![]() |
![]() |

'గుంటూరు కారం' సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ని తీసుకోవడంపై మహేష్ బాబు అభిమానులు ముందు నుంచి వ్యతిరేకించారు. ఎందుకంటే మహేష్ గత చిత్రం 'సర్కారు వారి పాట' సంగీతం విషయంలో వారు సంతృప్తి చెందలేదు. పాటలు కొంతవరకు పరవాలేదు అనిపించినప్పటికీ.. నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే 'గుంటూరు కారం'కి తమన్ ని తీసుకోవద్దని డిమాండ్ చేశాడు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం తమన్ వైపే మొగ్గు చూపాడు. ఎందుకంటే ఆయన గత చిత్రం 'అల వైకుంఠపురములో' విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. అందుకే తమన్ మీద నమ్మకంతో త్రివిక్రమ్ అతనికే అవకాశమిచ్చాడు.
ఇక చేసేదేం లేక, త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో మహేష్ అభిమానులు 'గుంటూరు కారం' పాటల కోసం ఎదురుచూశారు. మొదటి పాట 'ధమ్ మసాలా' ఫ్యాన్స్ ని ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా లిరిక్స్ కట్టిపడేశాయి. సాంగ్ 'అల వైకుంఠపురములో' రేంజ్ లో లేనప్పటికీ, బాగానే ఉందనే పేరుని తెచ్చుకోగలిగింది. దీంతో 'గుంటూరు కారం' చార్ట్బస్టర్ ఆల్బమ్ అవుతుందని అభిమానులు బలంగా నమ్మారు. అయితే తాజాగా విడుదలైన రెండో పాట 'ఓ మై బేబీ' విషయంలో మాత్రం వాళ్ళు ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. సంగీతం, సాహిత్యం ఏదీ కూడా మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులైతే "ఓ మై తమన్.. ఇదేం పాట" అంటూ సోషల్ మీడియా వేదికగా తమన్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం పాట వినగా వినగా నచ్చుతుందని, ఇలా తొందరపడి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
![]() |
![]() |