![]() |
![]() |

"నా ఇంట్లోకి నేను వెళ్ళటం ట్రెస్పాస్ ఎలా అవుతుంది ? నాకు సంబంధించిన కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తీసుకోవటానికి వెళ్ళాను... ఎంతసేపు బెల్లు కొట్టినా ఎవరూ గేట్ తీయకపోవడంతో గేట్ దూకి వెళ్ళాను. గతంలోనూ నేను అలా చాలా సార్లు చేశాను. సొంత ఇంట్లో తలుపులు తీయకపోతే ఎవరైనా చేసే పని అదే... కాబట్టి నేను ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు " - అంటూ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు దాసరి అరుణ కుమార్.
శనివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కాంపౌండ్ లో మీడియాతో మాట్లాడుతూ "మా నాన్నగారు దాసరి నారాయణరావు గారు చనిపోయే ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. కాబట్టి ఆయన ఉన్న ఇంటి మీద మా అన్నయ్యకు, నాకు, మా చెల్లికి సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి నా ఇంటికి ఎలాగైనా వెళ్లే హక్కు నాకు ఉంది. కానీ మానసిక స్థితి సరిగా లేని కారణంగా మా అన్న ప్రభు గతంలో కూడా చాలా సార్లు ఇలా మీడియాకు ఎక్కడం... పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేశాడు. ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వెళితే ఇలా మీడియాకు ఎక్కి రభస చేశాడు. నా పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నింటిలో అదే అడ్రస్ ఉంది. దానికి తోడు నాకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కొరియర్లో వస్తే దాన్ని కొరియర్ బోయ్ నుండి బలవంతంగా తీసుకున్నారు. కొరియర్ బోయ్ ఆ విషయం నాకు చెప్పగా అది తీసుకుందామని వెళితే ఇలా గొడవ చేసి 100కు డయల్ చేసి పోలీసులను పిలిపించాడు. కొద్ది సేపటికే వచ్చిన జూబ్లీ హిల్స్ ఎస్.ఐ. నవీన్ గారు గట్టిగా ప్రశ్నించడంతో ఆ డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చాడు... తాము ఫిర్యాదు చేయగా వచ్చిన పోలీసులే తమను గట్టిగా నిలదీయటంతో ప్రభు, అతని మామ అవి తిరిగి ఇచ్చారు. ఆ ఇంట్లో దాదాపు 15 మందికి పైగా ఎవరెవరో ఉన్నారు. సమయానికి పోలీసులు రావటం వారికంటే మాకే ప్రొటెక్షన్ అయ్యింది. ఇదీ జరిగింది" అంటూ 24వ తేదీ రాత్రి జరిగిన ఘటనను మీడియాకు వివరించారు దాసరి అరుణ్ కుమార్.
"దాసరి గారి మరణం తరువాత అమ్మిన కొన్ని ఆస్తుల తాలూకు తన వాటా ఇవ్వకుండా మీరు మోసం చేశారని ప్రభు ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి?" అనే ప్రశ్నకు "ఆరోపణ ఏం ఖర్మ... ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని పోలీసులు అడగటంతో మౌనంగా ఉండిపోయాడు. ఇలా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం అతనికి మామూలైపోయింది" అని చెప్పారు అరుణ్.
"ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చిరంజీవి గారు ప్రయత్నిస్తున్నారని, అందుకు సి. కళ్యాణ్ గారిని పురమాయించారు అని మీడియాలో వచ్చిన వార్త నిజమేనా?" అనడిగితే, "అలాంటిదేమీ లేదండి... మరి ఆ వార్త ఎలా వచ్చిందో తెలీదు... మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులోకి లాగటం భావ్యం కాదు" అని సమాధానమిచ్చారు.
"మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సి.కళ్యాణ్ గారు ఇందులో జోక్యం చేసుకొని పరిష్కరించాలి అని ప్రభు అంటున్నారు... మీకు సమ్మతమేనా?" అన్న ప్రశ్నకు, "అంత పెద్ద వాళ్ళు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి కదా... వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేసే పరిస్థితి కల్పించ కూడదు. గతంలో అలా చేయడంతో వాళ్ళు విసుగు చెంది వదిలేశారు. ఇప్పటికైనా వాళ్ళు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దితే నేను కృతజ్ఞడినై ఉంటాను" అన్నారు దాసరి అరుణ్ కుమార్.
![]() |
![]() |