![]() |
![]() |
‘కింగ్డమ్’ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్కి పింక్ కలర్ చీరలు కట్టుకొని ముసుగు వేసుకున్న 10 మంది మహిళలు వచ్చారు. వారిని చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఎవరు వీళ్ళు అన్నట్టుగా అక్కడి జనం వారిని చుట్టుముట్టారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా రూపొందిన ‘పరదా’ చిత్రానికి సంబంధించి చేసిన వెరైటీ పబ్లిసిటీ అది. ఆగస్ట్ 22న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రేక్షకులకు మరింత రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో పబ్లిసిటీ విభిన్నంగా చెయ్యాలని భావించారు మేకర్స్. అందులో భాగంగానే ఆ మహిళలు థియేటర్కి వచ్చారు. వారితోపాటు పరదా చిత్రానికి సంబంధించిన టీ షర్ట్స్ వేసుకున్న యువకులు కూడా అక్కడికి రావడంతో జనానికి అప్పుడు అర్థమైంది.
ఏ ప్రొడక్ట్ని అయినా తయారు చేయడం ఈజీనే. దాన్ని మార్కెటింగ్ చేయడమే కష్టం. సినిమాకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రమోట్ చేస్తుంటారు. అయితే పరదా చిత్రానికి సంబంధించి చేసిన వినూత్న ప్రయోగం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమా గురించి తెలియని వారికి కూడా పరదా అనే సినిమా ఆగస్ట్ 22న రాబోతోందనే విషయం తెలిసింది. సినిమా బండి, శుభం చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
‘పరదా’ చిత్రం అంతా హీరోయిన్ ముసుగులోనే కనిపిస్తుంది. పరదా వెనుక ఒక మహిళ జీవితం ఎలా సాగింది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలా పరదా వేసుకున్న మహిళలతో వెరైటీ పబ్లిసిటీ చేశారు. పింక్ కలర్ చీరలు కట్టుకున్న మహిళలు మొదట కింగ్డమ్ థియేటర్లో సందడి చేశారు. ఆ తర్వాత మెట్రో రైలులో కూడా వీరు ప్రయాణించారు. ప్యాసింజర్స్ అంతా ఎంతో ఆసక్తిగా వారిని గమనించారు. అయితే ఏదో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అనే విషయం చాలా మందికి అర్థమైపోయింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పరదా’.
![]() |
![]() |