువు నిర్మాణంగా పాతారని పూర్వీకులు కథనం.


More Vinayakudu