అడివి శేష్కు బాగా ఇష్టమైన 'గూఢచారి సినిమా' విడుదలై నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సర్ప్రైజ్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆ సినిమా నిర్మాణ కాలంలో వివిధ దశలకు చెందిన ఘటనలను జ్ఞాపకం చేసుకున్నాడు శేష్. వాటితో పాటు తన టీమ్ ఎదుర్కొన్న సవాళ్లనూ వెల్లడించాడు. 'గూఢచారి' సీక్వెల్ను ఈ ఏడాది దసరాకు ప్రారంభించాలని గతంలో శేష్ ప్లాన్ చేసుకున్నాడు. ఈలోగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్గా తయారవుతున్న 'మేజర్'ను పూర్తి చేయాలనుకున్నాడు. కానీ శేష్ ఒకటి తలిస్తే, కరోనా ఇంకోటి తలిచింది.
అయినప్పటికీ, క్వారంటైన్ పీరియడ్లో లభించిన సమయాన్ని 'గూఢచారి 2' స్క్రిప్ట్గా మరింత బాగా పనిచేయడానికి వెచ్చించాడు శేష్. కథ రెడీ అయ్యిందనీ, స్క్రీన్ప్లే వర్క్ జరుగుతోందనీ అతను వెల్లడించాడు. మరో విషయమేమంటే ఈ స్క్రిప్టును తన అభిమాన దర్శకుడు పూరి జగన్నాథ్కు చూపించి, ఆయన సలహాలు తీసుకుంటానని కూడా చెప్పాడు. 'గూఢచారి 2' శేష్ కెరీర్లోనే బిగ్ బడ్జెట్ మూవీగా రూపొందనున్నది. దీనిని కూడా శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేయనున్నాడు.