Home  »  News  »  ఆదర్శంగా నిలవాల్సిన స్థితి నుంచి అధమస్థాయికి పడిపోయిన దర్శన్‌!

Updated : Jun 13, 2024

సినిమా రంగంలో హీరోగా నిలదొక్కుకొని ఒక స్థాయికి రావాలంటే కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరం. పాత తరం హీరోలను తీసుకుంటే ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి వచ్చిన వారే. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని తర్వాత తారాపథంలో దూసుకుపోయారు. అలాంటి హీరోలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాతి కాలంలో వారి వారసులు అలాంటి కష్టాలు ఏమీ అనుభవించకుండానే హీరోలుగా ఎంట్రీ ఇచ్చి వారి ప్రతిభతోనే స్టార్‌ హీరోలుగా వెలుగొందుతున్నారు. అలాంటి హీరోల మధ్యలో ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తమ ప్రతిభతో, స్వయంకృషితో టాప్‌ హీరోలుగా ఎదిగినవారూ ఉన్నారు. ఇలాంటి విషయాల్లో మెగాస్టార్‌ చిరంజీవి పేరును తప్పకుండా ప్రస్తావిస్తారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది హీరోలు టాలీవుడ్‌కి వచ్చారు. 

ఇక అసలు విషయానికి వస్తే.. కన్నడ సినిమా రంగంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న దర్శన్‌కి కూడా అభిమానగణం ఎక్కువే. కిందిస్థాయి నుంచి టాప్‌ హీరో రేంజ్‌కి ఎదిగిన దర్శన్‌ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అక్కడి ప్రేక్షకులు చెబుతారు. సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శన్‌ కొన్ని వివాదాల వల్ల అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటివరకు చిన్న చిన్న గొడవలతో వార్తల్లోకి ఎక్కిన దర్శన్‌.. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో నిందితుడిగా నిలబడ్డాడు. తన ప్రియురాలి మోజులో పడిన దర్శన్‌ తను ఏం చేస్తున్నాడో అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆమె కోసం హత్య చేయించే వరకు వెళ్లాడంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కన్నడ హీరోయిన్‌ పవిత్రగౌడతో చాలా సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నాడు దర్శన్‌. దాని వల్ల దర్శన్‌ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దానికి తోడు దర్శన్‌తో తను కలిసి ఉన్న ఫోటోలను పవిత్రగౌడ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండడంతో దర్శన్‌ కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేని దర్శన్‌ అభిమాని రేణుకా స్వామి.. తమ హీరో జోలికి రావద్దంటూ పవిత్రకు వార్నింగ్‌ ఇచ్చాడు. అంతే కాదు, కొన్ని మెసేజ్‌లు కూడా పెట్టాడు. దానికి పవిత్ర మనస్తాపం చెందింది. అతని అంతు చూడాలంటూ దర్శన్ ను రెచ్చగొట్టింది. తన ప్రియురాలిని వేధించడం తట్టుకోలేని దర్శన్‌ కిరాయి రౌడీలతో రేణుకా స్వామిని హత్య చేయించాడని అతనిపై అభియోగం మోపబడింది. 

దీంతో పోలీసులు దర్శన్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు అతన్ని విచారిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో ఎంతో ఆందోళనగా, మరెంతో దీనంగా కనిపించాడు దర్శన్‌. విచారణ సమయంలో తనకు చేతులు వణుకుతున్నాయని, ఒక్క సిగరెట్‌ ఇప్పించమని పోలీసులను వేడుకున్నాడట. పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రేణుకస్వామిని హత్య చేయమని తాను చెప్పలేదని దర్శన్‌ పదే పదే చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్వామిని మొదట కిడ్నాప్‌ చేసి ఒక షెడ్డులో బంధించి విపరీతంగా హింసించారు. దాంతో అతను మరణించాడు. ఈ హత్య చేసేందుకు దర్శన్‌ రూ.30 లక్షలు  చెల్లించాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పవిత్రగౌడను ఎ1గా, దర్శన్‌ను ఎ2గా చేర్చారు. వీరితోపాటు 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఈ హత్యను వ్యతిరేకిస్తూ వేలాది జనం రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దర్శన్‌ను శిక్షించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన స్థితి నుంచి ఒక్కసారిగా దిగజారిపోయి పోలీసుల అదుపులో నిస్సహాయ స్థితిలో ఉన్న దర్శన్‌ని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేణుకా స్వామి వంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలి తప్ప హత్య చేయించడం మార్గం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.